బేబీ బాస్ వైభవ్ సూర్యవంశి.. ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు

posted on: Apr 29, 2026 8:46AM

భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఓ పదిహేనేళ్ల బాలుడి పేరు మార్మోగిపోతోంది. ఐపీఎల్ లో అతడు సృష్టిస్తున్న పరుగుల విధ్వంసం క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరుస్తోంది. కమిన్స్ వంటి అంతర్జాతీయ ప్లేయర్లను సైతం అతడి అభిమానులుగా మార్చేస్తోంది. అతడే 15 ఏళ్ల  వైభవ్ సూర్యవంశి.  ఇండియన్ ప్రీమియర్ లీగ్  2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ కుర్రాడు, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు.    సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ చేసిన మెరుపు సెంచరీ అతడిని రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్‌ను చేసింది.

కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు చేసిన వైభవ్, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఇండియన్ గా రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 12 సిక్సర్లు బాదడం విశేషం. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అతను ఆడుతున్న తీరు క్రికెట్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో 14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన వైభవ్, ఇప్పుడు తన ప్రదర్శనతో ఆ రికార్డుల స్థాయిని మరింత పెంచుతున్నాడు.  

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం  స్ఫూర్తిదాయకం. తండ్రి సంజీవ్ ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ యువకుడు..  12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు.  ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.  

రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్‌లోని ప్రతిభను గుర్తించి 2025 వేలంలో 1.1 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఇప్పుడు అతను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా పరుగులు సాధిస్తున్నాడు. ముఖ్యంగా అతని బ్యాట్ స్పీడ్, స్ట్రోక్ ప్లే లో చూపిస్తున్న టైమింగ్  దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌లను గుర్తుచేస్తోందని అభిమానులు అంటున్నారు.  

ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే..  వైభవ్ సూర్యవంశీ అతి త్వరలోనే టీమ్ ఇండియా సీనియర్ జట్టులోకి అడుగుపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే 400కు పైగా పరుగులు సాధించిన ఈ యువ సంచలనం..  మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో వైభవ్ ఇంకా ఎలాంటి అద్భుతాలు చేస్తాడోనని క్రికెట్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

కాగా మంగళవారం (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్ లో ఈ చిచ్చరపిడుగు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 400 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.  అతడీ ఘనతను కేవలం ఈ ఘనతను కేవలం 167 బంతుల్లోనే అందుకున్నాడు. ఈ క్రమంలో ఆండ్రీ రసెల్  188 బంతుల్లో నాలుగువందల పరుగుల రికార్డు చెరిగిపోయింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...