Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు చెప్పిన ‘స్పీడ్ బ్రేకర్లు’ ఎవరు?
posted on: Jul 15, 2024 12:49PM
‘‘మంచి చేయాలని అనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు వుండవు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి పరిసరాల్లోని కొలనుకొండలో వున్న హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు పైన పేర్కొన్న వ్యాఖ్య చేశారు. అక్కడ జరిగింది ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి, అక్కడ వున్న చాలామంది ఈ వ్యాఖ్యను ఒక ఆధ్యాత్మిక కోణంలో చూసి వుండొచ్చు. మంచి చేయాలని అనుకున్నవాళ్ళని దేవుడు చల్లగా చూస్తాడు కాబట్టి, వాళ్ళు అభివృద్ధి పథంలో స్పీడు బ్రేకర్లు లేకుండా దూసుకుని వెళ్తారు అనేది చంద్రబాబు ఉద్దేశం అనుకుని, మనసులో దేవుడికి భక్తిగా నమస్కారం పెట్టుకుంటారు. అలాంటి వారిని ఆ భక్తి పారవశ్యంలోనే వుంచేసి, మనం కొంచెం పక్కకి తప్పుకుని రాజకీయ మార్గంలోకి వద్దాం.
రాజకీయ మార్గంలోకి వస్తే, చంద్రబాబు ఎవరిని ఉద్దేశించి ‘స్పీడ్ బ్రేకర్లు’ అని వుండొచ్చని ఆలోచిస్తే, చాలామంది బుర్రలో టక్కున కనిపించే ఒక దివ్య అమంగళ విగ్రహం జగన్ది. ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని తన నీచ నికృష్ట పాలనతో సర్వనాశనం చేసిన జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. పైగా కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఢిల్లీకి పారిపోవాలని అనుకుంటున్నాడు. అందువల్ల చంద్రబాబు చేయాలనుకున్న మంచి పనులకు స్పీడ్ బ్రేకర్లా అడ్డు పడకుండా వుంటాడన్న ఆలోచన కొంత రాజకీయ స్పృహ వున్నవాళ్ళకి అనిపిస్తుంది. నిజానికి జగన్కి ఇప్పుడు చంద్రబాబుకు స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడే సీన్ లేదు. ‘జగన్’ అనేది ఒక ముగిసిపోయిన చీకటి అధ్యాయం. సరే, జగన్ ఒక స్పీడ్ బ్రేకర్ అనుకుందాం. మరి చంద్రబాబు ‘స్పీడ్ బ్రేకర్లు’ అన్నారు. అంటే, జగన్ కాకుండా మరో స్పీడ్ బ్రేకర్ వున్నట్టే కదా.. ఇంతకీ ఎవరా స్పీడ్ బ్రేకర్.
ఆ స్పీడ్ బ్రేకర్ మరెవరో కాదు.. ప్రధాని నరేంద్ర మోడీ. 2014లో టీడీపీ, బీజేపీ మధ్య స్నేహం వున్నా నిధుల విషయంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది సున్నా. అమరావతి విషయంలో, పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబును పెట్టిన ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. అప్పట్లో మోడీకి పూర్తి మెజారిటీ వుండేది కాబట్టి ఆయన ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్ద స్పీడ్ బ్రేకర్గా మోడీ మారారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో చంద్రబాబు వున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులను, ఏపీ న్యాయమైన డిమాండ్లను ప్రధాని ఒప్పుకోక తప్పని పరిస్థితులు వున్నాయి. ఈ రకంగా చూస్తే ఈసారి ఏపీ అభివృద్ధికి ‘మోడీ స్పీడ్ బ్రేకర్’ కూడా లేనట్టే.






