Top Stories

యోగాలో శక్తివంతమైన ఆసనాలు ఏవంటే..!

యోగ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. యోగాలో చాలా రకాల ఆసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి కూడా ఉన్నాయి.  యోగాలో శక్తివంతమైన (Powerful) ఆసనాలు  శరీరానికి శక్తిని, స్థిరతను, సౌష్టవాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ఆసనాలు. ఇవి శారీరకంగా గట్టిగా ఉండటంతో పాటు మానసిక శాంతిని కూడా అందిస్తాయి. ఇవి శక్తి, సహనం, స్తైర్యం, ఫోకస్, ప్రాణశక్తి పెంచే విధంగా పనిచేస్తాయి. అలాంటి శక్తివంతమైన యోగాసనాలు ఏవో తెలుసుకుంటే.. శక్తివంతమైన యోగాసనాలు.. వీరభద్రాసనాలు..   వీరభద్రాసనాలలో మూడు రకాలు ఉన్నాయి.   ఇవి వేస్తుంటే శరీరానికి ధైర్యం, స్థైర్యం కలుగుతుంది. కాళ్ళు, చేతులు, వెన్నెముక బలపడతాయి. మనస్సు కేంద్రీకృతం అవుతుంది.  నౌకాసన (Boat Pose).. నౌకాసనం వస్తుంటే శరీరంలో మధ్య భాగం (core) శక్తివంతంగా తయారవుతుంది. అబ్డోమినల్ మసిల్స్, స్పైన్ బలపడతాయి. మానసిక దృఢత పెరుగుతుంది. బకాసన (Crow Pose).. బలమైన చేతులు, మోకాలుకు సపోర్ట్ కావాలంటే బకాసన వేయడం చాలా మంచిది. ఈ ఆసనం వేయడం వల్ల  ఫోకస్, సమతుల్యత అభివృద్ధి చేస్తుంది.  ధైర్యాన్ని పెంచుతుంది.  ఉర్ధ్వ ధనురాసనం (Upward Bow or Wheel Pose).. ఊర్థ్వ ధనురాసనం వేస్తే వెన్నెముక, గుండె, ఛాతీ తెరుచుకుంటాయి. ఇది  శక్తిని పంచుతుంది, ఉత్సాహం పెంచుతుంది. పరివ్రుత్త పర్వతాసన (Revolved Triangle Pose ) పరివృత్త పర్వతాసన వేయడం ద్వారా శరీరానికి లవణత (flexibility),  బలం ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీరాన్ని డిటాక్స్  చేయడంలో సహాయం చేస్తుంది.  అధో ముఖ శ్వానాసన (Downward Facing Dog).. అధోముఖ శ్వానాస వేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది.  ఇది శక్తిని పునరుత్తేజితం చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చతురంగ దండాసన (Low Plank).. చేతులు, భుజాలు, మధ్య భాగం బలంగా తయారవుతాయి. శక్తిని కేంద్రీకరించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాణాయామం తో కలిపితే.. శక్తివంతమైన ఆసనాలకు ప్రాణాయామం (విశేషంగా కపాలభాతి, బస్ట్రికా) తోడైతే శక్తి స్థాయి మరింత పెరుగుతుంది. సూచనలు: ఆసనాలు సాధన చేయడానికి ముందుగా మైల్డ్ వార్మప్ చేయాలి. శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యం. మొదట్లో శిక్షణ పొందిన గురువు సూచనతో చేయడం ఉత్తమం.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
యోగాలో శక్తివంతమైన ఆసనాలు ఏవంటే..! Publish Date: Jun 21, 2025 9:30AM

భారతీయుల ఆరోగ్య యోగానికి ఆది గురువు.. పతంజలి మహర్షి!

  ఈ రోజు యోగా డే అంటూ చాలా ఆడంబరంగా ఉత్సవాలలా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రధాని మోడీ గారు అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా ఈసారి యోగా డే దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అందులోనూ అన్ని రాష్ట్రాల చూపులు విశాఖపట్నం ఆర్.కె బీచ్ వైపై ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఈ రోజు యోగా అనేది విదేశీయులను కూడా ఆకర్షించే అంశం అయిపోయింది.  ఇది మనిషి ఆరోగ్యానికి జీవనాడి అయ్యింది.  అయితే ఈ యోగాను భారతీయులకు అందించినది పతంజలి మహర్షి. అందుకే యోగా డే  సందర్బంగా ఆ మహనీయుడిని గుర్తుచేసుకోవడం భారతీయుల కర్తవ్యం. అలాగే..  యోగా కోసం పతంజలి మహర్షి చేసిన కృషి,  ఆయన చరిత్ర తెలుసుకుంటే.. పతంజలి మహర్షి చరిత్ర వృత్తాంతం  భారత సంస్కృతిలో ఒక గంభీరమైన, ఆధ్యాత్మికంగా ప్రేరణాత్మకమైన గాథ. ఇది పురాణ, ఇతిహాస, ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. ఆయన ఒక భగవద్భక్తుడు, తత్త్వవేత్త, గొప్ప పండితుడు. ఆయన్ను మూడు ముఖ్యశాస్త్రాలలో విపులమైన కృషి చేసినవాడిగా గుర్తిస్తారు . ఆ మూడు ఏమిటంటే.. యోగశాస్త్రం, వ్యాకరణం (సంస్కృత వ్యాకరణం),  ఆయుర్వేదం.  ఆయన చరిత్ర వృత్తాంతం..  ఆదిశేషునిగా అవతారం.. పతంజలి మహర్షి, విష్ణుమూర్తికి సేవ చేసే ఆదిశేషుని అవతారంగా పరిగణించబడతారు. ఒక సందర్భంలో, విష్ణుడు తన హృదయంలో శివుని ఆనందతాండవాన్ని దర్శించుకుంటుండగా, ఆదిశేషునికీ ఆ తాండవాన్ని చూడాలనే కోరిక కలిగిందట. అందుకు అనుగుణంగా  విష్ణుమూర్తి ఆదిశేషునికి భూలోకంలో అవతరించాల్సిందిగా సూచించాడు. గోనికా తపస్సు & పతంజలి అవతారం.. విష్ణుమూర్తి ఆదిశేవును భూలోకంలో అవతరించమని ఆదేశించి  సమయంలో గోనికా అనే పతివ్రత స్త్రీ, సూర్య భగవానుని ప్రార్థిస్తూ  లోకానికి ఉపయోగపడే బిడ్డ కావాలని తపస్సు చేస్తూ, చేతులలో నిండుగా నీటిని తీసుకుని అంజలి ఘటిస్తూ అంటే నమస్కారం చేస్తూ అర్చించుకుంటున్న  సమయంలో పాము రూపంలో ఆదిశేషుడు ఆమె చేతుల్లోకి పడిపోయాడట. అందువల్ల ఆ బాలుని పేరు పతంజలి (పతనము + అంజలి) అని ఉద్భవించింది. నటరాజుని తాండవ దర్శనం.. పతంజలి మహర్షి తన తల్లిదండ్రుల వద్ద పెరిగి, తర్వాత చిదంబరం వచ్చినాడు.  అక్కడ శివుడు నటరాజు రూపంలో తాండవం చేస్తున్నాడని తెలిసి. అతనికి శివుని తాండవాన్ని చూసే అవకాశం లభించింది. నంది, భృంగిలు అతని శరీరాకృతిపై హేళన చేసినా, అతను నోరుతో “నటరాజ నవకం” అనే స్తోత్రాన్ని గానం చేసి శివుని ఆనందింపజేశాడు. ఈ నటరాజ నవకం అనేది పూర్తీగా డమరుక శబ్దంతో ఉంటుంది. నటరాజ నవకం విని సంతోషించిన శివుడు నిన్నునాట్యంలో భాగం చేస్తాను బాధపడకు అని చెప్పి  శివుడు అతనిని తన పాదాల చుట్టూ చుట్టి తాండవంలో భాగస్వామిని చేశాడు.  ఇది పతంజలి మహర్షి  భగవత్‌ ప్రేమకు సంకేతం.  త్రికరణ శుద్ధి లక్ష్యంగా విద్యాబోధన.. శివుని ఆశీర్వాదంతో పతంజలి, భూలోకానికి త్రికరణ శుద్ధి  అంటే మనస్సు, వాక్కు, కర్మ అనేవి  సాధించేందుకు మూడు శాస్త్రాలను అందించాడు. యోగశాస్త్రం – మనస్సు శుద్ధి కోసం వ్యాకరణం – వాక్కు శుద్ధి కోసం ఆయుర్వేదం – శరీర శుద్ధి కోసం శిష్యులకు బోధన.. పతంజలి 1000 మందికి బోధన ఇవ్వాలనుకున్నాడు. అందరి అర్హతలు భిన్నంగా ఉండటంతో, ఓ తెర వెనుక ఆదిశేషురూపంలో బోధించాడు. తెర ఎత్తవద్దని చెప్పినా ఒక శిష్యుడు అతని నియమాన్ని ఉల్లంఘించి తెర తీసేశాడు. దీంతో 999 మంది విద్యార్థులు కాలిపోయారు. మిగిలిన శిష్యుడికి పతంజలి మొత్తం విద్యను బోధించాడు, కాని అతను శాపగ్రస్తుడై బ్రహ్మ రాక్షసుడయ్యాడు. శిష్యుడిని శాప విముక్తుడిని చేసిన ఘట్టం.. ఆ బ్రహ్మ రాక్షసుడు జ్ఞానాన్ని బోధించగల అర్హుడిని వెతుకుతూ, సరైన జవాబు చెప్పని వారిని మింగేవాడు. చివరికి పతంజలి మహర్షి స్వయంగా శిష్యుడి రూపంలో (చంద్రశర్మగా) వచ్చి, సరైన సమాధానం ఇచ్చి, జ్ఞానం తీసుకొని శిష్యుడిని శాపం నుండి విముక్తుణ్ని చేశాడు. ఆ రాక్షసుడు తరువాత గౌడపాదాచార్యుడుగా అవతరించాడు. ఆయన రచనలు.. యోగ సూత్రాలు (196 సూత్రాలు) – యోగ దార్శనికశాస్త్రానికి ప్రామాణిక గ్రంథం. మహాభాష్యం – పాణినీ వ్యాకరణంపై వ్యాఖ్యాన గ్రంథం. ఆయుర్వేదానికి సంబంధించిన రచనలకూ ఆయనకు ఆపాదించబడింది, కానీ ఆధారాల పరంగా స్పష్టత లేదు.  జీవసమాధి స్థలం.. పతంజలి మహర్షి జీవసమాధి స్థలం తమిళనాడు, తిరుపత్తూరు (త్రిచీ దగ్గర)లోని బ్రహ్మపురీశ్వర ఆలయంలో ఉంది.  ప్రార్థన శ్లోకం.. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన। యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోఽస్మి॥ మనస్సు, వాక్కు, శరీరం శుద్ధి కోసం పతంజలిని ప్రణమిస్తాను అని ఈ ప్రార్థన అర్థం.                                     *రూపశ్రీ
భారతీయుల ఆరోగ్య యోగానికి ఆది గురువు.. పతంజలి మహర్షి! Publish Date: Jun 21, 2025 9:30AM

గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటి?  ఎలాంటి గ్రీన్ టీ ని ఎంచుకోవాలి?

  గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా లాభదాయకం. ఇది యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, ఫ్లేవనాయిడ్లు,  క్యాటెచిన్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరాన్ని డిటాక్స్  చేయడంలో, మెటబాలిజం పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అసలు గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటి? అలాగే ఎలాంటి గ్రీన్ టీ తీసుకోవాలి అన్న విషయాలు వివరంగా తెలుసుకుంటే.. గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు.. యాంటీఆక్సిడెంట్లు.. గ్రీన్ టీ లో ఉండే క్యాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా EGCG (Epigallocatechin gallate) కేన్సర్ కారక కణాల ఎదుగుదలని అడ్డుకుంటుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది.. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల బాడీ మెటబాలిజం పెరిగి కొవ్వు కాలే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గడంలో సహాయం.. ముఖ్యంగా పొట్ట భాగం కొవ్వు కరిగించడంలో గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. వ్యాయామంతో పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హృదయ ఆరోగ్యం.. గ్రీన్ టీ లో ఉండే పొటాషియం, ఫ్లేవనాయిడ్లు రక్తపోటు (BP) ని నియంత్రిస్తాయి, చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యం.. గ్రీన్ టీ లో ఉండే చిన్న మొత్తంలో కేఫిన్ మరియు L-theanine మానసిక ఉత్తేజకంగా పనిచేస్తాయి. ఇది మెమరీ, ఫోకస్ పెరగడానికి సహాయపడుతుంది.  టైప్ 2 డయబెటిస్.. గ్రీన్ టీ శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది, thereby షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.  చర్మం & వెంట్రుకల ఆరోగ్యం.. గ్రీన్ టీ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు వయస్సు ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇది చర్మాన్ని మెరుగు పరచడంతో పాటు పింపుల్స్ ను  తగ్గిస్తుంది. డీటాక్స్.. గ్రీన్ టీ ప్రాకృతికంగా శరీరాన్ని టాక్సిన్స్  నుండి శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఎలాంటి గ్రీన్ టీ ఎంచుకోవాలి? ఆర్గానిక్ గ్రీన్ టీ.. కీటకనాశకాలూ, కెమికల్స్ లేని ఆర్గానిక్ వేరియంట్లు తీసుకోవడం ఉత్తమం. ఇప్పట్లో చాలా ఆర్గానిక్ గ్రీన్ లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. లూజ్ లీఫ్ గ్రీన్ టీ,  టీ బ్యాగ్స్.. లూజ్ లీఫ్ గ్రీన్ టీలో ఎక్కువగా యాక్టివ్ పదార్థాలు ఉంటాయి. టీ బ్యాగ్స్ కొన్నిటిలో నానోప్లాస్టిక్ పదార్ధాలు ఉంటాయి . అందుకే  చూసి ఎంచుకోవాలి. ఫ్లేవర్ కలిపిన గ్రీన్ టీ..  జాగ్రత్తగా.. జింజర్, లెమన్, తులసి, మింట్ వంటి సహజమైన ఫ్లేవర్స్ ఉన్న గ్రీన్ టీ సరే. అయితే అతి తక్కువ శాతం టీ ఉండే, ఎక్కువ artificial flavor ఉన్నవి తీసుకోకూడదు. ఎప్పుడు తాగాలి? ఉదయం ఖాళీ కడుపు మీద తాగకూడదు. ఎందుకంటే ఇది ఆమ్లత్వం (acidity) కలిగించవచ్చు.  భోజనం తరువాత 30 నిమిషాల లోపల లేదా సాయంత్రం తక్కువ ఆకలిగా ఉన్నప్పుడు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. జాగ్రత్త.. రోజుకు 2–3 కప్పులు గ్రీన్ టీ సరిపోతుంది. మించితే నిద్రలేమి, అధిక ఆమ్లత్వం వంటి దుష్ప్రభావాలు రావచ్చు. గర్భిణీలు, ముదురు వయస్సు వారికి గ్రీన్ టీ తీసుకునే ముందు డాక్టర్ సలహా అవసరం. షుగర్  లేదా తీపి పదార్థాలు కలిపి తాగకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల గ్రీన్ టీ వల్ల లభించాల్సిన  అసలు ప్రయోజనం తగ్గిపోతుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటి?  ఎలాంటి గ్రీన్ టీ ని ఎంచుకోవాలి? Publish Date: Jun 21, 2025 9:30AM

యోగాంధ్రతో ప్రపంచం చూపు ఏపీ వైపు.. చంద్రబాబుపై మోడీ ప్రశంసల వర్షం

ప్ర‌పంచ దేశాలను ఏపీ చూడ‌డం కాదు.. ఏపీని ప్ర‌పంచ దేశాలు చూసేలా చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మాట అన్నది ఎవరో కాదు ప్రధాని నరేంద్రమోడీ. శనివారం (జూన్ 21) విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం (జూన్ 20) విశాఖ చేరుకున్న ఆయనకు  గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌,  ముఖ్యమంత్రి చంద్ర‌బాబు,  ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సందర్భంగా   సీఎం చంద్ర‌బాబు విశాఖలో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం నిర్వ‌హ‌ణ‌కు చేసిన ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోల‌ను సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కు చూపించారు. వీటిని తిల‌కించిన ప్ర‌ధాని.. అద్భుతంగా చేశార‌ని.. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఏర్పాట్లు  ఉన్నాయ‌ని అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు యోగాంధ్రపై మోడీకి వివరించారు. నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాల గురించి తెలిపారు. దీనిపై మోడీ..యోగాను తాను ప్రపంచానికి పరిచయం చేశాననీ, ఆయితే చంద్రబాబు మాత్రం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారనీ ప్రశంసల వర్షం కురిపించారు.  
యోగాంధ్రతో ప్రపంచం చూపు ఏపీ వైపు.. చంద్రబాబుపై మోడీ ప్రశంసల వర్షం Publish Date: Jun 21, 2025 6:15AM

కేసీఆర్ మెడకు చుట్టుకున్న టెలిఫోన్ ట్యాప్ వైర్?

గోనె ప్రకాశరావు వర్షెన్ ఏంటి? కేసీఆర్ మెడకు ఫోన్ వైర్ మెల్లగా చుట్టుకుంటోంది. పోన్ ట్యాపింగ్ బాధితులలో మొత్తం 615 మందిలో.. రకరకాల రంగాల వారున్నారు. వీరిలో రాజకీయ నాయకులు, మీడియా అధినేతలు, సినీ, వ్యాపార ప్రముఖులు, కొందరు పౌర హక్కుల నేతలు వంటి వారున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారి ప్రభాకరరావు. ఈయన తన నోరు మెదపక పోయినా.. ఇప్పటికే సిట్ పూర్తి ఆధారాలు సేకరించినట్టు సమాచారం.   ప్రణీత్ రావు తదితరులు అప్రూవర్లు గా మారడంతో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చేస్తోందని అంటున్నారు. మాజీ డిజిపి చుట్టూ కథ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం కథ వెనుక ఉన్నది కెసిఆర్, వారి కుటుంబ సభ్యులేనంటున్నారు.  ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు వెలుగులోకి రావడం ఇది మూడవసారి. గతంలో 1972లో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ముందు విజయం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయింది. ఇండియాలో 1988లో కర్ణాటక లో అప్పటి రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఇలాంటి కేసులో ఇరుక్కుంది. ఆ తర్వాత 2023లో కెసిఆర్  ఈ కేసులో ఇరుక్కున్నారు.   గోనె ప్రకాశరావు అప్పుడెప్పుడో 1983లో సంజయ్ విచార మంచ్ స్వతంత్ర్య అభ్యర్థిగా పెద్దపల్లి ఎమ్మెల్యే గా గెలిచారు. వై.ఎస్. హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా చేశారు. అంతకు మించి ఆయన ఏమీ చేయకపోయినా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఏదైనా సరే సూటిగా మాట్లాడతారు. 1982 నుంచి 2005 వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి అన్నీ గమనిస్తూ ప్రతి ఒక్కరి తప్పుల చిట్టా తన మైండ్ లో ఫీడ్ చేసి పెట్టుకున్నారు. శుక్రవారం (జూన్ 20) సిట్ విచారణ తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇక ఈ కేసులోంచి కెసిఆర్ ను ఎవ్వరూ కాపాడలేరని ఆయన జోస్యం చెప్పేసారు. ప్రభాకరరావు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నిజాలు చెప్పక తప్పదని, జూలై 5 తరువాత ఆయన్ని అరెస్ట్ చేస్తారని అన్నారు.  ప్రధాని కావాలనే లక్ష్యంతో కెసిఆర్.. పార్టీని బిఆర్ఎస్ గా మార్చి చుట్టు పక్కల రాష్ట్రాలు పర్యటిస్తూ, ఇక్కడ అందరి ఫోన్లు ట్యాప్ చేయించి పూర్తిగా ఇరుక్కుపోయారని అన్నారు గోనె ప్రకాశరావు. మూడవసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదని, ఆ నిర్లక్ష్యం వల్లే.. ఇప్పుడిలా ఇరుక్కుపోయారని ఆయన వివరించారు. కేంద్రం జోక్యం చేసుకుని చిత్తశుద్ధితో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని, ఇందుకు స్థానిక బిజెపి నేతలు కృషి చేయాలని కోరారు.  గోనె ప్రకాశరావుకు ఇక్కడే కాదు, అమెరికాలోనూ మన తెలుగు వారిలో విపరీతమైన క్రేజ్ ఉంది. తానా, అటా సంస్థలు నిర్వాహించే పొలిటికల్ సెషన్స్ లో ప్రతి ఏటా ప్రకాశరావు ప్యానెల్ స్పీకర్ గా ఉండి తీరాల్సిందే. ప్రకాశరావు మాటలు కూడా అంతే ఆసక్తిగా అక్కడివారు విని ఎంజాయ్ చేస్తుంటారు.
కేసీఆర్ మెడకు  చుట్టుకున్న టెలిఫోన్ ట్యాప్ వైర్? Publish Date: Jun 21, 2025 5:42AM

ప్రపంచానికి భారతీయ వరం యోగా దినోత్సవం!

