చంద్రబాబు మరో కొత్త ప్రయోగం, సరికొత్త రికార్డు

 

దేశంలో మొట్ట మొదటి సారిగా కాగితం లేకుండా ఐ-ప్యాడ్ లతో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. దేశంలో మొట్ట మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి గూగూల్ హాంగ్ అవుట్స్ ద్వారా ప్రజలతో మాట్లాడబోతున్నారు.

 

ఈనెల 20వ తేదీన సాయంత్రం ఆరు నుండి ఏడూ వరకు గంటసేపు సాగే ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొని వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారు. ఇందుకుగాను ఆసక్తిగలవారు ముందుగా తమ ప్రశ్నలను ఫేస్ బుక్, ట్వీటర్ లేదా గూగూల్ హ్యాంగ్ అవుట్స్ లలో #ఆస్క్ ఏపీ సియం లేదా #ఆస్క్ సిబియన్ (#AskAPCM or #AskCBN) లద్వారా అడగవచ్చును. ఈసారి నైపుణ్యాల అభివృద్ధి మరియు ఉన్నత విద్య అనే రెండు అంశాల మీద ప్రశ్నలు అడిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి సమాధానాలు రాబట్టుకావచ్చును. అయితే ఈ కార్యక్రమం కేవలం ఒక గంట సేపు మాత్రమే సాగుతుంది కనుక కేవలం 15మంది మాత్రమే ఆయనతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. కానీ ప్రశ్నలు పోస్ట్ చేసినవారందరితో ఆయన స్వయంగా మాట్లాడలేకపోయినా వారికి ఆయన సమాధానాలు వెళతాయి.

 

ఇప్పటికే దీని గురించి ఫేస్ బుక్, ట్వీటర్ గూగల్ , రాజకీయ వెబ్ సైట్లలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండు అంశాలపై ముఖ్యమంత్రిని ప్రశ్నించదలచిన వారు తక్షణమే తమ ప్రశ్నలను పోస్ట్ చేయవచ్చును.