ఏపీ లిక్కర్ టెండర్ స్కామ్..నిందితులకు రిమాండ్..!

posted on: Jul 21, 2026 11:51AM

 

ఏపీలో సంచలనం రేపిన మద్యం రవాణా టెండర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఏ1 దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఏ4 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ8 కారుమూరి సునీల్‌లను సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ముగ్గురికి ఆగస్టు 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే మరో కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న ఈ ముగ్గురు నిందితులను సిట్ అధికారులు పీటీ (ప్రిజనర్ ట్రాన్సిట్) వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా సిట్ తరఫు న్యాయవాదులు కోర్టుకు కీలక వివరాలు వెల్లడించారు. మద్యం రవాణా టెండర్ల ప్రక్రియలో నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చి, కొందరు సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారని, బినామీ సంస్థలకు అక్రమంగా టెండర్లు కట్టబెట్టినట్లు ఆరోపించారు.

రవాణా ఛార్జీలను అనుచితంగా పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.192 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సిట్ తన రిమాండ్ నివేదికలో పేర్కొంది. ఈ అక్రమాల కారణంగా ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం జరిగిందని, పలువురు అధికారులు, ప్రైవేటు వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని సిట్ కోర్టుకు వివరించింది. అలాగే ఆర్థిక లావాదేవీలు, టెండర్ల మంజూరు ప్రక్రియ, నిధుల బదిలీలపై మరింత లోతుగా విచారణ చేపడుతున్నట్లు తెలిపింది.

మరోవైపు, నిందితుల తరఫు న్యాయవాదులు రిమాండ్ అవసరం లేదని, తమ క్లయింట్లపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని వాదించారు. అయితే ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు ముగ్గురిని ఆగస్టు 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాలని ఆదేశించింది. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో, రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

AP Liquor Transport Tender Scam, AP SIT, Vijayawada ACB Court, Judicial Remand, PT Warrant, Donthireddy Vasudeva Reddy, Kasireddy Rajasekhar Reddy, Karumuri Sunil, Liquor Tender Irregularities, Tender Scam Andhra Pradesh

google-ad-img
    Related Sigment News
    • Loading...