విశాఖకు మరో మణిహారం.. 102 కిలోమీటర్ల సెమీరింగ్ రోడ్డు

posted on: May 9, 2026 4:46PM

విశాఖపట్నం నగరాన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో వీఎంఆర్‌డీఏ కీలక ముందడుగు వేసింది. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు..  దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణాన్ని అందించేందుకు 102 కిలోమీటర్ల పొడవైన  సెమీ రింగ్ రోడ్డు  నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదిత రహదారి రాంబిల్లి నుంచి ప్రారంభమై భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సాగుతుంది.

ఈ భారీ ప్రాజెక్టును వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో భాగంగా చేర్చారు. ఈ సెమీ రింగ్ రోడ్డు అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. దీనివల్ల నగర ప్రధాన ప్రాంతాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే వాహనాలు ఒక వైపు నుంచి మరో వైపుకు సులభంగా చేరుకుంటాయి. ముఖ్యంగా భారీ రవాణా వాహనాలు నగరం వెలుపలి నుంచే వెళ్లేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారిపై ఒత్తిడిని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. రాంబిల్లి వద్ద ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు , పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెళ్లే సరుకు రవాణాకు ఈ రహదారి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. భోగాపురం వద్ద నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు ఈ సెమీ రింగ్ రోడ్డు అనుసంధానం కావడం వల్ల ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయం లభిస్తుంది.

గతంలో ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా..  మరింత శాస్త్రీయంగా ఈ 102 కిలోమీటర్ల రహదారిని రూపొందించారు. దీని కోసం భూసేకరణ ప్రక్రియ,  నిధుల సమీకరణపై అధికారులు ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.

ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊపు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే జంక్షన్ల వద్ద వాణిజ్య సముదాయాలు..  లాజిస్టిక్ హబ్‌లు ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసే ఈ ప్రాజెక్టుపై స్థానిక ప్రజలు,  పారిశ్రామిక వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. రాబోయే ఐదేళ్లలో విశాఖ నగరం మరింత విస్తరించడానికి ఈ సెమీ రింగ్ రోడ్డు ఒక చోదక శక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...