శనివారం  జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం మన దేశంలో పుట్టిన యోగ విద్యను ఈ రోజు ప్రపంచం మొత్తం సొంతం చేసుకుంది. 2014 లో మన దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అదే సంవత్సరం డిసెంబర్ 14న ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సభ, భారతీయ యోగ విద్యను గుర్తించి, ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవాన్ని నిర్వహించాలనే చారిత్రక నిర్ణయం తీసుకుంది.  ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అగ్ర రాజ్యం అమెరికా సహా 177 దేశాలు, యోగ దినోత్సవం తీర్మానాన్ని సమర్ధించాయి. ఆ విధంగా 2015 జూన్ 21 న ప్రప్రథమంగా ప్రపంచ యోగ దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రపంచ యోగ దినోత్సవం 11వ వార్షికోత్సవం జరుపు కుంటోంది.  నిజానికి యోగ అనేది  ఒక విద్య, వ్యాయయం మాత్రమే కాదు  భారతీయ జీవన విధానం.  భారతీయ ఋషులు  ప్రకృతి ధర్మాలకు తమ తపఃశక్తిని, మేథో సంపదను జోడించి  ప్రపంచ మానవాళికి అందించిన అపూర్వ కానుక యోగ విద్య. భారతీయ ఋషి పుంగవుల విశాల దృక్పథానికి, వందల వేల సంవత్సరాల కృషికి ప్రతిఫలంగా లభించిన పవిత్ర విద్య, దివ్య ఔషదం యోగ విద్య. ఆ మహోన్నత విద్య మరుగున పడిపోకుండా..ముందుకు తీసుకుపోయే  సంకల్పంతో  ప్రధాని మోడీ మానసిక పుత్రికగా జన్మించి, ప్రపంచ ఆమోదం  పొందిన యోగా దినోత్సవం పదేళ్ళ ప్రయాణంలో ఎన్నోమైలు రాళ్ళను దాటింది.  అన్నిటినీ మించి, యోగా అంటే కేవలం సనాతన హిందూ ధర్మానికి సంబందించిన  విద్య.. హిందువులు మాత్రమే ఆచరించే మతపరమైన విధి అనే అపప్రద ఈ పదేళ్ళ కాలంలో  చాలా వరకు తొలగి పోయింది. యోగ  ఒక మతానికి పరిమితం కాదు, ఒక ధర్మానికి, దేశానికి, ప్రాంతానికి పరిమితం కాదు. సర్వ మానవాళికి సంబంధించిన  ప్రశాంత ఆరోగ్య జీనన  విధానం యోగ అనే భావనను ఈరోజున ప్రపంచం విశ్వసిస్తోంది. అందుకే..  ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మతాలు, ఎన్ని ధర్మాలు ఉన్నాయో, అన్ని మతాల వారు, అన్ని ధర్మాల వారు  యోగా  దినోత్సవంలో  ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పాల్గొనడమే కాదు.. యోగ విద్యను  నిత్య జీవితంలో సాధన చేస్తున్నారు.  ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ప్రాచుర్యం కారణంగా కావచ్చును  ఈరోజున ఆధునిక ఆలోపతి వైద్య శాస్త్రం కూడా.. ముందెన్నడూ లేనంతగా యోగ సాధనను ప్రోత్సహిస్తోంది. అవును  అనేక దీర్ఘ కాలిక వ్యాధులకు, ఔషధాలు, శస్త్ర చికిత్సలతో పాటుగా (కొన్ని కొన్ని సందర్భాలలో ప్రత్యాన్మాయంగానూ కూడా) యోగ సాధనను, డాక్టర్లు  ప్రిస్క్రెబ్  చేస్తున్నారు. ఒక్క వైద్య శాస్త్రంలో మాత్రమే కాదు.. మేనేజిమెంట్ స్టడీస్, ఇతరత్రా క్షేత్రాలలో సైతం యోగ  విద్య, యోగ సాధన అంతర్భాగంగా మారి పోయాయి.నిజానికి, ఈ రోజున సినిమా హీరోలు, హీరోయిన్లు,ఇతర సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు డైలీ వర్కవుట్ లో యోగాకు ప్రాధాన్యత ఇస్తున్నారు.   అదలా ఉంటే ఈ సంవత్సరం జరుపుకుంటున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ఒకటి కాదు, ఇంకా ఎక్కువే ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సం కూడా  యోగా దినోత్సవాన్ని ఓ చక్కని థీమ్ తో జరుపుకోవడం జరుగుతోంది. అవును..  ప్రధానమంత్రి నరేందమోదీ నెలనెలా ఆకాశవాణి ద్వారా తమ మనసులోని భావాలను పంచుకునే, మన్ కీ బాత్  కార్యక్రమంలో 2025 యోగా దినోత్సవం కోసంగా ప్రటించిన, మకుటం యోగా ఫర్ వన్ ఎర్త్ .. వన్ హెల్త్  థీమ్ గా ఈ సంవత్సరం  యోగా దినోత్సవాన్ని ప్రపంచం జరుపుకుంటోంది. అలాగే ఈ సంవత్సరం మన విశాఖ పట్నంలో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి,నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్వయంగా పాల్గొంటున్నారు.
ప్రపంచానికి భారతీయ వరం  యోగా దినోత్సవం! Publish Date: Jun 21, 2025 5:15AM

ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను ఢీ కొన్న పక్షి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఎయిర్ ఇండియా విమానాలను ప్రమాదదాలు వెంటాడుతున్నాయా అనిపించేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయి.   తాజాగా ఎయిర్ ఇండియా విమానం ఏ12479 ను ఓ పక్షి ఢీ కొంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని అత్యవసరంగా పూణెలో ల్యాండ్ చేశారు.  శుక్రవారం (జూన్ 20)   పూణే నుండి ఢిల్లీకి  వెడుతున్న విమానాన్ని పక్షి ఢీ కొనడంతో దానిని పూణె విమానాశ్రయంలోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ తరువాత ఆ విమానాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఆ విమానంలోని ప్రయాణీకులను ఢిల్లీకి పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిసింది.  ప్రయాణీకులను ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.  మరోవైపు   ఎయిర్ ఇండియా జూన్ 21 మరియు జూలై 15 మధ్య 16 అంతర్జాతీయ విమాన మార్గాల్లో విమానాలను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అలాగే మూడు మార్గాల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది,  
ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను ఢీ కొన్న పక్షి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ Publish Date: Jun 20, 2025 6:40PM

అమరావతి రైతులపై కేసుల ఉపసంహరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్ కలిగించింది. జగన్ హయాంలో వారిపై పెట్టిన కేసులను ఎత్తివేసింది.జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేస్తూ మొదలు పెట్టిన మూడు రాజధానుల విధానానికి వ్తయతికేకంగా చారిత్రాత్మక ఆందోళన చేసిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ బనాయించిన కేసులను ఉపసంహరించుకుంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం (జూన్ 20) ఉత్తర్వులు జారీ చేశారు. రైతులపైనే కాకుండా వేతనాల పెంపు కోసం ఆందోళన చేపట్టి ధర్నా చేసిన అంగన్ వాడీ కార్యకర్తలపై అప్పటి జగన్ ప్రభుత్వం బనాయించిన కేసులను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు హోంశా ఆ ఉత్తర్వులలో పేర్కొంది.   ఈ నిర్ణయంతో అమరావతి రైతులకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు భారీ ఊరట దక్కింది. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం ముందు అమరావతి రైతులు అప్పట్లో నిరసన తెలిపారు.దీంతో   జగన్ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది. 2020 ఆగస్టు 26న గవర్నర్‌పేటలోని సీఆర్‌డీఏ కార్యాలయం దగ్గర రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ప్రభుత్వం వారిని అడ్డుకుని అరెస్టు చేసింది. కేసులు పెట్టింది. ఆ కేసులను ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.  
అమరావతి రైతులపై కేసుల ఉపసంహరణ Publish Date: Jun 20, 2025 6:25PM

హనుమకొండ కోర్టు ఆవరణలో డిటొనేటర్లు

  హనుమ కొండ జిల్లా కోర్టు ఆవరణలో డిటొనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి హనుమకొండ జిల్లా కోర్టు ఆవరణలో బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కోర్టు ఆవరణ అంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆరు డిటొనేటర్లు లభ్యమయ్యయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదరింపు కాల్ రావడం, తనిఖీలు చేపట్టిన పోలీసులకు డిటొనేటర్లు లభ్యం కావడంతో లాయర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  ఇటీవలి కాలంలో హనుమకొండ కోర్టుకు బాంబు బెదరింపు రావడం ఇది మూడో సారి కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. 
హనుమకొండ కోర్టు ఆవరణలో డిటొనేటర్లు Publish Date: Jun 20, 2025 6:04PM

