Latest News
అనుమతులు లేకుండానే చైనాలో యాపిల్ కొత్త ఫీచర్లు!
posted on: Apr 1, 2026 10:14AM

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వినియోగదారుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన యాపిల్ ఇంటెలిజెన్స్'ఫీచర్లు చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అధికారికంగా రెగ్యులేటరీ అనుమతులు రాకుండానే.. చైనాలోని కొంతమంది ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అందుబాటులోకి రావడం కలకలం సృష్టించింది. సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగిందని యాపిల్ చెబుతోంది. వెంటనే ఈ సేవలను నిలిపివేసినట్లు పేర్కొంది.
ఇంతకీ అసలేం జరిగిందంటే.. చైనాలోని కొంతమంది ఐఫోన్ యూజర్లు తమ ఫోన్ సెట్టింగ్స్లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఆక్టివేట్ అయినట్లు గుర్తించారు. వెంటనే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియా పోస్టు చేశారు. వెంటనే అవి తెగ వైరల్ అయ్యాయి. విదేశీ ఏఐ సాంకేతికతపై చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులో ఉన్నా.. ఎటువంటి అనుమతులూ లేకుండా ఈ ఫీచర్లు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింద.
వాస్తవానికి చైనా మార్కెట్ కోసం యాపిల్ సంస్థ స్థానిక టెక్ దిగ్గజం అలీబాబాతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ హువావే, షావోమీ వంటి స్థానిక కంపెనీలు ఇప్పటికే ఏఐ ఫీచర్లతో దూసుకుపోతుండటంతో.. అక్కడి మార్కెట్ లో యాపిల్ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే త్వరగా సేవలు ప్రారంభించాలనే ఉద్దేంతో ఉంది. అయితే తాజాగా అనుమతులు లేకుండానే కొందరి ఫోన్లలో యాపిల్ ఏఐ ఫీచర్లు యాక్టివేట్ కావడం ఆ సంస్థకు పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. టెక్నికల్ లోపంగా చెప్పి యాపిల్ ఆ సేవలను చైనాలో నిలిపివేసినప్పటికీ మార్కెటింగ్ పరంగా యాపిల్ చైనాలో కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గత ఏడాది నుంచే యాపిల్ ఏఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. చైనాలో మాత్రం చట్టపరమైన చిక్కుల వల్ల ఇంకా అందుబాటులోకి రాలేదు. చైనాలో ఎదురవుతున్న ఈ రెగ్యులేటరీ అడ్డంకులను తొలగించుకుని, ఏఐ సేవలను యాపిల్ చైనాలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పుడు మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. యాపిల్ టెక్నికల్ ఎర్రర్ అని చెప్పినప్పటికీ ఈ విషయాన్ని చైనా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందంటున్నారు.






