ప్రతిపక్షానాం రోదనం బలం
posted on: Jul 22, 2015 12:37PM

బాలానాం రోదనం బలం అనేది నానుడి. చిన్న పిల్లలు ఎంత ఎక్కువగా ఏడిస్తే వాళ్ళకు అంత బలం అనే విషయాన్ని చెబుతూ ఆ నానుడి ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలను చూస్తుంటే, ‘‘ప్రతిపక్షానాం రోదనం బలం’’ అనే కొత్త నానుడి కాయినింగ్ చేయాలని అనిపించడం సహజం. అయితే ఇక్కడ చిన్న ఛేంజ్ ఏమిటంటే, ప్రతిపక్షాలు ఏడ్వటం వల్ల ఆ ప్రతిపక్షాలకు బలం రాదు... అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీకే బలం పెరుగుతోంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ఇంకా బాగా ఏడవాలి.. ఆ ఏడుపు పుణ్యమా అని తెలుగుదేశం ప్రభుత్వం విజయపథంలో మరింత ముందుకు దూసుకుపోవాలి.
నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుకు అధికారం ఇవ్వడం తాము చేసిన గొప్పపనిగా ప్రజలు భావిస్తున్నారు. అలాగే వైసీపీకి అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామే అనే భావన కూడా ప్రజల్లో బాగా పెరిగింది. టీఆర్ఎస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ విషయంలో ఏపీ ప్రజల్లో వ్యతిరేకత భారీగా పెరిగిపోయింది. వైసీపీ ఏడవ తలచుకుంటే ఏపీలో తమ పార్టీ విలువ పోయినందుకు ఏడ్వాలి. అలా కాకుండా... ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆ పార్టీ భోరున ఏడుస్తోంది. ఆ ఏడుపుకు పక్క వాయిద్యాల మాదిరిగా కాంగ్రెస్ పార్టీ, ఇతర ఎర్ర పార్టీలు కూడా గొల్లుమని ఏడుస్తున్నాయి. నీ ఏడుపే నా అభివృద్ధి అన్నట్టుగా, ఈ పార్టీలు ఎంత ఏడ్చేకొద్దీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత నమ్మకం పెరుగుతోంది. తమకోసం పాటుపడుతున్న నాయకుడిని ప్రతిపక్ష నాయకులు ఎలా విమర్శిస్తున్నదీ చూస్తున్న ఏపీ ప్రజలు ఆ పార్టీల మీద తీవ్ర వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. అంచేత తమ ఏడుపు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వ బలం పెంచుతున్న వైసీపీ తదితర ప్రతిపక్షాలకు ధన్యవాదాలు.







.webp)