అన్నా, చెల్లెలు.. మధ్యలో బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు.. అన్న, చెల్లిల మధ్య పోరు వారి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఇక్కట్ల పాలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ సీఎం జగన్, ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల మధ్య ఇరుక్కుపోతున్న వైవీ సుబ్బారెడ్డి ఎటూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంట. మొన్న ఆస్తుల వివాదంలో.. నిన్న ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో వైవీ ప్రస్తావన తీసుకొచ్చారు షర్మిల. తన ఫోన్‌ను జగన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ.. వైవీని సాక్ష్యంగా చూపించారామె..  షర్మిల లేవనెత్తున్న అంశాలపై కౌంటర్‌ ఇచ్చేందుకు వైవీ సుబ్బారెడ్డి తెగ ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారంట. అటు మిగిలిన  వైసీపీ పెద్దలు కూడా షర్మిల లేవనెత్తిన అంశాలపై ఎలా స్పందించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారంట. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పటి వరకూ తెలంగాణకే పరిమితం అయిందనుకున్న తరుణంలో.. కాదు అటు ఏపీలోను ట్యాపింగ్ ఎపిసోడ్ కలకలం రేపుతోంది. గడిచిన ఐదేళ్లలో ఏపీకి చెందిన రాజకీయనాయకుల ఫోన్ ట్యాప్ అయ్యాయని జరుగుతున్న ప్రచారం వేడి పుట్టిస్తున్న తరుణంలోనే షర్మిల తెరపైకి వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే తన అన్న, మాజీ సీఎం జగన్‌తో షర్మిల విభేదిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా ఏపీ  రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె జగన్‌ను ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. దాంతో అన్నాచెల్లెల్ల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన షర్మిల.. తర్వాత జగన్‌ పార్టీ 11 సీట్లకు పరిమితమై, ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా పోయిన తర్వాత కూడా అదే రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కుటుంబ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి ఆమె తన అన్నపై తీవ్ర ఆరోపణలు చేశారు.  జగన్ సైతం తల్లి  విజయమ్మ, చెల్లి షర్మిలపై ఫిర్యాదులు చేశారు. ఆ వివాదం సద్దుమణగక ముందే షర్మిల ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు గుప్పించడంతో అన్నాచెల్లెల్ల మధ్య బంధం పూర్తిగా తెగిపోయినట్లే కనిపిస్తోందంటున్నారు.  తన ఫోన్ ట్యాప్ చేసి రాజకీయంగా తన ఎదుగుదలను జీర్ణించుకోలేక కుట్రలు చేశారని వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఏపీ రాజకీయల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ముమ్మాటికీ వాస్తవమని, ఈ వ్యవహారం అంతా అప్పటి  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషనేమోనని షర్మిలఅనుమానాలు వ్యక్తం చేశారు.  ఆ ఫ్లోలో కేసీఆర్, కేటీఆర్, జగన్‌‌లకు ఉన్న సాన్నిహిత్యాన్ని షర్మిల వివరించారు. వారు చాలా మంచి సత్సంబంధాలు మెయింటెయిన్ చేశారని, వారి అనుబంధం మందు రక్తం సంబంధం కూడా చిన్నబోయిందని సెటైర్లు వేశారు . ఒకరి కోసం ఒకరన్నట్లు మెలిగేవారని ఎద్దేవా చేశారు. పనిలో పనిగా ఆస్తుల వివాదం సమయంలో ప్రస్తావించిన వైవీ సుబ్బారెడ్డి పేరుని ఫోన్ ‌ట్యాపింగ్ వ్యవహారంలో కూడా షర్మిల ఇరికించేశారు. తన ఫోన్ ట్యాపైన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డే తనతో చెప్పారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనకు వైవీ సుబ్బారెడ్డి చెప్పారని..అవసరమైతే బైబిల్ పై ప్రమాణం చేస్తానని షర్మిల అన్నారు. ఇటీవల కాలంలో పదేపదే వైవీ సుబ్బారెడ్డి పేరును షర్మిల ప్రస్తావించడం  వైసీపీ పెద్దలకు మింగుడు పడడంలేదంట. కీలకమైన అంశాలకు సంబంధించి తన పేరును ప్రస్తావించడం పట్ల  రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా ఇబ్బంది పడుతున్నారట. ఇప్పటికే జగన్, షర్మిలకు మధ్య ఆస్తుల వివాదం నడుస్తోంది. ఆస్తుల పంపకాలపై రాజశేఖర్‌రెడ్డి ఆలోచనలు ఏంటో వైవీ సుబ్బారెడ్డికి స్పష్టంగా తెలుసని షర్మిల చేప్పారు. జగన్‌ ఒత్తిడితోనే వైవీ సుబ్బారెడ్డి వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని కూడా షర్మిల అంటున్నారు. ఓ వైపు ఆస్తుల వివాదంలో తన పేరు తెరపైకి తీసుకోవడంతోనే ఇబ్బందిపడిన వైవీ సుబ్బారెడ్డి...తాజా ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో తన పేరు షర్మిల ప్రస్తావించడపట్ల వైవీ సుబ్బారెడ్డి మదన పడుతున్నారట. ఒకవైపు షర్మిల తనను సాక్షిగా పేర్కొంటూ నిజాలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటే..  మరోవైపు వైవీ సుబ్బారెడ్డి మాత్రం షర్మిల ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షర్మిల ఆరోపణలకు కౌంటర్‌గా ఎక్స్ లో స్పందించారు. షర్మిల ఫోన్ ట్యాప్ చేయాల్సినవసరం అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని వైవీ ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండగా, షర్మిల  తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారని, అప్పుడు జగన్‌కి, షర్మిలకి సంబంధాలు ఇప్పటిలా లేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఫోన్‌ను ట్యాప్‌చేసి కేసీఆర్‌గారి ప్రభుత్వం ఇక్కడి సీఎంకు ఎందుకు ఇస్తుంది? అసలు కేసీఆర్‌గారి ప్రభుత్వం ట్యాప్‌చేసిందా? లేదా? అన్నది తనకు తెలియదన్నారు. తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నానని పేర్కొన్నారు. అన్నాచెల్లెల్ల గొడవలపై బయటకు మాట్లాడ లేకపోతున్న బాబాయ్ ఎక్స్ ఖాతాలో తన గోడు వెల్లగక్కుతుండటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా వైవీ సుబ్బారెడ్డి ఇద్దరి మధ్య ఇరుక్కు పోయారనే టాక్ నడుస్తోంది.
అన్నా, చెల్లెలు.. మధ్యలో బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి Publish Date: Jun 20, 2025 1:04PM

వంశీ.. జైలు నుంచి మళ్లీ ఆస్పత్రికి

వైసీపీ సీనియర్ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరో మారు ఆస్పత్రిపాలయ్యారు. గురువారం (జూన్ 19) రాత్రి ఆయన అస్వస్థతకు గురి కావడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  వివిధ కేసులతో 3 నెలల క్రితమే అరెస్టై రిమాండ్ ఖైదీగా  జైలులో  ఉన్న వల్లభనేని వంశీ.. జైలులో పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో తరచుగా ఆయనను అధికారులు జైలు నుంచి ఆస్పత్రికి.. ఆస్పత్రి నుంచి జైలుకు అన్నట్లుగా తిప్పితున్నారు. కోర్టు   ఇటీవలే మ ఇటీవలే సమగ్ర వైద్య పరీక్షల కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. దీంతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయను చికిత్స అందించి, ఆరోగ్యం కుదుటపడిన తరువాత తిరిగి జైలుకు తీసుకువచ్చారు.  తాజాగా గురువారం వంశీ   వాంతులు, విరేచనాలతో  డీహైడ్రేషన్ కు గురవ్వడంతో జైలు అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.   
వంశీ.. జైలు నుంచి మళ్లీ ఆస్పత్రికి Publish Date: Jun 20, 2025 12:55PM

విమానం కూలిపోవడానికి కారణం అదేనా?

సాధారణంగా మనం బైక్ తీసుకుని బయలుదేరినప్పుడు ఒక్కోసారి పెట్రోల్ ట్యాంక్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతుంటాం. అయినా బండి స్టార్ట్ అవుతుంది, ఓ ఫర్లాంగు దూరం నడుస్తుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. సరిగ్గా అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన క్షణాలలోనే కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియా  విమానం విషయంలో ఇలాంటిదే జరిగివుంటుందని కొందరు నిపుణులు విశ్లేసిస్తున్నారు. 1,26,000 లీటర్ల ఇంధనం విమానం ట్యాంకులో నింపిన తర్వాత ట్యాంకు నుండి ఇంజనుకు ఇంధనం వెళ్లే స్విచ్ ఆఫ్ చేస్తారట. విమానం బయలుదేరే ముందు దానిని ఆన్ చేయడం మర్చిపోయి ఉంటారని అంటున్నారు.  పైపుల్లో ఉన్న ఇంధనం విమానం టేకాఫ్ అయి కొద్ది దూరం ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఇంధనంఅందక రెండు ఇంజన్లు ఆగిపోతాయి.  ఎందుకంటే.. విమానం సక్రమంగా గాల్లోకి లేచిందంటే ఇంజన్లు బాగున్నట్టే. ఒకేసారి రెండు ఇంజన్లు ఫెయిల్ కావడం జరగదు. ఇది కేవలం విశ్లేషణ కాదండోయ్. కొందరు నిపుణుల అంచనా. అయితే.. పెట్రోలు స్విచ్ ఆఫ్ లో ఉంటే పైలట్ కు ఇండికేటర్ సిగ్నల్ చూపించదా, అలాంటి టెక్నాలజీ ఏమీ ఉండదా అనేది సందేహం. విచారణ పూర్తయితేనే అసలు విషయం బయటకు వస్తుంది.
విమానం కూలిపోవడానికి కారణం అదేనా? Publish Date: Jun 20, 2025 12:43PM

ఇరాన్ సెల్ఫ్‌గోల్ .. రంగంలోకి అమెరికా!

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంతో  పశ్చిమాసియా రగిలిపోతోంది.  అగ్రరాజ్యం అమెరికా రణ రంగంలోకి దిగనుందనే సంకేతాలు  ఉద్రిక్తతలను మరింత పెంచాయి.  ఇజ్రాయెల్ తరఫున అమెరికా గనక వార్ జోన్‌లోకి ఎంటరైతే పరిస్థితులు ఎలా మారబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతోంది.  మరోవైపు  ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది.  పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇజ్రాయెల్‌,  ఇరాన్‌ పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు తమతో న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కు ఒప్పందం కుదుర్చుకోవడం లేదన్న గుర్రుతో అమెరికా కూడా ఇరాన్‌పై కత్తులు నూరుతోంది. అదును చూసి దెబ్బకొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో  ఇరాన్‌ రాజకీయ నాయకత్వ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.  ఇంత జరుగుతున్నా.. ఇన్నాళ్లూ ఇరాన్‌ కు పాలు పొసి పెంచిన హమాస్‌, హెజ్‌బొల్లా, హూతీలు లాంటి ముసుగు సంస్థల జాడ కనిపించడం లేదు.  పశ్చిమాసియాలో ఓ బలమైన శక్తిగా ఎదిగిన ఇరాన్‌.. అనధికారిక సైన్యాన్ని పెద్ద ఎత్తున సమకూర్చుకుంది. పాలస్తీనాలో హమాస్‌, లెబనాన్‌లో హెజ్‌బొల్లా, యెమెన్‌లో హూతీలు, ఇరాక్‌లో కొన్ని ముసుగు సంస్థలను ఏర్పాటు చేసి.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వాటికి సహకారం అందించింది. నేరుగా తాను యుద్ధ రంగంలోకి దిగకుండా.. శత్రుదేశాలపై వీరిని ఉసిగొల్పేది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ , హమాస్‌ యుద్ధం మొదలైంది. ఆ ఉగ్ర సంస్థకు సాయం చేసేందుకు హెజ్‌బొల్లా ముందుకురావడంతో ఆ యుద్ధం బీరుట్‌ వరకు ఎగబాకింది. ఇజ్రాయెల్‌ ప్రతాపానికి హమాస్‌, హెజ్‌బొల్లాలోని అగ్రనాయకత్వం తుడిచిపెట్టుకుపోయాయి. ఆయా వర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. వారిని ఏకతాటి మీదకు తీసుకురావాల్సిన ఇరాన్‌లో ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పుడు ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరించడంతో.. ఇరాన్‌ ఒంటరి పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడి, సెల్ఫ్‌గోల్ చేసుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదలా ఉంటే ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య మొదలైన యుద్ధం క్రమంగా అగ్ర దేశాలను కూడా కదిలిస్తోంది. టెహ్రాన్‌ అణుకార్యక్రమాన్ని బూచిగా చూపి.. ఆ దేశంపై సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతోంది. సరైన సమయం కోసం వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యం సరికాదని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ మేరకు రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఇరాన్‌లోని బుషెహర్‌ అణువిద్యుత్‌ కేంద్రంపై ఇజ్రాయెల్‌ చేసిన దాడిపైనా రష్యా స్పందించింది. తక్షణమే దాడులను ఆపాలని ఆ దేశాన్ని కోరింది. లేదంటే చెర్నోబిల్ తరహా విపత్తు సంభవించే అవకాశముందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మిలటరీ అధికార ప్రతినిధి స్పందించారు. పొరపాటు వల్లే దాడి జరిగిందని వివరణ ఇచ్చారు. అయితే, బుషెహర్‌కు ప్రమాదం వాటిల్లిందా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
ఇరాన్ సెల్ఫ్‌గోల్ .. రంగంలోకి అమెరికా! Publish Date: Jun 20, 2025 11:06AM

మరో విమానంలో సాంకేతిక లోపం

ఇటీవలి కాలంలో విమాన ప్రయాణమంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిన ఘటనలో వందలాది మంది మరణించిన ఘటన మరువక ముందే పలు విమానాలలో సాంకేతిక లోపాల వార్తలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు రావలసిన థాయ్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్యను విమానం టేకాఫ్ కు ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా విమానం టేకాఫ్ అయ్యే సమయంలో సాంకేతికలోపాన్ని గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని నిలిపివేశారు. ఆ విమాన ప్రయాణీకులను బ్యాంకాక్ ఎయిర్ పోర్టులోనే దింపేశారు.  
మరో విమానంలో సాంకేతిక లోపం Publish Date: Jun 20, 2025 10:44AM

తిరుమల లడ్డూ ప్రసాదంలోనే కాదు.. ఆ దేవాలయాల ప్రసాదాల్లోనూ కల్తి నెయ్యి వినియోగం?!

తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్లీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి  నెయ్యిని సరఫరా చేసినది బోలేబాబా డెయిరీ అనీ, ఈ డెయిరీ సరఫరా చేసినది అసలు నెయ్యే కాదనీ, నెయ్యిలా కనిపించే రసాయినాల మిశ్రమమనీ సిట్ నిర్ధారణకు వచ్చింది. అంతే కాకుండా  బోలేబాబా డెయిరీ.. తిరుపతి నగరంలోని ఓ డెయిరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలకు కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.   తిరుపతిలోని ఓ డెయిరీని అడ్డుపెట్టుకుని బోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యిని విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి ప్రసిద్ధ దేవాలయాలకూ సరఫరా చేసినట్లు సిట్ ఆధికారులు గుర్తించారు. పేరుకు తిరుపతిలోని ఓ డెయిరీ ద్వారా నెయ్యి సరఫరా అయినప్పటికీ పరోక్షంగా బోలేబాబా డెయినీ సంస్థే ఆ నెయ్యిని సరఫరా చేసినట్లు సిట్ అధికారల దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తోంది.  దీంతో ఇప్పటి వరకూ అంతా భావిస్తున్నట్లు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలోనే కల్తీ నెయ్యి వినియోగం జరగలేదనీ, రాష్ట్రంలోని పలు ప్రసిద్ధ దేవాలయాల ప్రసాదం తయారీలోనూ కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు తేలింది.   
తిరుమల లడ్డూ ప్రసాదంలోనే కాదు.. ఆ దేవాలయాల ప్రసాదాల్లోనూ కల్తి నెయ్యి వినియోగం?! Publish Date: Jun 20, 2025 10:22AM

గిఫ్ట్ డీడ్ రద్దు.. వృద్ధ దంపతులకు న్యాయం!

ఆస్తిని పిల్లలకు పించి ఇచ్చేసిన తరువాత చరమాంకంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చట్టం చూస్తూ ఊరుకోదని చాటిన ఉదంతమింది. ప్రొద్దుటూరుకు చెందిన మలేపాటి మోహనరావు (86) ఆయన భార్య గౌరమ్మ (75)లు సొంతంగా వ్యాపారం చేస్తూ జీవనం సాగించే వారు. వారికి ఐదుగురు కుమార్తెలు. వయస్సు పై బడిన తరువాత ఆ దంపతులు తమ కుమార్తెలకు ఆస్తిని గిఫ్ట్ డీడ్ ద్వారా పంచి ఇచ్చేశారు. అప్పటి వరకూ వారిని ఎంతో ప్రేమగా చూసుకున్న కుమార్తెలు ఆస్తి పంపకాల తరువాత పట్టించుకోవడం మానేశారు. వయోవృద్ధులమైన తమకు న్యాయ చేయాలని కోరుతూ ఆ వృద్ధ దంపతులు జమ్మలమడుడు రెవెన్యూ డివిజనల్ అధికారి సాయిశ్రీకి మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన సాయిశ్రీ  వృద్ధుల సంరక్షణను పిల్లలు పట్టించుకోకపోతే చట్టం చూస్తూ ఊరుకోదు అనే సందేశాన్ని బలంగా ఇచ్చే    ఆ వృద్ధ దంపతులు తమ కుమార్తెలకురు కుమార్తెల ఆస్తి పంచి ఇస్తూ చేసిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.   మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, 2007 చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.  
గిఫ్ట్ డీడ్ రద్దు.. వృద్ధ దంపతులకు న్యాయం! Publish Date: Jun 20, 2025 10:05AM

లబ్ధిదారులపై దాడి చేసిన డిజిటల్ అసిస్టెంట్ పై చర్యలు

తల్లికి వందనం సొమ్ములు తమ ఖాతాలో జమకాలేదని అన్నందుకు లబ్ధిదారులపై దాడికి పాల్పడిన డిజిటల్ కలెక్టర్ పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అన్నమయ్య జిల్లా వడిగల వారి పల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న బాబా ఫక్రుద్దీన్ తల్లికి వందనం సొమ్ములు తమ ఖాతాలో పడలేదేంటని ప్రశ్నించిన గండువారిపల్లికి చెందిన అనురాధ ఆమె భర్త శంకర్  వారి కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు. ఈ సంఘటన బుధవారం (జూన్ 18) జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జూన్ 19)న జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శుక్రవారం (జూన్ 19) బాధితుల ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. డిజిటల్ అసిస్టెంట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి ధైర్యం చెప్పారు.   ఆ డిజిటల్ అసిస్టెంట్ పై శాఖపరమైన అన్ని రకాల చర్యలే కాకుండా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.  బాధిత  కుటుంబానికి జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందని వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  
లబ్ధిదారులపై దాడి చేసిన డిజిటల్ అసిస్టెంట్ పై చర్యలు Publish Date: Jun 20, 2025 9:53AM

ఏ ఉప్పు ఆరోగ్యానికి మంచిది? ఆయుర్వేదంలో దీని గురించి ఏం చెప్పారంటే..!

