హస్తినకు విమానంలో విద్యాయాత్ర.. ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లోకేష్ కానుక

ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు  బుధవారం (నవంబర్ 5) ఢిల్లీకి వెళ్లారు. వీరందరినీ ప్రభుత్వం హస్తినకు పింపించింది.   నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం, రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్కల్చర్‌  సహా పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ రెండు రోజుల విద్యా యాత్ర ద్వారా విద్యార్థులకు విజ్ఞానశాస్త్రం, సాంకేతికతలపై అవగాహన  పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. 
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతానంటూ విద్యామంత్రి లోకేష్ చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటున్నారు.

అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన వంద మంది విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్  విద్యాశాఖ ఈ అద్భుతమైన అవకాశం కల్పించింది. శాస్త్ర సాంకేతిక రంగాలపై వారికి ప్రత్యక్ష అనుభవం అందించే లక్ష్యంతో 'సైన్స్‌ ఎక్స్‌పోజర్‌ టూర్' పేరిట విద్యార్థులను విమానంలో ఢిల్లీ యాత్రకు పంపింది.  రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 52 మంది విద్యార్థులను ఢిల్లీకి విజ్ఞాన యాత్రకు పంపింది.  

ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) రంగాల్లోని  నిపుణులతో సమావేశమై వారి అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. ఈ పర్యటనలో  తొలి  రోజు ఢిల్లీలోని రష్యన్‌ సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ కల్చర్‌ను   సందర్శిస్తారు. అక్కడ ఇండో-రష్యన్‌ అంతరిక్ష సహకారంపై జరిగే ప్రత్యేక సెషన్‌లో పాల్గొంటారు. స్పుత్నిక్‌పై లఘుచిత్ర ప్రదర్శనతో పాటు ఇండో-రష్యన్‌ స్పేస్‌ ఫ్రెండ్‌షిప్‌పై పోటీలు నిర్వహిస్తారు. ఇక పర్యటనలో రెండో రోజు  విద్యార్థులు నేషనల్‌ సైన్స్‌ మ్యూజియం సందర్శించి, రాకెట్రీ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. రాకెట్‌ డిజైన్‌, ప్రొపల్షన్‌, శాటిలైట్‌ లాంచ్‌ వంటి క్లిష్టమైన అంశాలపై నిపుణులు వీరికి అవగాహన కల్పిస్తారు.

అనంతరం మోడల్‌ రాకెట్‌ లాంచ్‌ సెషన్‌లో కూడా విద్యార్థులు భాగస్వాములవుతారు. అలాగే  నెహ్రూ ప్లానిటోరియం, ప్రధానమంత్రి సంగ్రహాలయను కూడా వీరు సందర్శిస్తారు.  ఈ విజ్ఞాన యాత్రకు ఎంపికైన విద్యార్థులను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అభినందించారు.  క్షేమంగా వెళ్లి విజ్ఞానంతో తిరిగి రావాలి  అంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా   శుభాకాంక్షలు తెలిపారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu