చెవిరెడ్డికి షాక్.. ఆస్తుల అటాచ్ కు సిట్ కు అనుమతి
posted on Nov 19, 2025 1:30PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ ప్రక్రియ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డి పలు చోట్ల ఆస్తులను కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా మామెరపల్లె, మాచ్ పల్లి గ్రామాల పరిధిలో 27.06 ఎకరాలు, అలాగే తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరిట 3.14 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సిట్ ఆధారాలతో సహా కనుగోంది. ఆ ఆస్తుల అటాచ్ మెంట్ కోరుతూ సిట్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం అనుమతించిన మీదట.. ఆస్తుల అటాచ్ మెంట్ కోసం విజయవాడ ఎసీబీ కోర్టును సిట్ ఆశ్రయించింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో వాటిని అటాచ్ చేసింది.
ఇక ఇప్పడు తాజాగా ఈ కేసులో కీలక నిందితుడైన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మద్యం కుంభకోణంతో చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా విలువైన అస్తులు కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్ లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారణకు వచ్చిన సిట్.. ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కెవీఎస్ ఇన్ ఫ్రా ఎండీ గా ఉన్న భాస్కరరెడ్డి భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి, సీఎంఆర్ ఇన్ ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్ మెంట్ కు సిట్ అనుమతి కోరింది.
మద్యం కుంభకోణం అక్రమాలతో చెవిరెడ్డి కుటుంబం 63. 72 కోట్ల పైగా ఆస్తులు కూడబెట్టిందనీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువను తగ్గించి, లెక్కల్లో చూపకుండా 54.87 కోట్ల పైగా మొత్తాన్ని బ్లాక్ మనీగా మలిచారనీ సిట్ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరుజిల్లా గూడూరు, పొదలకూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్ట్రరైన ఆస్తుల ఆటాచ్ మెంట్ సిట్ ప్రభుత్వ అనుమతి కోరింది. అలాగే చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిందితుడు చెవిరెడ్డి కుటుంబం భారీగా మోసపూరిత భూ లావాదేవీలకు పాల్పడిందని సిట్ పేర్కొంది.
వెండోడులోని అరబిందో ఫార్మాకు కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా 263.28 ఎకరాల భూమి కొనుగోలు, అమ్మకం, లో మోసం జరిగినట్లు నిర్దరించింది. తక్కువ సమయంలోనే భూమి విలువలను అసాధారణంగా పెంచి నల్లధనాన్ని తెల్లగా మార్చారని సిట్ తన నివేదిక పేర్కొంది. మద్యం కుంభకోణం నుండి కమిషన్లు, కిక్ బ్యాక్ లతో చెవిరెడ్డి కుటుంబం భారీగా స్థిర, చర ఆస్తులు కూడబెట్టిందనీ, అవినీతి నిరోధక చట్టం, , క్రిమినల్ లా లోని పలు సెక్షన్ల ప్రకారం ఈ ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతించాలని సిట్ ప్రబుత్వాన్ని కోరింది. ఇందుకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల అటాచ్ మెంట్ కు వియవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు సిట్ కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.