అమరావతికి మరో భారీ ప్రాజెక్ట్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

posted on: Jun 10, 2026 4:06PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వైభవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం  కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం (జూన్ 10) జరిగిన  ఉన్నత స్థాయి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ  సమావేశం అమరావతిలో  భారీ  ప్రాజెక్టుకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ  రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యంత ఆధునిక నివాస సముదాయాల నిర్మాణానికి ఏకంగా 1,234.91 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం   వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే  భరించనుంది.

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత..  నవ్యాంధ్ర రాజధాని   అమరావతి పరిధిలో కేంద్ర ప్రభుత్వం నేరుగా చేపడుతున్న మొట్టమొదటి అతిపెద్ద జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జీపీఆర్ఏ) ప్రాజెక్ట్ ఇదే కావడం గమనార్హం. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ప్రసిద్ధ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడ‌బ్ల్యూడీ) ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చేపడుతుంది. ఈ  భారీ  ప్రాజెక్టుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఇప్పటికే   ప్రారంభమైంది. ప్రీ-బిడ్ కార్యకలాపాలు పూర్తి కావచ్చాయనీ, టెండర్ పత్రాల రూపకల్పన ప్రక్రియ  పురోగతిలో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ అత్యాధునిక నివాస సముదాయాన్ని అమరావతిలో  17 ఎకరాల  విస్తీర్ణంలో  నిర్మించనున్నారు. ఈ మెగా జీపీఆర్ఏ క్యాంపస్‌లో ఆకాశాన్నంటేలా మొత్తం 11 భారీ నివాస టవర్లను నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే వివిధ శ్రేణుల ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా టైప్-II నుంచి మొదలుకొని అత్యున్నత స్థాయి అయిన  టైప్-VI కేటగిరీల వరకు మొత్తం 1,504 ఫ్లాట్లను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు. కేవలం నివాసాలే కాకుండా, ఇక్కడకు వచ్చే వాహనాల రద్దీని నియంత్రించేందుకు 1,972 కార్లను ఒకేసారి పార్క్ చేసుకునేలా అత్యాధునిక బేస్‌మెంట్ పార్కింగ్ సదుపాయాన్ని కూడా డిజైన్ చేశారు.  పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాజెక్టును పూర్తిగా పర్యావరణ హితంగా, గ్రీన్ బిల్డింగ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...