చంద్రబాబు చెరువులో అవకాశవాద కప్పలు
posted on: Sep 26, 2014 5:05PM
.jpg)
ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్
తెప్పలుగ చెఱువు నిండిన
కప్పలు పది వేలు చేరు కదరా సుమతీ !
........అని సుమతీ శతకకారుడు ఏనాడో చెప్పాడు. ఆవిషయం మరోసారి రుజువయ్యే సంఘటనలు చంద్రబాబు ప్రభుత్వం అనే చెరువులో జరుగుతున్నాయి. ఎవరిదగ్గర అధికారం వుంటే వాళ్ళ దగ్గర బెల్లం చుట్టూ చీమల్లా చేరే కొంతమంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు చుట్టూ చేరారు. మండూకాలు, పీపీలికాల్లాంటి ఈ శక్తులు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో వుండగా ఆయన చుట్టూ చేరి తమకు కావలసిన పనులు చేయించుకునేవారు. వైఎస్సార్ హయాం ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రుల చుట్టూ చేరి పబ్బం గడుపుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని బడా నాయకులైన మెగా కృష్ణులు, నవయుగ విశ్వేశ్వరులు ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాగానే చుట్టూ చేరి బెకబెకమంటున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు చుట్టూ వున్న కోటరీ పరిస్థితి ఎలా వుందంటే, పార్టీ అధికారంలో లేనప్పుడు జెండాలు మోసి, లాఠీ దెబ్బలు తిని, పార్టీకి ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచిన వారిని దూరం పెడుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబును కనీసం పట్టించుకోకుండా పోజులు కొట్టిన పారిశ్రామిక పెద్దమనుషులను చంద్రబాబు దగ్గరకి చేరుస్తున్నారు. ఈ పారిశ్రామిక పెద్దలు ఒకప్పుడు వైఎస్సార్ పంచె పట్టుకుని తిరిగినవారే. సీబీఐ ద్వారా అభియోగాలు ఎదుర్కొంటున్నవారే. అలాంటి వారు చంద్రబాబును ఎప్పుడు కలవాలని అనుకుంటే నేరుగా కలుస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులు చంద్రబాబుని కలవాలంటే మాత్రం అదో పెద్ద బ్రహ్మప్రళయంలా అవుతోంది. బెల్లంచుట్టూ చీమల్లాంటి ఆ పారిశ్రామికవేత్తలకు మాత్రం చంద్రబాబు దగ్గరకు వెళ్ళాటంటే రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. నిజమైన పార్టీ సేవకులను మాత్రం టెంటు సీఎం కార్యాలయం బయట టెంట్ కింద పడిగాపులు పడేలా చేస్తున్నారు.
ఈ పరిస్థితిని చూసి పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు. అవసరం వున్నంత వరకు ఓడ మల్లన్న అవసరం తీరిన తర్వాత బోడిమల్లన్న అనే ఈ తరహా వ్యక్తులను చంద్రబాబు దూరంగా వుంచాల్సిన అవసరం వుందని కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో సముచిత స్థానం కల్పించాలని కోరుతున్నారు.



.jpg)
.jpg)

.webp)



