యూఎస్ స్పిరిట్ ఎయిర్‌లైన్స్ మూత

posted on: May 3, 2026 5:55AM

అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ తాజాగా తన విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేసింది. తన కార్యకలాపాలు అన్నిటికీ త్వరలో ఫుల్ స్టాప్ పెడతామని శనివారం (మే 2) వెల్లడించింది. అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది. ఎయిర్‌లైన్స్ మాతృసంస్థ స్పిరిట్ ఏవియేషన్ హోల్డింగ్స్ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది.  కస్టమర్ సర్వీస్ అందుబాటులో లేదని కూడా సంస్థ వెబ్‌సైట్‌లో నోటీసు కనిపించింది. అయితే.. ఇప్పటికే టికెట్లు కొన్న వారికి డబ్బుల రీఫండ్‌ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని కూడా సంస్థ తెలిపింది.

ఇక స్పిరిట్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల నిలిపివేతపై కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ డేవ్ డేవిస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న సంస్థ పునర్‌వ్యవస్థీకరణ ప్లాన్‌పై బాండ్ హోల్డర్స్‌తో మార్చి నెలలో అంగీకారం కుదిరిరిందన్నారు. అయితే, అకస్మాత్తుగా విమాన ఇంధన ధరలు పెరగడంతో పరిస్థితి చేయిదాటి పోయిందన్నారు. కంపెనీ కార్యకలాపాలను నిలిపివేయడం మినహా మరో దారి లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. 

ఇరాన్‌తో యుద్ధం మొదలయ్యాక అమెరికాలో విమాన ఇంధన ధరలు రెండింతలు అయ్యాయి. దీంతో, అనేక ఎయిర్‌లైన్స్ ఇప్పటికే ఈ ఏడాది లాభాల అంచనాలను తగ్గించుకున్నాయి. కార్యకలాపాల విస్తరణపై పెట్టుబడులకు కూడా బ్రేక్ చెప్పాయి. అప్పుల భారం, కార్యనిర్వహణ వైఫల్యాల కారణంగా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ 2024 నవంబర్‌లోనే దివాలా తీసినట్టు ప్రకటించింది. ఆ తరువాత పునర్‌వ్యవస్థీకరణ ప్లాన్‌లో భాగంగా మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించింది. కంపెనీని పూర్తిగా గట్టెక్కించేందుకు మరో ప్రణాళికపై కూడా చర్చలు జరుగుతున్నాయి. సంస్థను ఆదుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం శుక్రవారం ఒక ప్లాన్‌ను ప్రతిపాదించింది. ఇదే తన చివరి ఆఫర్ అని కూడా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఈ క్రమంలోనే స్పిరిట్ ఎయిర్‌లైన్స్ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...