అమరావతికి ఆర్భాటాలు వద్దంటున్న వెంకయ్య
posted on Oct 19, 2015 2:09PM
.jpg)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తుంటే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి, అంతర్జాతీయస్థాయి నగరాన్ని నిర్మించాలనుకోవడం మంచిదే అయినా, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా రాజధాని ఉండాలని వెంకయ్య సూచించారు. కేవలం ఆకాశ హర్మ్యాలు, భారీ భవంతలు కట్టడమే కేపిటల్ కాదని, ఏదైనా సరే అవసరాలకు మించి కట్టడం సరికాదని వెంకయ్య అభిప్రాయపడ్డారు.
కొత్త రాజధానిని అవసరాలకు మంచి కడితే కచ్చితంగా చైనా అనుభవం ఎదురవుతుందని, అక్కడ నగరాలకు నగరాలు ఖాళీగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆకర్షనీయమైన నగరం బార్సిలోనాలో భారీ భవంతులు, ఆకాశ హర్మ్యాలు లేవని... అక్కడ కొత్త కట్టడాలను కట్టకుండానే, ఉన్నవాటిని అందంగా తీర్చిదిద్దారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అందుకే ప్రపంచంలోని అనుభవాలు దృష్టిలో పెట్టుకుని నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించాలని వెంకయ్య సూచించారు.
ఇక అమరావతి శంకుస్థాపనకు హాజరుకానున్న ప్రధాని మోడీ... ఏపీకి ఎలాంటి వరాలిస్తారో తనకు తెలియదన్నారు, అసలు ప్రధాని వరాలు ప్రకటిస్తారో లేదో...ముందే చెప్పలేమన్న ఆయన... అనవసరంగా మాట్లాడి ఆశలు కల్పించడం తనకు ఇష్టం లేదన్నారు. అయినా ఆర్దిక వసతులు, మనకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక తయారు చేసుకోవడమే మంచిదన్నారు. లక్షల కోట్లు అంటూ ఆశలు పెంచి... ఆ తర్వాత నెరవేర్చకపోతే నిరుత్సాహం వస్తుందని అన్నారు. ముందుగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న వెంకయ్యనాయుడు... ఈమధ్య కాలంలో కొత్తగా నిర్మించిన నయా రాయపూర్, అహ్మదాబాద్, డెహ్రాడూన్ లకు కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదని, కేవలం సహకారం మాత్రమే అందించిందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.