Latest News
సెహ్వాగ్ సెటైర్.. అశ్విన్ కౌంటర్.. నవ్వులు పూయించిన మాజీ క్రికెటర్లు
posted on: Mar 31, 2026 2:34PM

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే. అత్యంత ఆదరణతో సాగుతున్న ఈ లీగ్ ఇప్పటికే 18 సీజన్ లు పూర్తి చేసుకుని 19వ సీజన్ లోకి ప్రవేశించింది. సీజన్ సీజన్ కూ ఐపీఎల్ కు ఆదరణ పెరుగుతోనే ఉంది. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన మాత్రమే కాదు.. మైక్ పట్టుకుని ఆటకు కామెంటరీ చెప్పే కామెంటేటర్ల జోవియల్ టెండెన్సీ కూడా క్రికెట్ అభిమానులకు కావలసినంత ఆనందాన్ని, ఎంటర్ టైన్ మెంట్ నూ అందిస్తోంది.
తాజాగా ఈ 19వ సీజన్ లో భాగంగాతొలి మ్యాచ్ (మార్చి 28) బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఫలితం అందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ కామెంటేటర్ గా తన కొత్త ఇన్నింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ కామెంటేటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో అశ్విన్ను పలకరిస్తూ ఈ రోజు మనం లాజిక్లు, లెక్కలతో సంబంధం లేకుండా కేవలం మనసుతో మాట్లాడదాం అంటూ వ్యాఖ్యానించాడు.
సెహ్వాగ్ వ్యాఖ్యలకు అశ్విన్ తనదైన శైలిలో దీటైన బదులిచ్చాడు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని, విజ్ఞతతో మెలగాలని మా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. కానీ మీరు మాత్రం దానికి భిన్నంగా ఆలోచించకుండా మాట్లాడమంటున్నారేమిటి? అంటూ కౌంటర్ ఇచ్చారు.
అశ్విన్ ఇచ్చిన ఈ స్మార్ట్ రిప్లై విన్న సెహ్వాగ్, అశ్విన్కు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగా అతిగా ఆలోచించి మాట్లాడతారని, ఒకవేళ ఏదైనా ప్లేయర్ గురించి ప్రతికూలంగా మాట్లాడితే తమ ఫాలోవర్లు తగ్గిపోతారనే భయం ఉంటుందని సెటైర్ వేశాడు. ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ చమత్కారంగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇలా కామేంటేటర్ల సమయస్ఫూర్తి, సెటైర్లు, చమత్కార సంభాషణలు కూడా ఐపీఎల్ ను రక్తకట్టిస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.






