Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నాదెండ్ల ఆత్మకథలో....అసలేముంది!
posted on: Apr 22, 2026 2:47PM

నాదెండ్ల భాస్కరరావు ఆత్మకథ వాకింగ్ విత్ డెస్టినీ అన్న పుస్తకంలో అసలు ఏముంది? ఆ కోర్ పాయింట్స్ ఏమిటి? అసలాయన ఈ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చింది? అని పరిశీలిస్తే.. నాదెండ్ల భాస్కరరావు రాసిన వాకింగ్ విత్ డెస్టినీ అనే ఆత్మకథ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. సాధారణంగా చరిత్ర ఆయన్ని ఒక వెన్నుపోటుదారుడుగా చిత్రీకరిస్తే, ఈ పుస్తకంలో ఆయన తన వెర్షన్ను ప్రపంచానికి వివరించారు.
టీడీపీ ఏర్పాటులో ఎన్టీఆర్ కేవలం పార్టీ ముఖచిత్రం మాత్రమేనని, పార్టీకి పునాది వేసింది, సిద్ధాంతాలు రూపొందించింది తానేనని ఈ పుస్తకంలో వాదించారు. తానొక కోఫౌండర్ గా వివరించారు. పార్టీ జెండా, గుర్తు, అభ్యర్థుల ఎంపికలో తన మేధస్సు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఒక నటుడిగా ప్రజలను ఆకర్షించగలరని, కానీ రాజకీయ పరిపాలన తనకే తెలుసన్నది ఆయన ప్రధాన వాదన. అంతే కాదు ఎన్టీఆర్ రాజకీయ గురువు ఎవరంటే తానేనంటారు నాదెండ్ల. 1984లో ఎన్టీఆర్ను దించడం వెన్నుపోటు కాదని, అది పార్టీలోని ఎమ్మెల్యేలందరి అసంతృప్తి వల్ల జరిగిన పరిణామమని ఆయన తన పుస్తకంలో రాసుకొచ్చారు.
ఎన్టీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని, అందుకే వారంతా తన దగ్గరకు వచ్చి నాయకత్వం వహించమని కోరారని ఆయన రాసుకొచ్చారు. గవర్నర్ రామ్ లాల్ తనను నిబంధనల ప్రకారమే ముఖ్యమంత్రిగా ఆహ్వానించారని సమర్థించుకున్నారు.
ఈ పుస్తకంలో ఆయన చంద్రబాబు నాయుడిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నాదెండ్ల భాస్కరరావు.
1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్లో ఉండి టీడీపీని ఓడించడానికి ప్రయత్నించారని, కానీ తర్వాత ఎన్టీఆర్ అల్లుడిగా పార్టీలోకి వచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్నారని విమర్శించారు. తనపై పడ్డ వెన్నుపోటు ముద్ర వెనుక చంద్రబాబు వ్యూహం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ పరిపాలనపై పలు విమర్శలు చేశారు నాదెండ్ల భాస్కరరావు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఆర్థికంగా రాష్ట్రాన్ని దెబ్బతీశాయని అంటారు నాదెండ్ల. ముఖ్యంగా 2 రూపాయల కిలో బియ్యం పథకం వంటివి ఆర్థిక క్రమశిక్షణను తప్పించాయని, ఆర్థిక మంత్రిగా తాను వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎన్టీఆర్తో విభేదాలు వచ్చాయని తన పుస్తం ద్వారా విశదీకరించారు నాదెండ్ల.
ఇక ఢిల్లీ పెద్దలతో సంబంధాల విషయానికి వస్తే.. ఆ సమయంలో ఇందిరా గాంధీతో తనకు ఉన్న సంబంధాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం తప్పు కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు.మొత్తంగా ఈ పుస్తకం ద్వారా నాదెండ్ల భాస్కరరావు చెప్పాలనుకున్నది ఒక్కటే..నేను రాజకీయ కుట్రదారుడిని కాదు, ఎన్టీఆర్ రాజకీయ అపరిపక్వత వల్ల దెబ్బతిన్న మేధావిని.. చరిత్రలో ఆయనను ఒక నెగటివ్ రోల్లో చూపించినప్పటికీ, తన వైపు న్యాయం ఉందని నిరూపించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నమే ఈ వాకింగ్ విత్ డెస్టినీ.
ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కరరావు మధ్య జరిగిన ఆ వాగ్వాదం, వారిద్దరి మధ్య ఉన్న స్నేహానికి శాశ్వతంగా ముగింపు పలికింది. ఆత్మకథ వాకింగ్ విత్ డెస్టినీలో నాదెండ్ల వివరించిన దాని ప్రకారం, వారి విభేదాలకు ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, ఇద్దరూ కలిసి ఒకే సోఫాలో కూర్చుని చర్చలు జరిపేవారు. అయితే, కాలక్రమేణా ఎన్టీఆర్ తనను తాను ఒక మహా నాయకుడిగా, కల్ట్ ఫిగర్ గా చూసుకోవడం ప్రారంభించారని ఆరోపిస్తారు నాదెండ్ల.
ఒక సందర్భంలో, ఎన్టీఆర్ తన వద్దకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు నేల మీద కూర్చోవాలని లేదా చాలా దూరంగా ఉండాలని ఆశించేవారని, ఇది నాదెండ్ల తనకు నచ్చలేదని కూడా రాసుకొచ్చారు. మేమిద్దరం కలిసి పార్టీని నిర్మించాం, అచ్యుతానంతం.. అంటే ఒకే ప్రాణంలాంటి వాళ్ళం అని చెప్పిన ఎన్టీఆర్, అధికారంలోకి వచ్చాక నన్ను కేవలం ఒక సాదాసీదా మంత్రిగా చూడటం ప్రారంభించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావుకు, ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు మధ్య పాలనాపరమైన ఫైళ్ల విషయంలో పెద్ద గొడవ జరిగినట్టు ఆ బుక్ లో ఉంది. ఎన్టీఆర్ కొన్ని నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకునేవారని, ఆర్థిక మంత్రిగా తాను సంతకం చేయకపోతే ఆగ్రహించేవారని అంటారు నాదెండ్ల.
ఒకరోజు ఒక ఫైల్ విషయంలో వాగ్వాదం జరిగినప్పుడు, ఎన్టీఆర్ చాలా కోపంగా మాట్లాడారని, దానిని నాదెండ్ల తన ఆత్మగౌరవానికి దెబ్బగా భావించారని రాశారు. నువ్వు రాకముందే నేను రాజకీయాల్లో ఉన్నాను, నాకు నియమాలు నేర్పించొద్దు!అనే అర్థం వచ్చేలా నాదెండ్ల ఎదురు తిరిగారట. నాదెండ్ల తన పుస్తకంలో ప్రధానంగా నిందించింది చంద్రబాబు నాయుడును. ఎన్టీఆర్కు, తనకు మధ్య ఉన్న దూరాన్ని చంద్రబాబు వాడుకున్నారని ఆయన ఆరోపించారు. తండ్రి లాంటి ఎన్టీఆర్ను నేను వదులుకోలేదు, కానీ ఆయన పక్కన చేరిన శక్తులు.. అంటే చంద్రబాబు..నన్ను పార్టీకి దూరం చేశాయి..అని ఆయన తన ఆత్మకథలో మెయిన్ కోర్ పాయింట్గా చెప్పారు.
ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లే ముందు, బాధ్యతలను నాదెండ్లకు అప్పగించకుండా మరొకరికి ఇవ్వాలని చూడటం వారి మధ్య ఉన్న విబేధాలను మరింత పెద్దది చేసింది. అదే సమయంలో నాదెండ్ల భాస్కరరావు ఎమ్మెల్యేలను కూడగట్టి, గవర్నర్ను కలవడానికి నిర్ణయించుకున్నారు. నాదెండ్ల దృష్టిలో ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడు కానీ మొండి పరిపాలకుడు. ఎన్టీఆర్ దృష్టిలో నాదెండ్ల ఒక వ్యూహకర్త కానీ నమ్మకద్రోహి. ఈ రెండు వెర్షన్ల మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర నలిగిపోయింది. ఇలా చెబుతూ పోతే ఈ పుస్తకం ఎన్నో రాజకీయ రహస్యాలను విడమరచి చెబుతుంది.


.webp)



