వైసీపీలో అంబటి వర్సెస్ ముద్రగడ.. ఎందుకంటే?

posted on: Apr 6, 2026 3:42PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు ఓటు బ్యాంకుకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడమే లక్ష్యంగా వైసీపీ చాలా సీరియస్ గా పావులు కదుపుతోంది. కాపు ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు అంబటి తనదైన స్టైల్ లో చేయగలిగినన్న ప్రయత్నాలూ చేస్తున్నారు. కాపులలో సానుభూతి పొందేందుకూ, వారికి దగ్గరయ్యేందుకు ఆయన ఏకంగా జైలుకు వెళ్లి వచ్చారు. ఇలా ఆయన జైలుకు వెళ్లారో లేదో.. అలా వైసీపీయులు ఆయనను కాపు నేత అంటూ ఆకాశానికి ఎత్తేశారు.  అక్కడితో ఆగకుండా ఏకంగా దివంగత వంగవీటి రంగాతో సమానమైన నాయకుడంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు.  

ఈ నేపథ్యంలోనే పార్టీలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి  తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.  ఇందుకు   తార్కానాలు కూడా చూపుతున్నారు. 

ఇటీవల అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన , అంబటిని ముద్రగడ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు.  కాపు నాయకుడిగా అంబటి తన తరువాతే అని చాటేందుకే ముద్రగడ అంబటి నివాసానికి వెళ్లి పరామర్శ పేరుతో తనను తాను కాపు లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  కాపు సామాజిక వర్గంలో ఎవరైనా సరే తనతో సమానంగా కానీ, తనను మించి గానీ పేరు తెచ్చుకోవడాన్ని ముద్రగడ జీర్ణించుకోలేరని ఆ సమాజికవర్గంలోనే టాక్ ఉంది. ముద్రగడ జనసేనాని పవన్ కల్యాణ్ ను వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అదేనని కూడా అంటారు. 

 ఇక ప్రస్తుతానికి వస్తే.. కాపు నేతలను ఏకం చేస్తాననీ, వారిని వైసీపీ వైపు తీసుకువస్తానని ఇటీవలి కాలంలో ముద్రగడ అడిగిన వారీకి అడగని వారికీ కూడా అదే పనిగా చెబుతున్నారట. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం, జనసేప పార్టీలలో ఉంటూ.. సరైన గుర్తింపు లేదన్న అసంతృప్తితో ఉన్న నాయకుల కోసం గాలిస్తున్నారట. అటువంటి నాయకులతో సమావేశాలు నిర్వహించి, వారిని వైసీపీలోకి ఆహ్వానించాలన్నదే ఆయన వ్యూహంగా చెబుతున్నారు.  

అయితే ఇక్కడ ముద్రగడకు ఎదురైన చిక్కు ఏమిటంటే.. ఆయన ప్రయత్నాలకు వైసీపీయుల నంచే వ్యతిరేకత వస్తున్నది. ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాల కాపు కోఆర్డినేటర్లు ఈ విషయంలో ముద్రగడను బలంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.  ఇప్పుడు కూటమిలోని కాపు నేతలన పార్టీలోకి ఆహ్వానించి తన పదవులకు, ఉనికికి ముద్రగడ ఎసరుపెట్టేలా ఉన్నారన్నదే వారి వ్యతిరేకతకు కారణమంటున్నారు.

ఇక్కడే వారు ముద్రగడ తన పేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతిని గుర్తు చేస్తూ.. తగుదునమ్మా అని ఇప్పుడు కాపులను ఏకం చేస్తాననడమేంటని ప్రశ్నిస్తున్నారు.  ఆయన ప్రయత్నాలు పార్టీకి చెడ్డపేరు తీసుకురావడమే కాకుండా, కాపు సామాజికవర్గాన్ని వైసీపీకి దూరం చేస్తాయని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో కాపు సామాజికవర్గానికి లీడర్ ఎవరు అన్న విషయంలో అంబటి వర్సెస్ ముద్రగడగా సీన్ మారిందని వైసీపీలోనే గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఈ రేస్ లో ఎవరు గెలుస్తారో?  

google-ad-img
    Related Sigment News
    • Loading...