ఏపీ మంత్రులకు ఐ-ప్యాడ్ పరీక్షలు

posted on: Sep 15, 2014 1:25PM

 

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంలో ఎప్పుడు ముందుండే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు దేశంలో మొట్టమొదటిసారిగా పేపర్ రహిత మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. అందుకోసం శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రులందరికీ ఐ-ప్యాడ్ లు, వాటి పాస్ వర్డులు అందించి వారికి వాటిని వినియోగించడంలో ఒక రోజు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. కానీ చాలామంది మంత్రులకు ఐ-ప్యాడ్ ల వినియోగంపై అవగాహన ఏర్పడలేదు. అందువల్ల తమ వ్యక్తిగత కార్యదర్శుల సహకారం తీసుకోక తప్పడంలేదు. అయితే ఈ ఐ-ప్యాడ్ లు ఉపయోగించడంలో ప్రధాన ఉద్దేశ్యం గోప్యత పాటించడం కూడా ఒకటి. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. మరి కొందరు మంత్రులు తమకు కేటాయించిన పాస్ వర్డులు మరిచిపోవడంతో, అసలు ఐ-ప్యాడ్ లలో నిక్షిప్తం చేసిన మంత్రివర్గ సమావేశ అజెండా సైతం తెలియని స్థితి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సాటి మంత్రుల ద్వారా దాని గురించి తెలుసుకోవలసి వచ్చింది. ఈ  మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అసలు విషయాల కంటే ముందు మంత్రులకు  ఐ-ప్యాడ్ లతో నెగ్గుకు రావడమే పెద్ద సమస్యగా మారేట్లుంది.

 

ఐ-ప్యాడ్ వినియోగించడంలో మెలుకువలు తెలుసుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చని, అంతవరకు తమ సహాయకులకు పాస్ వర్డులు ఇవ్వకతప్పదని సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి కే.ఇ. కృష్ణ మూర్తి, సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ళ కోషోర్ చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. సమావేశ అజెండా గురించి గోప్యత పాటించే ప్రయత్నంలో అంతా ఐ-ప్యాడ్ లలో నిక్షిప్తం చేసినందున, అది మంత్రుల సహాయకుల చేతిలో పడి ముందుగానే మీడియాకు కూడా పొక్కే అవకాశం ఏర్పడింది. గోప్యత పాటించినా సమావేశం తరువాత అందులో చర్చించిన విషయాలు, తీసుకొన్న నిర్ణయాల గురించి తప్పనిసరిగా మీడియాకు వివరించడం అవసరం కనుక ఇదంతా వృధా ప్రయాసగా మిగిలిపోనుంది. అంతే కాదు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప పేరు రావడం సంగతెలా ఉన్నప్పటికీ ఈ వ్యవహారం అంతా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు మరో మంచి అవకాశం కల్పించినట్లవుతోంది. దీనిద్వారా మంత్రివర్గం సాధించేదేముందో తెలియదు కానీ, మంత్రులకు ఇబ్బందులు, ప్రభుత్వానికి విమర్శలు మాత్రం తప్పకపోవచ్చును.

google-ad-img
    Related Sigment News
    • Loading...