హైకోర్టుకు అంబటి రాంబాబు.. ఎందుకంటే?

posted on: Apr 7, 2026 3:45PM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు.  అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించింది ఏదో కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం కాదు. గతంలో తనను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో కస్టడీలో అమానుషంగా ప్రవర్తించారనీ, శారీరక హింసకు గురిచేశారనిఆరోపిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేర తనను కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని  కోరుతూ అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

 తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం విషయంలో  రాష్ట్రంలో  తీవ్ర   రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును  కొద్ది రోజుల కిందట  గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు  అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను  చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  అరెస్టై, ఆ తరువాత రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలులో ఉండి, ఆ తరువాత బెయిలుపై బయటకు వచ్చిన ఇన్ని రోజుల తరువాత.. నల్లపాడు పోలీసు స్టేషన్ లో తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారంటూ అంబటి హైకోర్టును ఆశ్రయించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.

ఇప్పటి వరకూ ఆయన పలు సందర్భాలలో తన అరెస్టు అక్రమం అని చెప్పారే కానీ, పీఎస్ లో తన పట్ల అమానుషంగా ప్రవర్తించారనిగానీ, శారీరకంగా హింసించారని కానీ ఎన్నడూ చెప్పలేదు. పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనీ, ఒక మాజీ మంత్రిని ట్రీట్ చేయాల్సినట్లుగా మర్యాదగా వ్యవహరించలేదని అటూ వచ్చారు. 

 అటువంటిది ఇప్పుడు ఏకంగా తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారనీ, నేలపై కూర్చోబెట్టి అమానుష పద్ధతుల్లో హింసించారనీ ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   అంబటి  పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, దీనిపై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వం,  పోలీసు శాఖను ఆదేశించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...