బాల్క సుమన్ అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్

posted on: Feb 18, 2026 5:50PM

 

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా ఉన్న ఒక దళిత నాయకుడిని, ముందస్తు నోటీసులు లేకుండా బందిపోట్ల మాదిరిగా అరెస్టు చేయడం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. క్యాతనపల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విరుద్ధమని, నిష్పక్షపాతంగా ఉండాల్సిన రిటర్నింగ్ ఆఫీసర్లు మరియు పోలీసులు కాంగ్రెస్ నాయకుల కళ్లసైగలకు తలొగ్గి పని చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పతనానికి సంకేతమని హెచ్చరించారు.

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయిందని, క్యాతనపల్లిలో ప్రజలు బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, ఆ తీర్పును అపహాస్యం చేస్తూ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, అడ్డుకున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. వందల మంది పోలీసులను పెట్టి మరి క్యాతనపల్లిలో మంత్రి వివేక్ చేస్తున్న అరాచకాలను, ఎన్నికల అక్రమాలను ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే సుమన్ పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. 

బాల్క సుమన్ తో పాటు పార్టీ సీనియర్ నేతలను కార్యకర్తలను పోలీసులు వేధించడం ఆపాలని, లేకుంటే ఇప్పుడు అధికార పార్టీకి మంత్రికి అడుగులకు మడుగులోత్తుతు… అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి భవిష్యత్తులో తగిన ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ మార్కు ‘కబ్జా రాజకీయం’ నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. థొర్రూర్, జనగామ, జహీరాబాద్‌లలో జరిగిన సంఘటనలు చూస్తుంటే, ప్రజలు ఓట్లేసి గెలిపించిన కౌన్సిలర్లను సంతలో పశువుల కంటే హీనంగా కొనుగోలు చేస్తూ, దొరకని వారిని పోలీసులతో కిడ్నాప్ చేయిస్తున్న తీరు అమానుషంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

జనగామలో ఒక దళిత మహిళా ప్రజాప్రతినిధిపై సాక్షాత్తూ అధికారుల ముందే దాడులు జరుగుతున్నా రక్షణ కల్పించలేకపోయారంటే, ఈ రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని కేటీఆర్ నిలదీశారు.  బాల్క సుమన్‌ను మరియు అక్రమంగా నిర్బంధించిన బీఆర్‌ఎస్ కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని, అధికార పార్టీ మెప్పు కోసం చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసు అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ అరెస్టులతో మా గొంతు నొక్కలేరని, నిర్బంధాలతో మా పోరాటాన్ని ఆపలేరని, కాంగ్రెస్ సాగిస్తున్న ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు

 

google-ad-img
    Related Sigment News
    • Loading...