ఏపీలో కూడా గిరిజన బెటాలియన్ ఏర్పాటు?
posted on: Jan 7, 2015 6:10AM
.jpg)
మావోయిష్టుల ప్రభావం అధికంగా ఉన్న చత్తిస్ ఘడ్ రాష్ట్రంలో వారిని ఎదుర్కోవడానికి అక్కడి ప్రభుత్వం అడవులలో నివసించే గిరిజన యువకులతో ‘సాల్వాజుడుం’ అనే గిరిజన పోలీస్ బెటాలియన్ తయారుచేసుకొని వారితోనే మావోయిస్టులను మట్టుబెట్టాలని చూసింది. కానీ వారు మావోయిస్టులను మట్టుబెట్టలేకపోయినా మావోయిస్టులు మాత్రం వారిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు వారి కుటుంబ సభ్యులను, ఇన్ఫార్మర్ల నెపంతో అమాయకులయిన గిరిజనులను కిరాతకంగా హత్యలు చేయడంతో ఆ ‘సల్వాజుడుం’ ఐడియా బెడిసికొట్టింది. అంతే కాదు ఆ సల్వాజుడుం సృష్టికర్త ‘మహేంద్ర కర్మ’పై పగపట్టిన మావోయిస్టులు ఆయనను హతమార్చే ప్రయత్నంలో చేసిన దాడిలో ఒక మాజీ కేంద్రమంత్రితో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు, పోలీసులు దాదాపు డబ్బై మంది ఒకేసారి చనిపోయారు.
ఇదంతా తెలిసి కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆ విఫల ప్రయోగాన్ని రాష్ట్రంలో కూడా అమలుచేయాలని సిద్దమవుతోంది. అయితే దానికి వేరే బలమయిన కారణాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా అనేక వందల గిరిజన గ్రామాలు ఆ ప్రాజక్టు క్రింద మునిగిపోతాయి. ఆ కారణంగా నిర్వాసితులయిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వంపై ఆగ్రహం కలగడం సహజం. ఇదే అదునుగా వారిలో యువకులను మావోయిస్టులు ఆకర్షించే ప్రమాదం ఉంది. కనుక వారినందరినీ ప్రభుత్వమే చేరదీసి వారితో ఒక గిరిజన పోలీస్ బెటాలియన్ (సాల్వాజుడుం) ఏర్పాటు చేయడం ద్వారా వారి కుటుంబాలను ఆదుకోవచ్చును. ఈ గిరిజన పోలీస్ బెటాలియన్ ఏర్పాటు ద్వారా శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలలోని గిరిజన ప్రాంతాలలో తమ ఉనికిని చాటు కొనేందుకు విద్వంసానికి పాల్పడుతున్న మావోయిస్టులను నియంత్రించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ గిరిజన బెటాలియన్ కోసం ప్రత్యేకంగా రంపచోడవరం లేదా పాడేరు ప్రాంతాలలో ఎక్కడో ఒకచోట ప్రధాన కార్యాలయం, శిక్షణా సంస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గిరిజనులకు ఈ విధంగా ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ ఆలోచన బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో కూడా మళ్ళీ ఛత్తీస్ ఘడ్ చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ఏవిధంగా నివారించాలో ముందుగానే ఆలోచించితే ఆ తరువాత ప్రభుత్వాన్ని ఎవరూ తప్పు పట్టే అవకాశం ఉండదు.



.jpg)
.jpg)

.webp)