ఉప్పు లేని వంటను ఊహించలేం, అలాగే ఉప్పు లేకుండా ఏమీ తినలేం.  చాలామంది పలుచటి మజ్జిగ తాగాలన్నా సరే.. అందులో కాసింత ఉప్పు వేసుకుని తాగుతుంటారు.  ఉప్పు ఆరోగ్యానికి మంచిదే కానీ సరైన విధంగా ఉప్పు తీసుకోకపోతే అది ఆరోగ్యానికి చేటు కూడా చేస్తుంది. అదేవిధంగా ఉప్పులో రకాలు కూడా ఉంటాయి.  ఏ ఉప్పు ఆరోగ్యానికి మంచిది అనే విషయం ఈ మధ్యకాలంలో చాలా హాట్ టాపిక్ గా మారింది.  ఆయుర్వేదంలో ఆరోగ్యానికి ఏ ఉప్పు మంచిది అనే విషయం స్పష్టంగా ఇవ్వబడింది.  దీని గురించి తెలుసుకుంటే.. ఆయుర్వేదంలో సాధారణంగా "సెంధా నమక్" లేదా "సైంధవ లవణం" ఆరోగ్యానికి అత్యుత్తమమైన ఉప్పుగా పరిగణించబడుతుంది. ఇది హిమాలయ ప్రాంతాల్లో దొరికే సహజ  ఉప్పు. దీనిని ఆంగ్లంలో Himalayan Rock Salt లేదా Pink Salt అని కూడా అంటారు. ఆయుర్వేద దృష్టిలో సైంధవ లవణం విశిష్టత: ఆయుర్వేద గ్రంథాలలో ఆరు రకాల లవణాలు (ఉప్పులు) గురించి చెప్పబడింది. వాటిలో సైంధవ  లవణం ఉత్తమంగా భావించబడుతుంది.  సైంధవ లవణం  యొక్క ఆరోగ్య ప్రయోజనాలు.. త్రిదోష సమతుల్యత.. వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యంలో ఉంచుతుంది. ముఖ్యంగా వాత దోషాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది.. అజీర్ణం, ఉబ్బసం, గ్యాస్ వంటి సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది. అపానవాయువు నియంత్రణకు ఉపయోగకరమైందిగా భావిస్తారు. అల్కలైనిటి మేనేజ్‌మెంట్.. శరీరంలో పిహెచ్ స్థాయిని సద్దుమణిగించే లక్షణం కలిగి ఉంటుంది. అమ్లత్వాన్ని తగ్గించి దాహాన్ని నివారిస్తుంది. హృదయ ఆరోగ్యం.. రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుందని చెబుతారు. అయితే దీన్ని అత్యధికంగా తీసుకోకూడదు. సోడియం కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల హై బీపీ ఉన్నవారు సాధారణ ఉప్పు కంటే దీనిని కొంతమేరకు ఉపయోగించవచ్చు. చర్మ సమస్యలు.. సైంధవ  ఉప్పుతో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, అలర్జీలు తగ్గుతాయని నమ్మకం ఉంది. గర్భిణీ స్త్రీలకు అనుకూలం: సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణంను  ఉపవాసాల సమయంలో, గర్భధారణ సమయంలో ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది శరీరానికి మృదుత్వం ఇస్తుంది. ఇవి తెలుసుకోండి.. ఆయుర్వేద ప్రకారం ఇది అధికంగా వాడితే కఫ, పిత్తాన్ని పెంచే అవకాశం ఉంది. శరీరానికి అధిక ఉష్ణతనివ్వడం, రక్తాన్ని కలుషితం చేయడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. సముద్ర ఉప్పు.. ఇది కూడా కొన్ని సందర్భాల్లో వాడతారు కానీ ఇది ఎక్కువగా కఫ, పిత్తాన్ని ప్రేరేపించగలదని భావిస్తారు. ఉపయోగించే విధానం.. రోజువారీ వంటల్లో సాధారణ ఉప్పు స్థానంలో తక్కువ మోతాదులో సైంధవ లవణం వాడడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చట్నీలు, రైతాలు, ఉపవాసకాల వంటల్లో ఇది వాడతారు. స్నాన జలంలో ఈ ఉప్పును కలిపి వాడితే శరీరానికి విశ్రాంతి కలుగుతుంది.                         *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
ఏ ఉప్పు ఆరోగ్యానికి మంచిది? ఆయుర్వేదంలో దీని గురించి ఏం చెప్పారంటే..! Publish Date: Jun 20, 2025 9:30AM

యోగా గురించి ఆయుర్వేదం ఏం చెప్పింది? దీనికున్న ప్రాధాన్యత ఏమిటి?

  యోగా గురించి ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యంగా చెబుతుంది. ఇది శరీరం, మనసు,  ఆత్మ మధ్య సమతుల్యతను ఏర్పరచే సాధనంగా పరిగణించబడుతుంది. ఆయుర్వేదం,  యోగా రెండూ భారతీయ సంప్రదాయ వైద్యం,  ఆధ్యాత్మికతకు మూల స్తంభాలుగా ఉన్నాయి. ఇవి పరస్పరం అనుసంధానంగా ఉండి, ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ,  శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా  మెరుగుపరచే విధానాలను అందిస్తాయి. ఆయుర్వేదంలో యోగ స్థానం ఇదే.. త్రిదోష సిద్ధాంతానికి అనుగుణంగా... ఆయుర్వేదం ప్రకారం మన ఆరోగ్యం మూడు దోషాలపై ఆధారపడి ఉంటుంది.  వాత, పిత్త, కఫ అనే దోషాలు ప్రతి మనిషిలో ఉంటాయి. ఇవి సమతుల్యంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది.  ఈ త్రిగుణాలను సమతుల్యంలో ఉంచడానికి యోగా సహాయపడుతుంది. ఉదాహరణకు.. ప్రాణాయామం వాత దోషాన్ని నియంత్రించగలదు, ఆసనాలు కఫ దోషాన్ని క్రమంలోకి తేస్తాయి. ధ్యానం పిత్త దోషాన్ని శాంతపరచగలదు. ఆహార, ఆచార నియమాలకు తోడుగా.. ఆయుర్వేదం మనిషి జీవన విధానాన్ని సమతుల్యంలో ఉంచే విధంగా ఆహార నియమాలు , జీవన శైలి ,  మానసిక ఆరోగ్యం  ఉండాలని చెబుతుంది.  వీటిని ఆహార, విహార, మనోవ్యాపార నియమాలు అని అంటుంది.  యోగా వీటిని స్థిరంగా పాటించడంలో శరీరానికీ మనస్సుకీ స్థిరత్వాన్ని ఇస్తుంది. యోగ ప్రాముఖ్యత ఇదే.. శరీరశుద్ధి .. యోగిక శుద్ధిక్రియలు  ముఖ్యంగా కపాలభాతి, జలనేతి, శంఖ ప్రక్షాలన మొదలైనవి శరీరంలో తామసిక,  రజసిక సంకలితాలను తొలగించి, సత్వగుణాన్ని పెంచుతాయి. ఇది ఆయుర్వేదంలో చెప్పే "పంచకర్మ" విధానాలకు సహాయకం. ఆత్మ నియంత్రణ .. యోగాభ్యాసం వల్ల శీలం, నియమం, ధైర్యం, సామర్థ్యం వంటి లక్షణాలు పెరుగుతాయి. ఇవి ఆయుర్వేదంలో స్వస్థవ్యక్తి లక్షణాలుగా పేర్కొనబడ్డాయి. మనోవ్యాధుల నివారణ.. ఆయుర్వేదంలో మనోవ్యాధులు (మానసిక రుగ్మతలు) కోసం సత్త్వవజయ చికిత్స అనే ప్రత్యేక విభాగం ఉంది. ఇందులో ధ్యానం, ప్రాణాయామం,  మనస్సు పై నియంత్రణ సాధనాలుగా యోగను ఉపయోగిస్తారు. ఒజస్సు వృద్ధి.. యోగా ఆయుర్వేదంలో ముఖ్యంగా చెప్పే "ఒజస్సు" (శరీర రక్షణశక్తి)ని పెంచుతుంది. దీర్ఘకాలికంగా యోగ సాధన వల్ల దీర్ఘాయువు, యోచనా స్పష్టత, జీవశక్తి పెరుగుతాయి. అంతర్వేద కాలం నుంచి ఆధునిక యోగం వరకు.. ఆయుర్వేద గ్రంథాల్లో  ముఖ్యంగా అష్టాంగ హృదయం, చరక సంహిత, సుశ్రుత సంహిత మొదలైన గ్రంథాలలో  యోగ గురించి ప్రత్యక్షంగా ప్రత్యేక అధ్యాయాలు లేవు కానీ, జీవన నియమాలలో, దినచర్య, ఋతుచర్యల్లో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి సాధనలు సూచించబడ్డాయి. ఆయుర్వేదంలోని "స్వస్థవృత్తం" అనే విభాగం యోగానికి ప్రాధాన్యతను సూచిస్తుంది. ఆయుర్వేదంలో యోగ ప్రాముఖ్యత.. శరీర ఆరోగ్యం దోష సమతుల్యం, శుద్ధిక్రియలు మానసిక శాంతి ధ్యానం, మనోవ్యాధుల నివారణ జీవశక్తి ఒజస్సు వృద్ధి, జీవన శైలి దినచర్య, ఋతుచర్యలో భాగంగా ఆత్మీయ వికాసం ధ్యానం ద్వారా ఆత్మ గమనం మొదలైనవి సాధించడానికి సహాయపడుతుందని యోగ గురించి ఆయుర్వేదం చెబుతుంది.                       *రూపశ్రీ.
యోగా గురించి ఆయుర్వేదం ఏం చెప్పింది? దీనికున్న ప్రాధాన్యత ఏమిటి? Publish Date: Jun 20, 2025 9:30AM

ఈ రెండు తప్పులు చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు..!!

ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదోకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ వారు  చేసే కొన్ని తప్పులు విజయానికి అడ్డుపడతాయి. చాణక్యుడు తెలిపిన  ఆ తప్పులు ఏంటి..? మీ లక్ష్యాలను సాధించడంలో మీరు చేయకూడని ఆ రెండు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం అన్నాక సమస్యలు సర్వసాధారణం. ముఖ్యంగా ఒకలక్ష్యంతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన లక్ష్యం ఎంత పెద్దది అయితే...అన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి..తన జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని సాధిస్తాడు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే దృఢ సంకల్పం, కఠోర శ్రమ అవసరం. వీటితోపాటు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ద పెట్టాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద మార్పునకు కారణం అవుతుంది. ఆచార్య చాణక్యుడు చెబుతూ..మన లక్ష్యాలను సాధించేందుకు కొన్ని తప్పులు చేయకూడదని తెలిపారు. అవి ఏంటో చూద్దాం. లక్ష్యం గురించి ఎవరికీ చెప్పవద్దు. మనం విజయం సాధించాలంటే దానికి కృషి, ప్రణాళిక, సమయపాలన చాలా అవసరం. ఇవే కాదు విజయం సాధించడానికి చాణక్య ఒక ప్రత్యేక సమాచారాన్ని అందించాడు. జీవితంలో విజయం సాధించాలంటే మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు, మన లక్ష్య సాధన గురించి మనం బయటకు చెప్పినప్పుడు.. వారు మన లక్ష్యాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువు మీ లక్ష్యం గురించి తెలుసుకుంటే,మీకు సమస్యలను లేదా అడ్డంకులు కలిగించవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు తీసుకున్న ప్రణాళికలు,నిర్ణయాల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. లక్ష్యం సాధించే వరకు రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు. లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు: లక్ష్య సాధన కోసం శ్రమించే వ్యక్తిని చాణక్యుడు సింహంతో పోల్చాడు. సింహం తన వేటను చూసి వెనక్కి తగ్గనట్లేదు. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి ఆ దిశగానే అడుగులు వేయాలి తప్ప..వెనక్కు తగ్గకూడదు.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకూడదన్నది చాణక్యుడి మాట. చాణక్యుడు ప్రకారం, ఎవరైతే తన పాలసీలో ఈ రెండు అంశాలకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారో, ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు.   
ఈ రెండు తప్పులు చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు..!! Publish Date: Jun 20, 2025 9:30AM

తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ. 4.30 కోట్లు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం పోటెత్తుతున్నారు. శుక్రవారం (జూన్ 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయ పడుతోంది. ఇక గురువారం (జూన్ 19) శ్రీవారిని మొత్తం 70 వేల 226 మంది దర్శించుకున్నారు. వారిలో  31 వేల 960 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 30 లక్షల రూపాయలు వచ్చింది. 
తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ. 4.30 కోట్లు Publish Date: Jun 20, 2025 9:28AM

ఇద్దరు వృద్ద మహిళల దారుణ హత్య

గుంటూరు  జిల్లా తెనాలి ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు.   తెనాలిలోని పరిమిడొంకలో నివాసం ఉంటున్న దాసరి రాజేశ్వరి, అంజమ్మ అనే వృద్ధురాళ్ళను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం(జూన్ 19) దారుణంగా హత్య చేశారు.   వీరిరువురూ అదే రోజు ఉదయం బంధువుల ఇంట్లో వివాహానికి హాజరై మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నారు.  ఆ తరువాత హత్యకు గురయ్యారు.   స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.  వృద్ధుల ఒంటిమీద బంగారం లేకపోవడం, ఘటనా స్థలంలో పెనగులాట జరిగిన ఆనవాళ్ళు ఉండటం, వారి తలపై బలమైన గాయాలు ఉండటంతో.. బంగారం, నగదు కోసమే ఈ హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు.   స్థానికుల కథనం ప్రకారం గురువారం (జూన్ 19)మధ్యాహ్న సమయంలో   ముగ్గురు వ్యక్తులు  వృద్థురాళ్ల ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ ఉన్నట్లు చెబుతున్నారు. బంగారం, నగదు కోసం వారే ఈ హత్యలు చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 ఇద్దరు వృద్ద మహిళల దారుణ హత్య Publish Date: Jun 20, 2025 6:26AM

అండమాన్ లో అంతులేని చమురు నిక్షేపాలు

పెట్రోల్ సమస్యకు  పెర్మనెంట్ సొల్యూషన్ కలిసోచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాని సామెత.. ఇప్పుడు మన దేశానికి అలాంటి కలిసొచ్చే  రోజులు వచ్చాయా? నడిచొచ్చే కొడుకు పుట్టే రోజు వచ్చేసిందా? అంటే  అవుననే అంటున్నారు  కేంద్ర పెట్రోలియం ,సహజ వనరుల శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరీ. అవును  అండమాన్ ద్వీప సముద్ర గర్భంలో  బయట పడిన చమురు నిక్షేపాలు మన దేశ  చమురు కరవును శాశ్వతంగా తొలిగించేంత పెద్ద మొత్తంలో ఉన్నాయని  కేంద్ర మంత్రి  స్వయంగా చెప్పారు.  నీవినీఎరుగని రీతిలో, రెండు వేల సంవత్సరాల పాటు, మన దేశ చమురు అవసరాలను తీర్చగల స్థాయిలో  అడమాన్ లో చమురు నిక్షేపాలు ఉన్నట్టు చెపుతున్నారు.  నిజానికి, అండమాన్ ద్వీపంలో చమురు నిక్షేపాలున్న విషయం ఇప్పడు కాదు..  ఎప్పుడో, 1970- 80 దశకంలో అంటే ఇంచు మించుగా అర్థ శతాబ్దికి (50 ఏళ్ల) పూర్వమే గుర్తించారు. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చి పోయిన ప్రభుత్వాలు కానీ ముందడుగు వేసే సాహసం చేయలేదు. బహుశా.. అప్పటికి ఉన్న సాంకేతిక, ఆర్ధిక పరిమితుల దృష్ట్యా.. అప్పటి ప్రభుత్వాలు ముందడుగు వేసి ఉండక పోవచ్చును.  అత్యంత సంక్లిష్ట వాతావరణ, భౌగోళిక పరిస్థితుల నడుమ..  అది కూడా సముద్ర గర్భం లోతుల్లోకి వెళ్లి చమురు నిక్షేపాలను వెలికితీయడం అప్పుడే కాదు, ఇప్పటికీ కొంత వరకు అసాధ్యమే.  అందుకే అప్పటి ప్రభుత్వాలు సాహసించి ముందడుగు వేయలేక పోయాయి కావచ్చును.   సరే. అదంతా గతం.  ప్రస్తుతం పరిస్థితులలో మార్పు వచ్చింది. ముఖ్యంగా..  గడచిన 11 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన మొదలు అంతరిక్ష పరిశోధనల వరకూ ప్రతి రంగంలోనూ, సాహసం చేయరా ...డింభకా టైపులో.. సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. అందుకు తోడు ఈ రోజున ఆయిల్ రిఫైనరీలో మన దేశం, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో చాలా వేగంగా ముందుకు సాగుతోంది. నిజానికి, ఆయిల్ రిఫైనరీ రంగంలో మన దేశం చమురుతో తలలు పండిన దేశాలకంటే చాలా  ముందు వరసలో వుందనీ.. అందుకే మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.  అవును..  ఏక కాలంలో 26 వేల బోర్లు వేసి, చమురు నిక్షేపాలను అన్వేషించడం అంటే మాములు విషయం కాదు. అయినా..  మోదీ ప్రభుత్వం సాహసించి ముందుగువేసింది. అదృష్టం ఎగసి పడింది. ఈ విషయాన్ని, కేంద్ర చమురు, సహజ వాయువుల శాఖ మంత్రి  హరిదీప్ సింగ్ పూరీ, ఒక అంగ్ల టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.  అయితే..  ఇల్లు అలకగానే పండగ రాదు, చమురు నిక్షేపాలు కనుగొన్నంత మాత్రాన, పెట్రోల్, డీజీల్ పెట్రోల్ బంకుల్లోకి, మన వాహనాల్లోకి వచ్చేయదు. ప్రభుత్వ ప్రైవేటు రంగ సహకారంతో, ఎంతో మెటిక్యులస్ గా ప్లాన్ చేస్తేనే కానీ  పని జరగదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన, ఓఎన్జీసీ, భారత్, హెచ్ పీ, ఇండియన్ ఆయిల్ కంపెనీలు  చమురు తవ్వకాలు, నిర్వహణ బాధ్యతలను చూస్తున్నాయి. మరోవంక రిలయన్స్, నయారా వంటి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు చమురు రంగంలో చురుగ్గా పని చేస్తున్నాయి. సో.. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతోనే అండమాన్ ఆపరేషన్స్ చేపట్టాలని ప్రభుత్వం బావిస్తునట్లు మంత్రి చూచాయగా చెప్పారు.   అదలా ఉంచితే..  అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగి, అండమాన్  సముద్ర గర్భంలో దాగున్న  సుమారు 1,160 బిలియన్ బ్యారెళ్ళ చమురు నిక్షేపాలను వెలికి  తీయగలిగితే.. అత్యధిక చమురు నిల్వలు ఉన్న తొలి 20 దేశాల్లో మన దేశం స్థానం సముచిత స్థానం సంపాదించుకుంటుంది. అంతే కాదు..  ప్రస్తుత చమురు దిగుమతులు 85 శాతం మేర తగ్గి, రోజుకు కేవలం 15 శాతం మాత్రమే ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయవలసి వస్తుంది. అదే జరిగితే..  చమురు దిగిమతి వ్యయం ప్రస్తుత  రూ. 11 లక్ష కోట్ల నుంచి కేవలం రూ.1.75 లక్షల కోట్లకు దిగివస్తుంది. అంటే ఏటా.. నికరంగా . రూ. 9 లక్షల కోట్లు ఆదా అవుతాయి..  అంతే కాదు.. మనం మన చమురు ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.  కలిసొచ్చే రోజొస్తే  .. నడిచొచ్చే బిడ్డడు పుడతాడంటే   ఇదే కదా.
అండమాన్ లో అంతులేని   చమురు నిక్షేపాలు Publish Date: Jun 20, 2025 6:20AM

