అయోధ్య కోసం సుప్రీం కీలక సూచన... స్వాగతించిన బీజేపీ

posted on: Mar 22, 2017 11:37AM

 

రామ‌జ‌న్మభూమి-బాబ్రీ మ‌సీదు వివాదం పరిష్కారానికి చర్చలే మార్గమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రెండు వ‌ర్గాలు కోర్టు బ‌య‌ట చ‌ర్చల ద్వారా ప‌రిష్కరించుకోవాల‌ని సూచించింది. ఆరేళ్లుగా పెండింగ్‌లో అయోధ్య అంశంపై అత్యవసర విచారణ కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటీష‌న్‌ ను విచారించిన అత్యున్నత న్యాయ‌స్థానం... కీలక సూచనలు చేసింది. బాబ్రీ మసీదు వివాదం మతానికి, సెంటిమెంటుకు సంబంధించిన అంశమన్న సుప్రీం...నమ్మకాలకు సంబంధించిన విషయాల్లో చర్చల ద్వారా పరిష్కారమే మంచిదని వ్యాఖ్యానించింది.

 

అయోధ్య వివాదంపై ఇరువర్గాలతో చర్చలు జరిపి ఈ నెల 31 లోగా నివేదిక అందించాలని సుబ్రమణ్యస్వామికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పరిష్కారం లభించని పక్షంలో తాము మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు సూచనను బీజేపీ స్వాగతించింది. కోర్టు బ‌య‌ట స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని రామ జన్మ భూమి ఉద్యమం నిర్వహించిన కేంద్ర మంత్రి ఉమాభార‌తి విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే అయోధ్య విషయంలో చర్చలుండవని గతంలోనే ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు. వివాదాన్ని న్యాయస్థానమే తేల్చాలని స్పషం చేశారు.

 

మరోవైపు అయోధ్య స‌మ‌స్యను చ‌ర్చల ద్వారా ప‌రిష్కరించుకోవాల‌ని సుప్రీంకోర్టు సూచించిన రోజే విశ్వహిందూ పరిషత్ రామ మందిర నిర్మాణం కోసం కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. రామ్ మ‌హోత్సవ్ అనే పేరుతో... మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వ‌ర‌కు దేశవ్యాప్తంగా 2 లక్షల గ్రామాల్లో యాత్రలు చేస్తామని ప్రకటించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...