Latest News

ఏపీ మెట్రో రైలు ప్రాజెక్టు బాధ్యతలు శ్రీధరన్ కే!

posted on: Oct 9, 2014 7:45AM

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలలో నిర్మించ తలపెట్టిన మూడు మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఫీసిబిలిటీ మరియు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను తయారుచేసే బాధ్యతలను డిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ చైర్మన్ ఈ శ్రీధరన్ కు అప్పగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఆయనను ఈ మూడు ప్రాజెక్టులకు ప్రధాన సలహాదారుగా నియమించుకొంది. ఇప్పుడు వాటి నివేదికలు సిద్దం చేసే బాధ్యత కూడా ఆయనకే అప్పగించింది.

 

క్రిందటి నెల విజయవాడలో పర్యటించిన ఆయన ఈ మెట్రో రైలు ప్రాజెక్టు నడపడం లాభదాయకం కాదు కనుక దానిని ప్రభుత్వం సూచించిన విధంగా విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి ప్రాంతాలను కలుపుతూ నిర్మించడం మంచిది కాదని, దానిని కేవలం విజయవాడ నగరానికే పరిమితం చేయమని సలహా ఇచ్చారు. వచ్చే జనవరి నెలాఖరులోగా ఇందుకోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తానని, కేంద్రప్రభుత్వం నుండి ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు రాగానే ఆరు నెలలలో మొదలుపెట్టి మూడేళ్ళలో పూర్తిచేస్తానని ఆరోజే తెలియజేసారు.

 

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఈ రెండు నివేదికలు తయారు చేసే బాధ్యతలు అప్పగించడంతో ఇకపై పనులు జోరందుకోవచ్చును. ఆయన ఈనెల 15,16 తేదీలలో వైజాగులో పర్యటించి జీ.వీ.యం.సి. ప్రతిపాదిస్తున్న నాలుగు మార్గాలను అధ్యయనం చేసి నగరానికి బాగా ఉపయోగపడే ఒక మార్గాన్ని సూచిస్తారు. జీ.వీ.యం.సి. ఇప్పటికే ఈ నివేదికలు తయారు చేసేందుకు టెండర్లు పిలవగా నాలుగు కంపెనీలు టెండర్లు దాఖలు చేయ్సాయి. కానీ ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ఆ బాధ్యతలను పూర్తిగా ఆయనకే అప్పగించడంతో ఇక ఆ కంపెనీలకు అవకాశంలేనట్లే భావించవచ్చును.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వైజాగ్ లోనే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో మెట్రో రైలు కూడా వస్తే ఇక వైజాగ్ నగరం ఇక హైదరాబాదుతో పోటీ పడి మరీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...