బాల్క సుమన్‌పై కేసు నమోదు...అరెస్టు

posted on: May 30, 2026 2:44PM

 

సింగరేణి సంస్థ ఆస్తులపై దాడులు, విధ్వంస చర్యలకు ప్రజలను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మాజీ ఎంపీ బాల్క సుమన్‌తో పాటు మరికొందరిపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సింగరేణి భవన్‌లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ ఇన్‌స్పెక్టర్ బి. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.ఫిర్యాదు ప్రకారం, మే 26న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ సమావేశంలో బాల్క సుమన్ ప్రసంగిస్తూ సింగరేణి సంస్థకు చెందిన కార్యాలయాలు, భవనాలను లక్ష్యంగా చేసుకుని ఆందోళనలు చేపట్టాలని, మందమర్రిలోని సింగరేణి జీఎం కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను కూడా ముట్టడి చేసి ధ్వంసం చేయాలని పిలుపునిచ్చినట్లు ఆరోపించారు.

అదే సమావేశంలో పాల్గొన్న కొందరు వ్యక్తులు ఇటువంటి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం కోరగా, అందుకు తాను సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజలను హింసకు ప్రేరేపించేలా ఉండటమే కాకుండా, సింగరేణి ఉద్యోగుల భద్రతకు, ప్రభుత్వ ఆస్తులకు ముప్పు కలిగించే అవకాశం ఉందని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలను కూడా పోలీసులకు అందజేసినట్లు సమాచారం. వీడియోలో నమోదైన వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, అవి ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశముందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఫిర్యాదును పరిశీలించిన నాంపల్లి పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎం. సుమిత్ర దేవి సంబంధిత చట్టాల కింద క్రైమ్ నెం. 211/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసుకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను సేకరించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నాయని, వాటి నిజానిజాలు విచారణ అనంతరం తేలనున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...