వివాదాల ఖడ్సే..!

posted on: Jun 2, 2016 5:28PM

మహారాష్ట్ర మంత్రివర్గంలో అలజడి రేగింది. ప్రభుత్వంలోనే అత్యంత సీనియర్ అయిన ఏక్‌నాథ్ ఖడ్సే పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయనే వార్తలు రావడంతో ఒక్కసారిగా మహా రాజకీయాలు వేడేక్కాయి. ఆయన మాట్లాడిన కాల్‌ రికార్డుల్లో దావూద్‌తో మాట్లాడినట్లు తేలడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. అవినీతిని ఏ మాత్రం సహించబోమన్న పార్టీ విధానానికి అనుగుణంగా ఖడ్సే మీద వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ మహారాష్ట్ర శాఖను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆదేశించారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, ఖడ్సే‌ను తన కార్యాలయానికి పిలిపించుకుని చర్చించారు. దీనిపై విచారణ జరిపిన క్రైం బ్రాంచ్ కూడా ఖడ్సే‌తో దావూద్ మాట్లాడటానికి ఆధారాలేమీ లేవని అంటోంది.

 

అయితే ఖడ్సే ఫోన్ రికార్డులను హ్యాక్ చేశానని, అందులో ఖడ్సే నెంబర్‌ కూడా ఉందని మనీష్ భంగాలే అనే హ్యాకర్ చెబుతున్నాడు. ఖడ్సే వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. విదర్భ ప్రాంతంలోని లాతూర్‌లో ఒక పక్క ప్రజలు గుక్కెడు నీళ్ల కోంస ఇబ్బందులు పడుతుంటే వారిని ఓదార్చేందుకు ఖడ్సే హెలికాఫ్టర్‌లో వెళ్లారు. ఈ సందర్భంగా లాతూర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ కోసం వేల లీటర్ల నీటిని వృథా చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. రైలు లేదా రోడ్డు మార్గంలో వెళ్లకుండా డాబు, దర్జా కోసం కావాలనే హెలికాఫ్టర్లో వెళ్లారని జనం ఆరోపించారు. ఈ వివాదం ముగిసిందో లేదో గత ఏప్రిల్‌లో ఖడ్సే భార్యకు, అల్లుడికి దాదాపు రూ.23 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ మంత్రిగా కేవలం రూ.3 కోట్లకే ఇచ్చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొన్నామని..మార్కెట్ వాల్యూను బట్టి స్టాంప్‌ డ్యూటీ కట్టామని ఖడ్సే వివరణ ఇచ్చుకున్నారు. కానీ వివాదం సమసిపోలేదు. సరిగ్గా ఇదే సమయంలో ఖడ్సే మాఫియా సంబంధాలు బయటపడటంతో ఆయన మంత్రిగా తప్పుకోకతప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...