ఇప్పటికి ఇంతే..!

posted on: Aug 18, 2016 4:03PM

ఫై స్టార్ చాక్లెట్ కావాలని మారాం చేసిన పిల్లాడికి బెల్లం ముక్క చేతిలో పెట్టి సముదాయించిన తల్లిలా వుంది కేంద్ర ప్రభుత్వం వైఖరి! ప్రత్యేక హోదా అంటూ మొన్న పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర నిరసనలు తెలిపారు మన నేతలు. అందువల్లో లేక జనంలో క్రమంగా బీజేపిపై వ్యతిరేకత వస్తోందన్న ఆలోచనతోనో మోదీ ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ కి! దాదాపు రెండు వేల కోట్ల భారీ ప్యాకేజీనే ప్రకటించినప్పటికీ ప్రత్యేక హోదాతో పోలిస్తే ఇది నథింగ్ అంటూ పెదవి విరుస్తున్నారు క్రిటిక్స్....

 


    కేంద్రం మొత్తం 1,976 కోట్ల ఆర్దిక సాయం ప్రకటిస్తే అందులో 1176 కోట్లు ఆర్దిక లోటు భర్తీకి కేటాయించారు. అలాగే, మరో 350 కోట్లు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి , 450 కోట్లు రాజధాని నిర్మాణానికి సర్దారు. ఒక రకంగా చూస్తే ఇది విభజనకి గురైన నవ్యాంధ్రకి పెద్దగా నష్టాన్ని తీర్చేదేం కాదు. కాని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకు మించి ఢిల్లీ నుంచి రాబట్టుకోగలిగింది కూడా లేదనే చెప్పాలి. 

 


    ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోతోందని నిత్యం కార్నర్ చేస్తోన్న ప్రతిపక్షాల వద్ద మాత్రం ఏపీ గవర్నమెంట్ కి కొంచెం ఊరట లభిస్తుంది ఈ ప్యాకేజీతో. అసలు దేశాన్ని ఏలుతోన్న బీజేపితో పొత్తే లేకుంటే ఎన్నో ఆర్దిక కష్టాల్లో వున్న రాష్ట్రానికి ఇలాంటి ప్యాకేజీ కూడా వచ్చేది కాదని వాదించవచ్చు. అది నిజం కూడా. 

 


    ఇక ప్రత్యేక హోదా డిమాండ్లు, నిరసనలు ఇప్పుడప్పుడే ఆగకపోయినా ప్యాకేజీ ద్వారా కేంద్రం తన మనసు విప్పి చెప్పిందనే భావించాలి. ఈ రెండు వేల కోట్ల సాయంతో స్పెషల్ స్టేటస్... సమీప భవిష్యత్ లో సాధ్యం కాదన్నది ఢిల్లీ ఇస్తోన్న సిగ్నల్. అంతే కాదు, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి బీజేపి అనేక ఇతర రాష్ట్ట్రాల్లో కొత్త కుంపట్లు రాజేసుకునే ఛాన్స్ కూడా లేదు! సో... ఇప్పటికి ఇంతే చిత్తగించగలరు... అన్నది బాటమ్ లైన్!

google-ad-img
    Related Sigment News
    • Loading...