తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోన్న బీజేపీ... కేసీఆర్ కంచుకోటలపై కన్నేసింది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ హవాకు చెక్ పెట్టాలని వ్యూహ రచన చేస్తోంది. టీఆర్ఎస్కు తిరుగులేని ఉమ్మడి మెదక్ జిల్లాలో కాలు పెట్టడం ద్వారా కేసీఆర్ దూకుడుకి కళ్లెం వేయాలనుకుంటోన్న కాషాయదళం... పకడ్బందీ ప్లాన్తో ముందుకెళ్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా... గెలిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలనుకుంటోంది.
గత ఎన్నికల్లో ఒక్క జహీరాబాద్ మినహా మిగిలిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లన్నీ టీఆర్ఎస్సే గెలిచింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికీ టీఆర్ఎస్ ఆధిపత్యమే కొనసాగుతోంది. అయితే ఈసారి టీఆర్ఎస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కేసీఆర్కి మంచి పట్టున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో సత్తా చాటడం ద్వారా టీఆర్ఎస్కి షాకివ్వాలనుకుంటోన్న కమలం నేతలు... అందుకు సరైన నేతల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్లకు గాలమేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో చర్చలు జరిపిన బీజేపీ నేతలు... మరికొందరి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పనులకు సంబంధించిన కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా వీళ్లందరినీ పార్టీలోకి రప్పించాలనుకుంటున్నారు. అంతేకాదు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు... సీట్ల కేటాయింపులో మీరు చెప్పినవారికి టికెట్ల ఇస్తామంటూ బంపర్ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వలలో పడే నేతలెవరో చూడాలి.
ఏదిఏమైనా కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ నుంచే టీఆర్ఎస్కు సవాల్ విసరాలని బీజేపీ డిసైడైంది. అమిత్షా కూడా అందుకు భారీ స్కెచ్ గీశారని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్కి... ఆయన మేనల్లుడు హరీష్రావుకి మంచి పట్టున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ పాగా వేయడం అంత ఈజీ కాదనేది మాత్రం వాస్తవం.