కయ్యానికి కాలుదువ్వుతున్న జగన్ సేన!

posted on: Jun 23, 2014 11:53AM

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాలక పక్షానికి అడుగడుగునా అడ్డు తగులుతూ, అయినదానికి కానిదానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడుతూ, ఇరుకున పెడుతూ వుండటమే జగన్ పార్టీ నాయకుల ప్రధాన కర్తవ్యంలా కనిపిస్తోంది. అంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జగన్ పార్టీ నాయకులు, జగన్ అనుసరిస్తున్న తీరును చూస్తుంటే రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక వరకు రాముడు మంచి బాలుడులా వ్యవహరించిన వైసీపీ సభ్యులు ఆ తర్వాతి నుంచి తమ విశ్వరూపం చూపించడం మొదలుపెట్టారు. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం ముగిసిన వెంటనే వైసీపీ నాయకులు ప్రభుత్వం మీద మాటల తూటాలు విసరడం ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం సంతాప సందేశం చదివినట్టు వుందని ఘాటైన పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న కమిటీలో చేరకుండానే దానిని ఒక ఇష్యూ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరిగే సందర్భంలో కూడా వైసీపీ నాయకుడు జగన్ ‌స్వయంగా అధికార పార్టీ మీద విరుచుకుపడ్డారు. మొత్తమ్మీద వైసీపీ వ్యవహార శైలి చూస్తుంటే ఏదోరకంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ వుండటం, నిరంతరం కయ్యానికి కాలుదువ్వుతూ వుండటమే ధ్యేయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...