ఆర్ట్ ఆఫ్‌ లివింగ్‌ వేడుకలో.. దొంగలకు సందు చిక్కింది

posted on: Mar 15, 2016 5:56PM

దిల్లీలోని యమునా నదీతీరాన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ నిర్వహించిన సాంస్కృతి ఉత్సవం చాలా విమర్శలనే ఎదుర్కొని ఉండవచ్చుగాక. పర్యావరణ అనుమతులు సరిగా లేవనీ, యమునా నదీతీరాలకు ఇది నష్టం కలిగిస్తుందనీ... ఇలా రకరకాల విమర్శల మధ్య ఎలాగొలా కార్యక్రమాన్ని ముగించారు నిర్వాహకులు. కానీ ఉత్సవాలకు వచ్చినవారిలో చాలామంది ఖాళీ జేబులతో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందట. ఉత్సవాల హడావుడిలో పదుల కొద్దీ జేబు దొంగలు తమ కళను ప్రదర్శించడమే దీనికి కారణం. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, హర్యానా, దిల్లీ... ఇలా పలు రాష్ట్రాలకు చెందిన చిల్లరమల్లర దొంగలు, ప్రాంతీయ బేధాలను మరిచి, ఈ ఉత్సవాలలో తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారట. ఉత్సవానికి వచ్చినవారి వద్దనుంచి ఫోన్లు, నగదు, గుర్తింపు పత్రాలు మొదల్కొని విగ్రహాల వరకూ రకరకాల వస్తువులు పోయాయని, వందకు పైగా ఫిర్యాదులు అందడమే దీనికి సాక్ష్యం. ఆఖరికి రష్యా నుంచి వచ్చిన ఒక కళాకారిణి తాలూకు మేకప్ కిట్‌ కూడా పోవడంతో, ఆమె తన ప్రదర్శనను నిర్వహించలేకపోయారు. ఉత్సవాల నేపథ్యంలో గస్తీ కాస్తున్న పోలీసుల చేతికే 30 మంది దొంగలు చిక్కారంటే... ఇక చిక్కని దొంగలు ఎందరు ఉండి ఉంటారో ఊహించవచ్చు. మొత్తానికి ‘జీవించే కళ’ (ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌) ఉత్సవంలో చోరకళని ప్రదర్శించేవారు కూడా పాల్గొన్నారన్నమాట!

google-ad-img
    Related Sigment News
    • Loading...