ఏపీ చేజార్చుకున్న గోల్డెన్ ఆపర్చునిటీ

posted on: Jul 20, 2026 5:46PM

తెలుగు పారిశ్రామిక రంగంలో  ఒకప్పుడు సంచలనం సృష్టించిన అమర రాజా బ్యాటరీస్ ప్రస్థానం రెండు రాష్ట్రాల్లో రాజకీయ, ఆర్థిక విశ్లేషణలకు కేంద్రబిందువుగా మారింది. అమెరికా నుంచి మాతృభూమిపై ఉన్న   ప్రేమతో తిరిగి వచ్చిన రామచంద్ర నాయుడు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఈ భారీ పారిశ్రామిక సామ్రాజ్యానికి పునాదులు వేశారు. ఆ రోజుల్లో  అప్పటి  ముఖ్యమంత్రి దివంగత ఎన్.టి. రామారావు పారిశ్రామికవేత్తలకు పూర్తి ప్రోత్సాహం అందిస్తూ సబ్సిడీపై భూములు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రాణం పోశారు. చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యావంతులైన వేలాది మంది మహిళలకు స్వయంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తూ అమర రాజా ఒక అద్భుతమైన సామాజిక, ఆర్థిక విప్లవానికి అప్పట్లోనే తెరలేపింది.

అయితే జగన్ హయాంలో మారిన రాజకీయ పరిణామాల కారణంగా ఈ దిగ్గజ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తన విస్తరణను తెలంగాణ వైపు మళ్లించాల్సి వచ్చింది. అమర రాజా వంటి   గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన  రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు. మరోవైపు, ఐటీ,  హెవీ ఇండస్ట్రీ రంగాల్లో ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలిస్తే, సాఫ్ట్‌వేర్ కంపెనీల మాదిరిగా ప్రతికూల పరిస్థితులు రాగానే లాజిస్టిక్స్‌ను సులభంగా తరలించడం భారీ తయారీ రంగానికి ఏ మంత సులభం కాదు.  

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద అమర రాజా సంస్థ ప్రపంచ స్థాయి గిగా ఫ్యాక్టరీ,  భారీ బ్యాటరీ తయారీ కర్మాగారానికి శ్రీకారం చుట్టింది. ఈ ఆధునిక ప్లాంట్ ప్రారంభోత్సవం తెలంగాణ అభివృద్ధి పథంలో మరొక మైలురాయిగా నిలిచిందనడంలో సందేహం లేదు. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి సానుకూల వాతావరణం కల్పించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ప్రకటించారు. గ్లోబల్ టెక్నాలజీని స్థానిక ఉద్యోగావకాశాలతో సమన్వయం చేస్తూ వేలాది మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు అందించే దిశగా అమర రాజా అడుగులు వేస్తోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ గతంలో అమర రాజా విషయంలో జరిగిన పొరపాట్లను ప్రస్తావిస్తూ, రాష్ట్రం తరఫున పారిశ్రామికవేత్తలకు సానుకూల సందేశాన్ని ఇచ్చారు. పరిశ్రమలకు ఏపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, భవిష్యత్తులో అమర రాజా మళ్లీ తమ సొంత రాష్ట్రంలో కొత్త యూనిట్లను ఏర్పాటు చేయవచ్చని   ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల విధానాలు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపించినప్పటికీ, మళ్లీ కొత్త కూటమి ప్రభుత్వం రావడంతో పెట్టుబడులకు సురక్షితమైన వాతావరణం ఏర్పడుతోందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఒక సంస్థ పుట్టుక నుంచి అది రెండు తెలుగు రాష్ట్రాల్లో చూపించిన ప్రభావం,  ఆర్థిక ప్రగతి పరిణామాలు పారిశ్రామిక చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. అటువంటి అమరరాజా విషయంలో కులం, మతం, ప్రాంతం పేరుతో జగన్ ఆడిన క్రూర క్రీడ వల్లే ఏపీ అమరరాజా ఏపీకి దూరం అయ్యిందని సువేరా ఆవేదన వ్యక్తం చేశారు. 

Amara Raja Batteries, Divitipally Giga Factory, Amara Raja AP to Telangana, Ramachandra Galla, Revanth Reddy Amara Raja, Nara Lokesh Industrial Policy

google-ad-img
    Related Sigment News
    • Loading...