Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్రాభివృద్ధే లక్ష్యం.. తెలుగువారిని అందలం ఎక్కిస్తాం : సీఎం చంద్రబాబు
posted on: Jul 1, 2026 6:20PM
.webp)
రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజాభీష్టం మేరకే పాలన సాగిస్తూ, ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని పున్నపువారిపాలెంలో నిర్వహించిన "పేదల సేవలో" కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, ప్రజా వేదికపై ప్రసంగిస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ప్రజలు ఇచ్చిన ఆదరణ, విశ్వాసం తమకు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్న సీఎం, గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా జిల్లాల పునర్విభజనలో ఏర్పడిన సమస్యలను సరిచేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో విలీనం చేయడంతో పాటు సైదాపురం, కలవాయి మండలాలను కూడా ప్రజల ఆకాంక్షల మేరకు నెల్లూరులో కలిపామని చెప్పారు. ప్రజల అభీష్టం ప్రకారమే పరిపాలన ఉండాలని, పెత్తందారీ విధానాలకు తమ ప్రభుత్వంలో స్థానం లేదని స్పష్టం చేశారు.
ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సీఎం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా 28 వర్గాల లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రూ.68,598 కోట్లను పెన్షన్ల రూపంలో పంపిణీ చేశామని, ప్రతి నెలా 62.20 లక్షల మందికి రూ.2,712 కోట్ల మేర చెల్లింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు పీ–4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
గత రెండేళ్లలో రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేశామని సీఎం పేర్కొన్నారు. గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని పూర్తిగా సరిదిద్దడానికి సమయం అవసరమని, అయితే సుపరిపాలన దిశగా ఇప్పటికే శుభారంభం జరిగిందని అన్నారు. "మనమిత్ర" వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను ప్రజల చేతిలోకి తీసుకువచ్చామని, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
తల్లికి వందనం, స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో వంటి పథకాలు పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. సంపన్న వర్గాలు వెనుకబడిన కుటుంబాలను ఆదుకునేలా పీ–4 కార్యక్రమాన్ని రూపొందించామని, ఆర్థిక అసమానతలను తగ్గించడమే తమ లక్ష్యమని తెలిపారు. లక్షలాది మంది మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారికి తోడ్పాటు అందిస్తున్నారని వివరించారు.
మహిళల సాధికారత ప్రభుత్వ ప్రాధాన్యమని, "వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్" కార్యక్రమం ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చెప్పారు. పొదుపు ఉద్యమంలో డ్వాక్రా మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వారి విశ్వసనీయత వల్లే బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు అందించేందుకు ముందుకు వస్తున్నాయని అభినందించారు.
నెల్లూరు జిల్లా అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న సీఎం, రామాయపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, దుగరాజపట్నం షిప్బిల్డింగ్ సెంటర్, బీపీసీఎల్ రిఫైనరీ, ఐఎఫ్ఎఫ్సీఓ కిసాన్ సెజ్ వంటి ప్రాజెక్టులు జిల్లాను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతాయని అన్నారు. గూడూరు ప్రాంతంలో ఇప్పటికే 27 మెగా పరిశ్రమలు ఏర్పడ్డాయని, త్వరలో మెగా ఫర్నిచర్ పార్క్ కూడా వస్తోందని తెలిపారు. పోర్టులు, రైల్వే కనెక్టివిటీ, జాతీయ రహదారి కారిడార్లతో ఈ ప్రాంతాన్ని ప్రధాన లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం పేర్కొన్నారు. 36 ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, ఇప్పటికే రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పునరావాసం కోసం రూ.900 కోట్లు విడుదల చేశామని, ఇప్పటికే రూ.300 కోట్లు చెల్లింపులు జరిగాయని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతోందని, ఎల్నినో కారణంగా వర్షపాతం తగ్గిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రాజెక్టుల్లో 65 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. భూగర్భ జలాల పెంపు కోసం జలధార వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, భవిష్యత్తులో నదుల అనుసంధానంపై కూడా దృష్టి సారిస్తామని వెల్లడించారు.
పరిశ్రమలు, ఉపాధి అవకాశాల పెంపే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. హీరో మోటార్స్ వంటి సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో తమ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్కు త్వరలో శంకుస్థాపన జరగనుందని, 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు.
అమరావతి అంశంపై మాట్లాడిన సీఎం, రాష్ట్రానికి స్థిరమైన రాజధాని అవసరమని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రం రాజధాని విషయంలో గందరగోళానికి గురైందని విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో వాటిని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రాజకీయాల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని, నేరస్థులను ప్రోత్సహించే రాజకీయ సంస్కృతి ప్రజాస్వామ్యానికి హానికరమని సీఎం అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. మహిళా నాయకులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు అభివృద్ధిని ప్రోత్సహించాలని, శాంతి భద్రతలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగేలా సహకరించాలని కోరారు. తెలుగు ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర పురోగతే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పునరుద్ఘాటించారు.
కార్యక్రమం అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. స్వయం సహాయ సంఘాల మహిళలు రూపొందించిన ఉత్పత్తులను పరిశీలించి అభినందించారు. అరటి నారతో తయారు చేసిన వస్తువులు, ఆధునిక కుట్టు యంత్రాలు, ప్రకృతి సేద్యం ఉత్పత్తులు, మత్స్యకారుల కోసం రూపొందించిన సాంకేతిక పరికరాలను సీఎం తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


.webp)



