అన్న క్యాంటీన్లకు స్పందన అద్భుతం.. సామాజిక విప్లవంగా మారిన వైనం

posted on: Apr 14, 2026 2:27PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించిన  అన్న క్యాంటీన్లకు అద్భుతమైన ప్రజా స్పందన లభిస్తున్నది.   రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ క్యాంటీన్లలో భోజనం చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.  పేద, మధ్యతరగతి ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన అన్న క్యాంటిన్ పథకం..  ఇప్పుడు  లక్షలాది మంది ఆకలి తీరుస్తూ ఒక సామాజిక విప్లవంగా మారింది. తాజా లెక్కల ప్రకారం, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు  .8 కోట్ల మంది ప్రజలు ఈసేవలను వినియోగించుకున్నారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా   ప్రాంతాల్లో 207 అన్న క్యాంటీన్లు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. నిత్యం దాదాపు  2.10 లక్షల మందికి పైగా ప్రజలు ఈ క్యాంటీన్ల ద్వారా ఉపాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాన్ని స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా కూలీలు, చిరుద్యోగులు వివిధ పనుల నిమిత్తం నగరం, పట్టణాలకు వచ్చే  సామాన్యులకు ఇది ఒక వరప్రదాయినిగా మారింది. శుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందిస్తుండటంతో, భోజన సమయాల్లో ఈ కేంద్రాల వద్ద భారీగా క్యూలు కనిపిస్తున్నాయి.

ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చిస్తోంది. ప్రతిరోజూ అన్న క్యాంటీన్ల నిర్వహణ   54 లక్షల రూపాయల వ్యయం అవుతోంది. ఇందులో సింహభాగం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుండగా, మరికొంత మొత్తాన్ని దాతల నుంచి సేకరిస్తున్నారు. ఈ పథకం పునఃప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటిన్లపై  243 కోట్ల రూపాయలను వ్యయం చేసింది.   లాభాపేక్ష లేకుండా సామాన్యుడి కడుపు నింపడమే ధ్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమం నిర్విఘ్ణంగా, అశేష ప్రజలకు అన్నదాతగా కొనసాగుతోంది.  

జగన్ హయాంలో ఈ క్యాంటీన్లు మూతపడటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం వీటిని తిరిగి ప్రారంభించడమే కాకుండా..  మరింత మెరుగైన సౌకర్యాలతో  నిర్వహిస్తున్నది. ఇస్కాన్ వంటి సంస్థల సహకారంతో ఆహారం తయారీలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నది.  ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనను గమనించిన ప్రభుత్వం, రానున్న రోజుల్లో ఈ సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. 

అన్న క్యాంటీన్ల విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం త్వరలోనే గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామాల్లోని నిరుపేదలకు కూడా 5 రూపాయలకే భోజనం అందించాలనేది ప్రభుత్వ సంకల్పం. గ్రామీణ ప్రాంతాల్లో క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం అదనంగా 58 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విజయవంతమైన ఈ మోడల్‌ను పల్లెల్లో కూడా అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఆకలి చావులు లేని సమాజాన్ని నిర్మించవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. 

ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకుని మరిన్ని  క్యాంటీన్ల ఏర్పాటుకు   కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి రద్దీ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించింది. అన్న క్యాంటీన్లు కేవలం ఆహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ప్రభుత్వ సామాజిక బాధ్యతకు చిహ్నంగా నిలుస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...