మతం పేర అరాచకాలు.!

posted on: Jul 18, 2026 2:41PM

హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో తీవ్ర కలకలం రేగింది. రాజకీయ, మతపరమైన అంశాలపై జరిగిన ఈ లైవ్ డిబేట్‌లో ఒక ప్రతినిధి మరో ప్యానలిస్టుపై భౌతిక దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్‌కు సంబంధించిన వివాదమే చివరకు ఈ ఘర్షణకు దారితీసింది. దీనిపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. మతం పేరుతో జరుగుతున్న రచ్చకు ఇది తాజా ఉదాహరణ అన్నారు.

అసలు ఇంతకీ  టీవీ లైవ్ డిబేట్ లో భౌతిక దాడికి దారి తీసిన కారణం ఏంటంటే.. ఇటీవల హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంగా నగరంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అందులో ఒక కటౌట్‌లో శ్రీమహావిష్ణువు విశ్వరూప ప్రదర్శన చిత్రంలో విష్ణుమూర్తి ముఖ స్థానంలో ప్రధాని మోదీ ముఖాన్ని మార్ఫింగ్ చేసి పెట్టారు. దీనిపై హిందూ ధర్మ ప్రచారకుడు, సామాజిక విశ్లేషకుడు రమణమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దైవ సమానమైన విశ్వరూప స్థానంలో ఒక రాజకీయ నాయకుడి ఫోటో పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన పేర్కొన్నారు.

రమణమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలపై డిబేట్‌లో పాల్గొన్న  ధర్మవీర్  సంస్థ ప్రతినిధి కశ్యప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, హిందుత్వ, మోదీ అన్నీ ఒకటేనని, ఇందులో తప్పేముందని ఆయన వాదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాడివేడి చర్చ నడిచింది. రమణమూర్తి శాంతంగా సమాధానం ఇస్తున్నప్పటికీ, కశ్యప్ రెడ్డి సహనం కోల్పోయి ఒక్కసారిగా తన చెప్పు తీసుకుని రమణమూర్తిపై దాడికి తెగబడ్డారు.

ఈ ఆకస్మిక దాడితో టీవీ స్టూడియోలో ఉన్న యాంకర్లు, ఛానల్ సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే జోక్యం చేసుకుని కశ్యప్ రెడ్డిని పక్కకు లాగి, అక్కడి నుంచి పంపించి వేశారు. అవమానానికి గురైన రమణమూర్తి అనంతరం స్టూడియో వెలుపలికి వచ్చి మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో, అదీ టీవీ చర్చల్లో ఇలాంటి భౌతిక దాడులకు దిగడం అత్యంత హేయమైన చర్యని ఆయన మండిపడ్డారు. రమరమూర్తి వ్యతిరేకించింది హిందుత్వనే కానీ హిందూ మతానని కాదని భరద్వాజ విశ్లేషించారు. 

రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ,  చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే  హిందుత్వ  వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే  ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు. 

సామాజిక మాధ్యమాలు, టీవీ చర్చల్లో ఇటీవల కాలంలో కొందరు నాయకులు, సంస్థల ప్రతినిధుల భాష, ప్రవర్తన పూర్తిగా అదుపు తప్పుతోందని, కేవలం రాజకీయ పార్టీల మెప్పు కోసమో, లేదా ఆర్థిక లబ్ధి కోసమో కొందరు ఇటువంటి వివాదాలను సృష్టిస్తూ సమాజంలో అలజడి రేపుతున్నారని అభిప్రాయపడ్డారు. 

ఇలాంటి దాడులు జరిగినప్పుడు సదరు రాజకీయ శ్రేణులు గానీ, అనుబంధ సంస్థలు గానీ మౌనంగా ఉండటం మరిన్ని దాడులకు ఉసిగొల్పినట్లవుతుందని హెచ్చరించారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి అసలు ప్రజా సమస్యలైన నిరుద్యోగం, ఫీజు రీయింబర్స్‌మెంట్, పోలవరం నిధులు, ఆరోగ్యశ్రీ వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

Kashyap Reddy Attacks Ramana Murthy, TV Debate Slipper Attack Hyderabad,  Modi Vishwaroopam Cutout Controversy, Dharmaveer Kashyap Reddy, Tone News,  Tone News Debate Attack Case

google-ad-img
    Related Sigment News
    • Loading...