భ్రమలు వదిలించిన ఏపీ ఉద్యోగులు

posted on: Mar 12, 2015 5:20PM

 

భ్రమలు వదిలించిన ఏపీ ఉద్యోగులు ఎవరూ ఎవరినీ ఎక్కువకాలం భ్రమల్లో వుంచలేరు. తాత్కాలికంగా భ్రమల్లో వుంచినా, చాలా కొద్దికాలానికే వారి అసలు స్వరూపం బయటపడిపోయి, వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే అయింది. రాష్ట్ర విభజన వద్దంటూ అప్పట్లో ప్రభుత్వోద్యోగులు సమైక్య ఉద్యమం ఉద్ధృతంగా నడిపారు. తెలుగువారు కలిసి వుండాలని ఉద్యోగులు ఎంత బాగా శ్రమపడుతున్నారో అని అప్పట్లో అందరూ అనుకున్నారు. అప్పటి వరకూ ప్రభుత్వోద్యోగుల మీద ప్రజల్లో వున్న వ్యతిరేక భావం మాయమైపోయింది. ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్‌బాబు హీరో అయిపోయారు. ఇంత మంచి ప్రభుత్వోద్యోగులు ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం అని తెలుగువారు మురిసిపోయారు. అయితే ఆ మురిసిపోవడం మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ప్రభుత్వోద్యోగుల అసలు స్వరూపం మెల్లమెల్లగా బయటపడింది. ప్రజలు ప్రభుత్వోద్యోగుల మీద పెట్టుకున్న భ్రమలన్నీ క్రమంగా తొలగిపోయి, ఇప్పుడు వారి నిజ స్వరూప దర్శన భాగ్యం కలుగుతోంది.

 

రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వోద్యోగుల ప్రవర్తన చూసిన ఏపీ ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే, ప్రభుత్వోద్యోగులు సమైక్య ఉద్యమం చేసింది తెలుగు ప్రజలు ఒక్కటిగా వుండాలన్న ఉద్దేశంతో కాదు... హాయిగా స్థిరపడిన హైదరాబాద్‌ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టంలేకే. ఏపీ కొత్త రాజధానికి సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ పాలన మొత్తం హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ నుంచే చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఉద్యోగుల మొండి వైఖరి ఇబ్బందికరంగా మారింది. ఏపీ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు సీఎం అభిప్రాయాన్ని గౌరవించి వెంటనే ఏపీకి తరలి వెళ్ళిపోయినట్టయితే ప్రజల్లో వారి మీద వున్న గౌరవం పెరిగేది. అయితే వారు తాము ఇప్పుడప్పుడే హైదరాబాద్‌ వదిలేది లేదని, కొత్త రాజధానిలో తమకు సదుపాయాలు వుండవని చెబుతున్నారు. ఈ ఒక్క మెతుకు చాలు.. ప్రభుత్వ ఉద్యోగుల అన్నం ఎంతవరకు ఉడికిందో చెప్పడానికి.

 

కొత్త రాష్ట్రం ఏర్పడగానే రాష్ట్ర అభివృద్ధి కోసం సామాన్య ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నో అవకాశాలు కోల్పోయారు. భవిష్యత్ తరాల ప్రజలు కూడా ఎన్నో అవకాశాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రభుత్వోద్యోగులు మాత్రం తమకు చెందిన ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు. ప్రభుత్వోద్యోగుల పదవీకాలాన్ని రెండేళ్ళపాటు పెంచేలా ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. తద్వారా నిరుద్యోగుల నెత్తిన చెయ్యి పెట్టారు. ఆ తర్వాత తాము సమ్మె చేసిన కాలానికి స్వచ్ఛందంగా జీతం వదులుకున్నట్టయితే గౌరవంగా వుండేది. ఆ కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించేలా ఒత్తిడి తెచ్చి, తమ జీతం డబ్బులు ఎక్కడకీ పోకుండా చూసుకున్నారు. అసలే ఆర్థికంగా కష్టాల్లో వున్న ప్రభుత్వం మీద ఎంతమాత్రం జాలి చూపించకుండా 43 శాతం ఫిట్‌మెంట్ పుచ్చుకుని జీతాలు డబుల్ చేసుకున్నారు. ఇన్నిచేశాం కదా... ఇప్పుడు కొత్త రాజధానికి వెళ్దాం పదండయ్యా అంటే, అక్కడ మా స్థాయి సౌకర్యాలు లేవు కాబట్టి ఇప్పుడప్పుడే రాలేం అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇలాంటి వారిని నమ్ముకుంటే ఏపీ ఎప్పటికి బాగుపడుతుందో దేవుడనేవాడుంటే ఆయనకే తెలియాలి. ఏపీ ప్రభుత్వోద్యోగులు తెలంగాణ టూరిస్టులే... జీతం అక్కడ తీసుకోవాలి.. టాక్స్‌లు ఇక్కడ కట్టాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మొహమాటంగా చెప్పేసినా ఇంకా హైదరాబాద్‌‌నే పట్టుకుని వేలాడుతున్న వాళ్ళని ఏమనాలి?

google-ad-img
    Related Sigment News
    • Loading...