గ్రీన్ కార్డ్ నిబంధనలపై వెనక్కు తగ్గిన అమెరికా

posted on: May 26, 2026 9:17AM

అమెరికాలో స్థిరపడాలని  ఆశపడే లక్షలాది మంది ఇండియన్ ఐటీ నిపుణులకు అమెరికా ప్రభుత్వం ఊరటనిచ్చే కబురు అందించింది. ఇటీవలి కాలంలో వీసా నిబంధనలు, గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు ప్రవాస భారతీయులలో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) తీసుకువచ్చిన ఒక వివాదాస్పద ప్రతిపాదన అమెరికాలోని భారతీయ టెక్కీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే మెజారిటీ అభ్యర్థులు అమెరికాలో ఉంటూ కాకుండా, తమ సొంత దేశాలకు వెళ్లి అక్కడి నుంచే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలనే నిబంధనను విధించారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల హెచ్-1బీ   వీసాపై ఆధారపడి అమెరికాలో జీవిస్తున్న లక్షలాది మంది భారతీయులు, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అమెరికా పౌరులను వివాహం చేసుకున్న జీవితభాగస్వాములు కూడా ఈ నిబంధన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్-1బీ వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ నూతన గ్రీన్ కార్డ్ విధానం అమెరికా టెక్ పరిశ్రమను అతలాకుతలం చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న భారతీయ ప్రతిభను దూరం చేసుకుంటే ఐటీ రంగానికి భారీ నష్టం వాటిల్లుతుందని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. కేవలం భారతీయ కంపెనీలే అమెరికా ఆర్థిక వ్యవస్థలో సుమారు 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని, ఐటీ నిపుణుల సేవలు అమెరికాకు అత్యంత ఆవశ్యకమని  స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి, ఆందోళనల కారణంగా ట్రంప్ ప్రభుత్వం  మెట్టు దిగక తప్పలేదు. ఈ వివాదాస్పద ఆదేశాన్ని పాక్షికంగా ఉపసంహరించుకుంది. దీంతో అమెరికాలోనే ఉంటూ గ్రీన్ కార్డ్ ప్రక్రియను కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.

ఈ గ్రీన్ కార్డ్ నిబంధనల మార్పులపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ..  ఈ ఆధునీకరణ ప్రక్రియ కేవలం భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసింది కాదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలస విధానాన్ని క్రమబద్ధీకరించేందుకే ఈ సంస్కరణలు చేపట్టామనీ..  అయితే పరిపాలనాపరమైన మార్పుల సమయంలో కొన్ని ఇబ్బందులు  ఎదురవడం సహజమేనని ఆయన పేర్కొన్నారు. సుమారు 20 మిలియన్ల మంది అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించిన తరుణంలో..  జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి చర్యలు తప్పడం లేదని సమర్థించారు. అయినప్పటికీ, చట్టబద్ధంగా అమెరికాలో ఉంటూ సేవలు అందిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ఈ తాజా ఉపసంహరణ నిర్ణయం ఎనలేని ఉపశమనాన్ని ఇచ్చింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన 1,00,000 డాలర్ల భారీ హెచ్-1బీ వీసా రుసుము నుండి ఇప్పటికే అమెరికాలో ఉన్న వీసా హోల్డర్లకు మినహాయింపు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రీన్ కార్డ్ నిబంధనపై కూడా అమెరికా వెనక్కి తగ్గడంతోఇండియన్ టెక్కీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...