అంతా చొరబాట్ల వల్లే.. అమిత్ షా

దేశంలో ముస్లిం మైనారిటీల జనాభా పెరగడానికి చొరబాట్లే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా అసాధారణంగా పెరగడానికి అక్రమ చొరబాట్లే ప్రధాన కారణమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'దైనిక్ జాగరణ్' మాజీ సంపాదకుడు నరేంద్ర మోహన్ స్మారకోపన్యాసంలో మాట్లాడిన ఆయన దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల కేవలం రాజకీయ సమస్య కాదనీ, ఇది దేశ భద్రత, ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య అనీ అన్నారు.  

కొన్ని ప్రాంతాలలో ముస్లింమైనారిటీల జనాభా పెరుగుదల చాలా చాలా అధికంగా ఉందంటూ ఆయన కొన్ని రాష్ట్రాల జనాభా లెక్కలను ఉదహరించారు. అసోంలో గత దశాబ్ద  కాలంలో  ముస్లిం మైనారిటీల జనాభా   29.6 శాతం పెరిగిందన్నారు. చొరబాట్లు లేకుండా ఈ స్థాయిలో ముస్లిం జనాబా వృద్ధి సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ లోని పలు జిల్లాలలో  ముస్లిం జనాభా వృద్ధి రేటు 40 శాతం వరకూ ఉందనీ, సరిహద్దు ప్రాంతాల్లో  అయితే ఇది ఏకంగా 70 శాతం వరకు ఉందని అమిత్ షా అన్నారు.  

కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని  ఆరోపించారు. గుజరాత్, రాజస్థాన్‌లకు కూడా సరిహద్దులు ఉన్నాయి. మరి అక్కడ నుంచి చొరబాట్లు ఎందుకు జరగడం లేదు?  అని  ప్రశ్నించారు. చొరబాట్లను అడ్డుకోవడం కేవలం కేంద్ర ప్రభుత్వం లేదా సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) బాధ్యత మాత్రమే కాదనీ రాష్ట్రాలు కూడా బాధ్యత తీసుకోవాలని అమిత్ షా అన్నారు.  భౌగోళిక పరిస్థితుల కారణంగా అన్ని సరిహద్దు ప్రాంతాల్లో కంచె వేయడం సాధ్యం కాదన్న ఆయన అలాంటి చోట్ల రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అత్యంత కీలకమన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu