ఏపీ గ్యాస్ ఏపీకే కానీ వయా గుజరాత్
posted on: Mar 12, 2015 2:54PM
.jpg)
గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల కృష్ణా, గోదావరి బేసిన్ నుండి వెలికి తీస్తున్న అపారమయిన గ్యాస్ నిక్షేపాలు ఎక్కడో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి పైపుల ద్వారా తరలిపోతున్నాయి. అందువల్ల పెరట్లో ఉత్పత్తి అవుతున్న ఈ గ్యాస్ ని ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పోరేషన్ కి భారీగా డబ్బు చెల్లించి మరీ కొనుగోలు చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. వేసవిలో పెరగనున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక విద్యుత్ సంస్థల నుండి విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొంది. కానీ ముందు జాగ్రత్తతో గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పోరేషన్ తో కూడా ఒక ఒప్పందం చేసుకొంది.
దాని ప్రకారం ఆ సంస్థ రోజుకి 1.6 మిలియన్ స్క్వేర్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ రాష్ట్రానికి సరఫరా చేస్తుంది. ఈ గ్యాసుతో రాష్ట్రంలో ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థల ద్వారా 300 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసుకొనే అవకాశం ఉంటుంది. దానితో ఈవేసవిలో విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా సరఫరా జరుగుతుంది. ఇక మరో విశేషం ఏమిటంటే గెయిల్ సంస్థ ఇదే గ్యాసుకి 14.5 డాలర్లు వసూలు చేస్తుంటే, గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పోరేషన్ మాత్రం 13.8 డాలర్ల ధరకే సరఫరా చేసేందుకు అంగీకరించింది. తెలంగాణా ప్రభుత్వం కూడా ఈ సంస్థ నుండి గ్యాస్ కొనుగోలు చేసి లగడపాటి రాజగోపాల్ కి చెందిన ల్యాంకో గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థకు దానిని అందించి దాని నుండి విద్యుత్ తీసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
కేంద్ర పెట్రోలియం మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేయగానే రాష్ట్రానికి గ్యాస్ సరఫరా మొదలవుతుంది.



.jpg)
.jpg)


.webp)


