Latest News

అమ‌రావ‌తే ఏపీ శాశ్వత రాజధాని.. జగన్ వచ్చినా చేసేదేం లేదు.. చేయగలిగిందీ లేదు!

posted on: Mar 29, 2026 7:22AM

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఏక‌గ్రీవ తీర్మానం సంగ‌తి స‌రే.. రేపు జ‌గ‌న్ వ‌చ్చినా?  ఈ ప్రాంతాన్ని  రాజ‌ధానిగా  హోదా మార్చ‌డానికి వీల్లేదా? అంత‌గా ఈ చ‌ట్టంలో, ఈ తీర్మానంలో ఏముంది?  అమ‌రావ‌తి విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం కేవ‌లం ఒక సాధార‌ణ  తీర్మానం  కాదు. ఇది ఒక చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ర‌క్ష‌ణ  క‌వ‌చం అంటూ లీగ‌ల్ షీల్డ్.  సపోజ్.. ఫర్ సపోజ్ వచ్చే ఎన్నికలలో జ‌గ‌న్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా,    మ‌రెవ‌రైనా అధికారంలోకి వ‌చ్చినా  కూడా ఏమీ చేయలేనంత‌గా ఈ తీర్మానం ఒక మాస్టర్ ప్లాన్ అంటున్నారు. ఇంతకీ అదేంటి?  

ఈ తీర్మానంలో ప్రధానంగా ప్ర‌స్తావించిన సెక్ష‌న్ 5 స‌వ‌ర‌ణ అత్యంత కీల‌కం. 2014 ఏపీ  పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ ఐదు ప్ర‌కారం.. హైద‌రాబాద్  ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి  రాజ‌ధానిగా  ఉంది.  ఆ త‌ర్వాత ఏపీకి కొత్త రాజ‌ధాని ఉండాల‌ని ఉంది. కానీ, దాని పేరు అమ‌రావ‌తి అని ఎక్క‌డా స్ప‌ష్టంగా లేదు. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అనే ద‌గ్గ‌ర అమ‌రావ‌తి అనే ప‌దాన్ని చేర్చాల‌ని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం (మార్చి 28) తీర్మానం చేసింది.   ఒక్క‌సారి పార్ల‌మెంటు ఈ స‌వ‌ర‌ణ‌ను ఆమోదిస్తే, అమ‌రావ‌తి అనేది  కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్ర‌మే తీసుకునే నిర్ణ‌యం కాబోదు.. ఇది కేంద్ర చ‌ట్టంలో ఒక భాగం అవుతుంది.

సాధార‌ణంగా రాజ‌ధాని ఎక్క‌డా ఉండాల‌నేది రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకోవ‌చ్చు. గ‌తంలో జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల బిల్లు తెచ్చిన‌ట్టు..అయితే ఒక సారి అమరావతి రాజథాని అని  కేంద్ర ప్ర‌భుత్వం   రిక‌గ్నైజేష‌న్ యాక్ట్ లోకి వెళ్తే..  దాన్ని మార్చాలంటే మ‌ళ్లీ పార్ల‌మెంటు ఆమోదం కావ‌ల్సిందే. ఒక వేళ  జ‌గ‌న్ వ‌చ్చి మ‌ళ్లీ మూడు రాజ‌ధాని బిల్లు తెచ్చినా అది  కేంద్ర చ‌ట్టానికి విరుద్ధం అవుతుంది. మ‌ళ్లీ కేసులు గ‌ట్రా అయ్యి కాల‌యాప‌న  జ‌రిగి.. ఎటూ  గాకుండా  పోతుంది. అచ్చెన్నాయుడు అన్న‌ట్టు 2019లో జ‌రిగిన‌ట్టు 2029లో గానీ జ‌గ‌న్ వ‌స్తే.. ఇక ఆంధ్ర‌ప్ర‌జ‌ల అవ‌స్థ మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంద‌న్న‌ది  గుర్తుంచుకోవాలి.

ఇంత‌కీ అమ‌రావ‌తి అంటే ఏమిటి? ఆ నిర్వ‌చ‌నం ఎలాంటిద‌ని గ‌మ‌నిస్తే.. ఇది ఒక ఊరు కాదు.. రాజ‌ధాని అభివృద్ధి సాకార సంస్థ‌.. ప‌రిధిలో నోటిఫై చేసిన ప్రాంతం. దీన్నే అమ‌రావ‌తిగా గుర్తించాల‌ని ఈ తీర్మానంలో కోరారు. ఇందువల్ల రాజధాని విస్తీర్ణంపై కూడా చట్టబద్ధమైన క్లారిటీ వచ్చే అవ‌కాశ‌ముంది. గ‌తంలో హైకోర్టు తీర్పు ఇస్తూ.. రాజ‌ధానిని మార్చే అధికారం అసెంబ్లీకి లేద‌ని చెప్పింది. ఇప్పుడీ తీర్మానం ద్వారా కేంద్రం చ‌ట్టం చేస్తే.. ఆ తీర్పున‌కు మ‌రింత బ‌లం చేకూరుతుంది. ఇందువ‌ల్ల భ‌విష్య‌త్తులో ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా రాజ‌ధానిని అంగుళం కూడా క‌దిలించ‌లేదు. ఇదీ ఏపీ సీఎం చంద్ర‌బాబు ధీమా.

ఈ తీర్మానం  ల‌క్ష్యం ఒక్క‌టే. రాజ‌కీయ అస్తిర‌త నుంచి  రాజ‌ధానిని కాపాడడం. ఒక వేళ జ‌గ‌న్ మ‌ళ్లీ  అధికారంలోకి వ‌చ్చి మూడు రాజధానుల పాట మొదలెట్టినా ఫలితం ఉండదు. అందుకే అసెంబ్లీలో అమరావతిని ఏపీ ఏకైక శాశ్వత రాజధానిగా చేసిన తీర్మానానికి అంత ప్రాముఖ్యత.మంత్రి  లోకేష్ చెప్పినట్లు ఈ బిల్లును పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదానికి ప్రవేశ పెట్టి ఆమోదిస్తే.. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతం అవుతుంది. రాజథాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగానికి సార్థకత చేకూరుతుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...