Latest News
తిరుమలలోనే కాదు.. టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఇక అన్నప్రసాద వితరణ
posted on: Jan 20, 2026 9:40AM
.webp)
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం తిరుమల కొండపై , అలాగే కొన్ని ప్రధాన దేవాలయాలలో మాత్రమే సాగుతున్న అన్నప్రసాద వితరణను, ఇక నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని అన్ని ఆలయాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో సోమవారం (జనవరి 19) జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నూతన ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గౌహతి, పాట్నా, కోయం బత్తూరు, బెల్గాం వంటి నగరాల్లో ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే భూములను కేటాయించాయి. ఈ స్థలాలను త్వరితగతిన స్వాధీనం చేసుకుని, తదుపరి పాలక మండలి సమావేశంలో ఆమోదం పొంది పనులను వేగవంతం చేయనుంది. అదలా ఉంటే.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి టీటీడీ పరిధిలోని 56 ఆలయాలతో పాటు అన్ని అనుబంధ సంస్థల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.


.webp)
.webp)


