అల్వాల్ నిత్య పెళ్లికొడుకు కేసులో సంచలన మలుపు

posted on: Jun 29, 2026 8:05PM

 

అల్వాల్‌లో సంచలనం సృష్టించిన 'నిత్య పెళ్లికొడుకు' కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి కుమార్ అలియాస్ రఫీపై పోలీసులు తాజాగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో రూపేష్ రాజ్‌ను A1గా, రవి కుమార్ అలియాస్ రఫీని A2గా చేర్చారు.

గత ఏడాది ఆగస్టు 28న నమోదైన ఈ కేసులో, జిమ్‌లో పరిచయమైన ఓ మహిళను నిందితులు లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆమె కారులో రహస్యంగా ట్రాకింగ్ డివైస్‌లు అమర్చి, ఆమె ప్రతి కదలికను లైవ్ ట్రాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, బాధిత మహిళతో పాటు ఆమె మైనర్ కుమార్తెను కూడా వేధింపులకు గురిచేసి, అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా సుమతి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ కేసును తిరిగి తెరిచి (రీ-ఓపెన్ చేసి) లోతైన దర్యాప్తునకు ఆదేశించారు. ఆ విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి రావడంతో కేసు మరింత తీవ్రమైంది. దర్యాప్తులో మరో సంచలన విషయం కూడా బయటపడింది. రవి కుమార్ అలియాస్ రఫీ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని పలువురు మహిళలను మోసం చేశాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా, గతంలో కూడా జిమ్‌కు వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు చెబుతున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...