ప్రోఫెసర్ నాగేశ్వర్ కిరాయి ఎనలిస్ట్.. తెలుగువన్ ఇంటర్వ్యూలో అప్పసాని రాజేశ్ ఫైర్

posted on: May 20, 2026 4:18PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ విశ్లేషకుడు  ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు   తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీకి వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనీ, టీడీపీ కేవలం ఇన్స్టంట్ ఫ్రెండ్ మాత్రమేనంటూ ఆయన సరికొత్త థియరీని తెరపైకి తెచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చిందని, జనసేన కోర్ కమిటీ ద్వారా ఈ సమాచారం తనకు తెలిసిందని నాగేశ్వర్ పేర్కొనడం సంచలనంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన  ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేశారు.   ప్రొఫెసర్ నాగేశ్వర్ విజ్ణత కోల్పోయి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.   తెలుగు దేశం, బీజేపీ  బంధం నిన్న మొన్నటిది కాదనీ..  1984లో ఎన్టీ రామారావు హయాం నుంచే రెండు పార్టీల మధ్య బలమైన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాలకు  పైగా ఉన్న ఈ సుదీర్ఘ అనుబంధాన్ని ఇన్స్టంట్ ఫ్రెండ్ షిప్ అనడం నాగేశ్వర్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

కూటమిలో   వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు.   ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్  జై ఆంధ్రప్రదేశ్' అని అనడాన్ని కూడా నాగేశ్వర్ తప్పుగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాంతీయ, కుల విభేదాలను రూపుమాపి సమైక్యతను తీసుకురావడానికే జనసేనాని ఆ నినాదం ఇచ్చారని స్పష్టం చేశారు.  వైసీపీ   హయాంలో మూడు రాజధానుల వివాదం వచ్చినప్పుడే  జై అమరావతి నినాదం ప్రాధాన్యత సంతరించుకుందని, రాష్ట్రం మొత్తాన్ని ఉద్దేశించినప్పుడు  జై ఆంధ్రప్రదేశ్ అనడంలో తప్పేముందని ప్రశ్నించారు. అమరావతి అనేది ఐదు కోట్ల ప్రజల రాజధాని అన్న అప్పసాని రాజేశ్..  అది కేవలం టీడీపీకి మాత్రమే పరిమితమైనది కాదన్నారు.

రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూడకుండా కేవలం అమరావతిపైనే నిధులు కుమ్మరిస్తున్నారనడం అబద్ధమని తోసిపుచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కేవలం 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారో ఇలాంటి సోకాల్డ్ ప్రొఫెసర్లకు అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంపై విద్వేషాలు చొప్పించేందుకు జరుగుతున్న ఇటువంటి ఎజెండా బేస్డ్ ప్రచారాలను ప్రజలు నమ్మరనీ, భవిష్యత్తులో వీరికి తగిన బుద్ధి చెబుతారని అప్పసాని అన్నారు.  
 

google-ad-img
    Related Sigment News
    • Loading...