ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

posted on: Dec 11, 2014 7:52AM

 

ఈనెల 18 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవబోతున్నందున దానికి రెండు రోజుల ముందుగా అంటే ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నిన్న ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే పంట రుణాల మాఫీ కార్యక్రమం మొదలుపెట్టింది కనుక ఆ అంశంపై ఇంతకాలం నానా రభస చేస్తూ దానిని అసెంబ్లీలో కూడా లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకొన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపాకు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే రాజధాని భూముల విషయం, సింగపూర్ సంస్థలతో ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయవచ్చును. రాజధాని భూముల సేకరణలో నేటికీ కొన్ని ఇబ్బందులున్నందున, దానినే అవకాశంగా మలుచుకొని వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేయవచ్చును.

 

సింగపూర్ సంస్థలతో చేసుకొన్న ఒప్పందం గురించి ఇప్పటికే ఆ పార్టీ రభస చేయడం గమనిస్తే, దానిపై వివాదం సృష్టించి ప్రజలలో లేనిపోని అనుమానాలు సృష్టించి అప్పుడు అసెంబ్లీలో కూడా ఆ అంశంపై రభస చేయాలని వైకాపా ఆలోచన కావచ్చును. అయితే పంట రుణాల మాఫీపై ఆ పార్టీ రభస చేస్తున్నప్పుడు కూడా దానిని చూసి చూడనట్లు ఊరుకొని చివరి నిమిషంలో రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రకటించి ఆపార్టీ గాలి తీసేసినట్లే, బహుశః ఈ విషయంలో కూడా చంద్రబాబు తన వ్యూహం సిద్దం చేసుకొని ఉండవచ్చును. అందుకే ప్రభుత్వం అంత నిబ్బరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఏమయినప్పటికీ ప్రభుత్వం విద్యుత్, పంట రుణాల మాఫీ, పెన్షన్లు, రాజధాని నిర్మాణం వంటి అన్ని అంశాలలో చురుకుగా ముందుకు అడుగులు వేస్తోంది కనుక ఈసారి కూడా అసెంబ్లీలో ప్రతిపక్షంపై దానిదే పైచెయ్యి కావచ్చును.

google-ad-img
    Related Sigment News
    • Loading...