నక్సలిజంపై తెలంగాణ విజయం… పోలీసులకు అమిత్‌షా సత్కారం

posted on: May 18, 2026 8:21PM

 

నక్సలిజంపై దశాబ్దాల పోరాటానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ పోలీసులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘనంగా అభినందనలు తెలియజేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమం దేశ భద్రతా చరిత్రలో ఒక గర్వకారణ ఘట్టంగా నిలిచింది. తెలంగాణను నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చిన పోలీసు బలగాల సేవలను గుర్తిస్తూ అమిత్ షా స్వయంగా సత్కారం అందించడం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్, రాష్ట్ర భద్రతా సలహాదారు బి. శివధర్ రెడ్డి, OCTOPUS & Greyhounds డీజీపీ అనిల్ కుమార్, మల్కాజిగిరి కమిషనర్ సుమతి మరియు ఎస్ఐబీ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. పోలీసుల కృషి దేశానికి ఆదర్శమని కొనియాడారు.“దేశాన్ని నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి చేయడం మా లక్ష్యం” అని అమిత్ షా స్పష్టం చేశారు. 2024 జనవరిలో జరిగిన అంతర్గత సమీక్ష సమావేశంలో 2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా ఎడమపక్ష అతి తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం చత్తీస్గడ్ లోని బస్తర్ ప్రాంతం నక్సల్స్ రహితంగా ప్రకటించబడటం దేశ చరిత్రలో కీలక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. 

ఒకప్పుడు భయం, హింసకు ప్రతీకగా నిలిచిన ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండటం దేశానికి ఆశాజనక సంకేతమన్నారు. మూడు తరాలపాటు దేశాన్ని వేధించిన నక్సలిజం సమస్యకు ముగింపు పలకడంలో భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలు అపారమని ఆయన గుర్తుచేశారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల సమిష్టి కృషి ఈ విజయానికి బలం ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశాన్ని నక్సలిజం రహితంగా మార్చే దిశగా ఇది చారిత్రాత్మక అడుగుగా భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...