పొలిటికల్ పుష్పగా ట్రోల్ అవుతున్న జగన్

రప్పా రప్పా డైలాగ్‌తో మాజీ ముఖ్యమంత్రి జగన్ సోషల్‌మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. పుష్ష సినిమాలో డైలాగ్ చెప్పి, దాన్ని మీడియా సమావేశంలో మళ్లీ మళ్లీ చెప్పించుకుని మురిసిపోయిన వైసీపీ అధ్యక్షుడ్ని పొలిటికల్ పుష్ప అని నెటిజన్లు తెగ ఆడుకుంటున్నారు. అంతు చూస్తాం.. రప్పా రప్పా నరుకుతాం అంటూ పల్నాడులో భీతావహ వాతావరణానికి కారణమైన తమ పార్టీ కార్యకర్తల్ని మందలించాల్సింది పోయి వారిని వెనకేసు కొచ్చా రాయన.  రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. పైగా దానికో కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. పుష్ప సినిమాలో డైలాగ్‌ కొట్టడం కూడా తప్పేనా? అంటూ మీడియా సమావేశంలో సమర్థించుకొచ్చారు.  జగన్ పల్నాడు పర్యటనలో గంగమ్మతల్లి జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరికేస్తాం అని పోస్టర్‌ పెట్టారు. అది పుష్ప సినిమా డైలాగ్‌ అని దాన్ని అది పోస్టర్‌లో పెట్టినా తప్పేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? పుష్పలో ఫొటోలు పెట్టినా, గడ్డం చేతితో రుద్దుకున్నా తప్పేనా? అని జగన్ దాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అదేమంటే ఆ పోస్టర్‌ పట్టుకున్న వ్యక్తికి టీడీపీ సభ్యత్వం కూడా ఉందని.. టీడీపీ సానుభూతిపరుడు కూడా చంద్రబాబుపై కోపంతో మారాడని సంతోషం పడదామని విచిత్రమైన లాజిక్ వినిపించారు.  టీడీపీను రప్పా.. రప్పా కోసేస్తా అని అంటున్నాడని ఆనందపడదామని జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. వాస్తవానికి సదరు వైసీపీ కార్యకర్త రూ.5 లక్షల భీమా పథకం కోసమే టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడంట. ఎన్నికల ముందు తన తండ్రి టీడీపీలో చేరుతుంటే తీవ్రంగా వ్యతిరేకించాడంట.  మొత్తానికి జగన్ తన వ్యాఖ్యలతో టీడీపీ నేతలకు గట్టిగానే టార్గెట్ అవుతున్నారు. ఓటమి నుంచి వైసీపీ నేతలు ఇంకా పాఠం నేర్చుకోలేదని, ఎందుకు ఓడిపోయామనే పరిశీలన కూడా చేసుకోలేదని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. జగన్‌ పల్నాడు పర్యటనపై మీడియాతో మాట్లాడిన మంత్రి నక్సలైట్లను చూసి కలబడి నిలబడిన నాయకుడు చంద్రబాబు అని, జగన్ రౌడీలను సమీకరించి రాష్ట్రాన్ని భయపెట్టాలనుకుంటున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించి గతంలో అరాచకం చేశారని..అందుకే గతంలో జరిగిన అరాచకాలను ప్రజలు రప్పా రప్పా అని నరికారని ఎద్దేవా చేశారు.  ప్రభుత్వంపై కాదు.. ప్రజలపైనే వైసీపీ తిరుగుబాటు. రప్పా రప్పా అని ఎవరిని నరుకుతారు? ప్రజలనా? ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇప్పుడు పరామర్శా? పరామర్శ పర్యటనలో ఇద్దరు చనిపోతే పరామర్శించలేదే. సొంత బాబాయి కుటుంబాన్ని జగన్‌ ఎందుకు పరామర్శించలేదని పయ్యావుల ప్రశ్నించారు.
పొలిటికల్ పుష్పగా ట్రోల్ అవుతున్న జగన్ Publish Date: Jun 19, 2025 10:34PM

ఎయిరిండియా విమాన ప్రమాదం.. డీఎన్‌ఏ టెస్టుల ద్వారా 202 మృతదేహాల గుర్తింపు

  అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర  విమాన ప్రమాదంలో మరణించిన వారిలో డీఎన్ఏ పరీక్షల ద్వారా 202 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇప్పటి వరకూ 157 మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.  జూన్ 12న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే లండన్ వెళుతున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో బీజే మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు కూడా మరణించారు.  మృతదేహాల గుర్తింపునకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థతి ఏర్పడింది. ఈ పరీక్షలు ఎప్పటికి పూర్తవుతాయా అన్న సందేహం మొదట్లో వ్యక్తమైంది. అయితే యుద్ధ ప్రతిపదికన ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా వరకూ పూర్తి చేశారు.  మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం రాజ్‌కోట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వంటి ప్రముఖ రాజకీయ నాయకుల సమక్షంలో ఆయన కుమారుడు రుషభ్ రూపానీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ, వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఎయిరిండియా విమాన ప్రమాదం.. డీఎన్‌ఏ టెస్టుల ద్వారా 202 మృతదేహాల గుర్తింపు Publish Date: Jun 19, 2025 10:24PM

సీనియర్ జర్నలిస్టు కంచర్ల రామయ్య కన్నుమూత

ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య కన్నుమూశారు. సీనియర్ జర్నలిస్టు, ఎపియుడబ్యుజె   రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు  కంచర్ల రామయ్య  గురువారం (జూన్ 19) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో తీసుకుంటున్న ఆయన హైదరాబాద్ లో కిమ్స్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శుక్రవారం (జూన్ 20) ఉధయానికి ఆయన భౌతిక కాయాన్ని కందుకూరుకు తీసుకువెడతారు. కందుకూరులో శనివారం (జూన్ 21) ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.   ఎందరినో జర్నలిస్టులు గా తీర్చిదిద్ది, జర్నలిస్టు యూనియన్ లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించిన రామయ్య మృతి తీరని లోటు అంటూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  కంచర్ల రామయ్యకు ప్రజాసమస్యల పరిష్కారంకోసం కృషి చేయడంలో ఆయన ఎన్నడూ వెనుకడుగు వేసేవారు కాదు. జర్నలిస్టుగా ఆ పని చేసిన కంచర్ల రామయ్య మరింతగా ప్రజలతో మమేకం కావడానికి, వారి సమస్యల పరిష్కారంలో మరింత చొరవచూపడానికి చట్టసభలో అడుగుపెట్టాలని భావించే వారు. ఆయన కోరుకున్నట్లు ఆయనకు  కందుకూరు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని అప్పట్లో ఎన్టీఆర్ ఇచ్చారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన నాడు పోటీ చేయలేదు. అయితే ఆయన కోరికను కుమారుడు కంచర్ల శ్రీకాంత్ తీర్చారు.  2023లో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.   చంద్రబాబు సంతాపం జర్నలిస్టుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా, ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీని స్థాపించి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన కంచర్ల రామయ్య మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
సీనియర్ జర్నలిస్టు కంచర్ల రామయ్య కన్నుమూత Publish Date: Jun 19, 2025 8:37PM

దోపిడీ కేసులో తిరుమలలో పని చేసే కానిస్టుబుల్ ను అరెస్టు చేసిన తమిళనాడు పోలీసులు

తిరుమలలో విధులు నిర్వహిస్తున్న  కానిస్టేబుల్‌ అరుణ్ కుమార్ ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.  ఓ వ్యాపార వేత్త నివాసంలో ఆయన భార్యపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన కేసులో కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.  తమిళనాడులోని వాణియంబాడిలో   తోళ్లపరిశ్రమ యజమాని ఇంతియాస్‌ అహ్మద్‌ ఇంట్లో మూడు రోజుల కిందట దోపిడీ జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా వాణియంబాడి పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. చెన్నైకు చెందిన దోపిడీ ముఠా సభ్యులకు, ఇంతియాజ్ అహ్మద్ ఇంట్లో పని చేసే శక్తివేల్‌కు సంబంధం ఉన్నట్టు గుర్తించారు. శక్తివేల్‌తో పాటు తిరుపతికి చెందిన శాంతకుమారి, కొల్లకట్టై ప్రాంతానికి చెందిన ఇళవరసన్‌( ) సహా నలుగురికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు. శక్తివేల్‌కు.. ఇళవరసన్‌కు పరిచయం ఉండగా.. ఇళవరసన్‌క తిరుపతికి చెందిన శాంతకుమారి  తెలుసు. ఈ ముగ్గురు కలిసి తిరుమలలో పనిచేసే ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అరుణ్‌ కుమార్‌ సాయంతో అరుణ్ కుమార్ అపథకం ప్రకారం దోపిడీకి పాల్పడ్డారు. ఆ కేసులోనే కానిస్టేబుల్‌ అరుణ్‌ కుమార్‌ను తిరుపతి పోలీసుల సహకారంతో తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి  వాణియంబాడికి తరలించారు.  
దోపిడీ కేసులో తిరుమలలో పని చేసే కానిస్టుబుల్ ను అరెస్టు చేసిన తమిళనాడు పోలీసులు Publish Date: Jun 19, 2025 5:54PM

వారి మృతికి జగన్ దే బాధ్యత.. కన్నా

వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు నిబంధనలను ఉల్లంఘించారని  తెలుగుదేశం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు మరణించారనీ, వారిలో ఒకరు జగన్ కాన్వాయ్ లో వాహనం ఢీ కొని మరణిస్తే.. మరొకరు ఎండలో ర్యాలీ కారణంగా మరణించారనీ ఆయన తెలిపారు. ఆ ఇద్దరి మృతికీ జగనే బాధ్యత వహించాలనన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన కన్నా..  జగన్ హయాంలో తాము ర్యాలీలకు పిలుపునిస్తే  తెలుగుదేశం నేతలను గృహ నిర్బంధాలు చేశారని గుర్తు చేశారు. అప్పటి రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటలను కూడా అడ్డుకున్నారన్నారు. మూడు వాహనాలు, వంద మందితో వెళ్లాలని పోలీసులు చెప్పినా.. భారీగా వెళ్లి అరాచకం సృష్టించారని ఆరోపించారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులను కూడా పక్కకు నెట్టేశారని కన్నా ఆరోపించారు.  ఏడాది క్రితం చనిపోయిన వారిని పరామర్శిస్తారు కానీ ర్యాలీలో చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పలకరించే  కూడా జగన్ కు లేదా అని నిలదీశారు. జగన్ అబద్ధపు మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్న కన్నా ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా జనం పట్టించుకోరన్నారు.  
వారి మృతికి జగన్ దే బాధ్యత.. కన్నా Publish Date: Jun 19, 2025 5:35PM

తిరుమలలో ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆర్టీసీ అధికారులతో కలిసి ఈ సేవలను గురువారం (జూన్ 19) ప్రారంభించారు. ప్రైవేట్ వాహనాల దోపిడీని, కాలుష్యాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ సర్వీసులను ప్రారంభించినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. శ్రీవారి ధర్మ రథాలు తిరిగే మార్గంలోనే ఈ బస్సులు తిరుగుతూ భక్తులను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తాయి.  శ్రీవారి మెట్టు, పాపవినాశనం వంటి ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.  తిరుమలలో భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు వాహనాల దోపిడీని అరికట్టడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా ఈ సేవలను అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.  తొలి దశలో 20 బస్సులను అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇవి ఇప్పటికే తిరుమలలో తిరుగుతున్న 12 శ్రీవారి ధర్మరథాలకు అదనంగా ఆర్టీసీ బస్సులు 80 ట్రిప్పులు తిరుగుతాయి. దీని వల్ల ప్రతి ఐదు నిముషాలకు ఉచిత బస్సు భక్తులకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ప్రతి మూడు నిముషాలకు  ఈ ఉచిత బస్సు అందుబాటులోనికి తీసుకువస్తామని వెంకయ్య చౌదరి తెలిపారు.  
తిరుమలలో  ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం Publish Date: Jun 19, 2025 5:20PM