ఆక్వా, పొగాకు రంగాలకు కేంద్రం చేయూత ఇవ్వాలి : సీఎం చంద్రబాబు

posted on: Jul 20, 2026 4:16PM

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు వేర్వేరుగా లేఖలు రాశారు. రొయ్యల మేత తయారీకి అవసరమైన జీఎం సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి, అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు, ఫిష్ మీల్ ఎగుమతులను క్రమబద్ధీకరించడం, ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు, ఆక్వా ఏరియేటర్లు, ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గింపు వంటి పలు కీలక అంశాలను లేఖల్లో ప్రస్తావించారు.

కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు రాసిన లేఖలో రొయ్యల మేత తయారీలో ప్రధాన ముడిసరుకైన సోయాబీన్ మీల్ ధరలు భారీగా పెరగడంతో మేత తయారీ వ్యయం పెరిగి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం వివరించారు. దేశీయంగా ముడిసరుకు కొరతను అధిగమించేందుకు జన్యుమార్పిడి చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కోరారు. 2021లో కూడా పరిమిత స్థాయిలో ఇలాంటి అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ దిగుమతుల వల్ల జీవ వైవిధ్యానికి లేదా దేశీయ వంగడాలకు ఎలాంటి ముప్పు ఉండదని, నాణ్యమైన ముడిసరుకు అందుబాటులోకి రావడంతో ఉత్పత్తి వ్యయం తగ్గి లక్షలాది మంది రైతులు, కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. 

ఈక్వెడార్ నుంచి పెరిగిన రొయ్యల ఉత్పత్తి, ఎగుమతుల కారణంగా అమెరికా, చైనా, యూరప్ వంటి మార్కెట్లలో భారతీయ రొయ్యలు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయని కూడా వివరించారు. ఆక్వా రంగ అభివృద్ధికి అమరావతిలో ఎన్‌ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం మరో లేఖలో కోరారు. జూన్ 5న విశాఖపట్నంలో జరిగిన సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్‌లో ఇచ్చిన హామీ మేరకు గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే కేటాయించినట్లు తెలిపారు. అక్కడ ప్రాంతీయ కార్యాలయం, శిక్షణా కేంద్రం, అక్వేరియం, ప్రజల సందర్శన కోసం పార్కును ఏర్పాటు చేసి 2028 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ కేంద్రం బ్లూ ఎకానమీ అభివృద్ధికి కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో ఫిష్ మీల్ ఎగుమతులను డీజీఎఫ్‌టీఏ ద్వారా క్రమబద్ధీకరించాలని సీఎం కోరారు. ప్రస్తుతం ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల దేశీయ రొయ్యల ఫీడ్ తయారీదారులు అధిక ధరలకు ముడిసరుకు కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. దేశీయ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతే ఫిష్ మీల్ ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రాసెస్ చేయని ఎఫ్‌సీవీ పొగాకును రోడ్‌టెప్ (RoDTEP) పథకం పరిధిలోకి తీసుకువచ్చి ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. 

జింబాబ్వే, టాంజానియా వంటి దేశాలు తమ ఎగుమతిదారులకు రాయితీలు కల్పిస్తుండగా భారతీయ ఎగుమతిదారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారని వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఆక్వా ఏరియేటర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఆక్వా రైతులకు రూ.5 లక్షల వరకు వన్‌టైమ్ టాప్-అప్ రుణ సౌకర్యం కల్పించాలని కోరారు.

దేశీయ మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు ఎన్‌ఎఫ్‌డీబీ ద్వారా రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు అందించి రొయ్యల ఎగుమతులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాసెస్ చేయని పొగాకు (హెచ్‌ఎస్‌ఎన్ కోడ్–2401)పై ప్రస్తుతం ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని కోరారు. జీఎస్టీ భారం తగ్గితే రైతులు, డీలర్లు, ఎగుమతిదారులకు వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు తగ్గి ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి తన లేఖల్లో పేర్కొన్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...