ఆళ్ళగడ్డ ఎన్నిక: కన్ఫ్యూజ్ చేస్తున్న ఎన్నికల కమిషన్
posted on: Apr 28, 2014 5:32PM

ఆళ్ళగడ్డ ఎన్నిక విషయంలో ఎన్నికల సంఘం జనాన్ని అయోమయానికి గురి చేస్తోంది. ఆళ్ళగడ్డ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించడంతో ఆళ్ళగడ్డ ఎన్నికను వాయిదా వేస్తారని అందరూ భావించారు. అయితే ఎన్నికల కమిషన్ ఎక్కడో వున్న ఒక లా పాయింట్ బయటకి తీసుకొచ్చి, వైసీపీ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసుకున్న పార్టీయే తప్ప గుర్తింపు వున్న పార్టీ కాదు కాబట్టి శోభా నాగిరెడ్డి మరణించినా అక్కడ ఎన్నిక వాయిదా వేయాల్సిన అవసరం లేదని తీర్మానించింది.
సరేలే అన్నీ తెలిసిన ఎన్నికల కమిషన్ చెప్పింది కదా అని అందరూ ఊరుకున్నారు. ఈ పాయింట్ చెప్పిన ఎన్నికల కమిషనే మరో పాయింట్ కూడా చెప్పింది. ఈవీఎంలో శోభా నాగిరెడ్డి పేరు వున్న బటన్ పని చేయదని మొదట్లో చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ శోభా నాగిరెడ్డి పేరు మీద బటన్ నొక్కితే ఆ ఓటు ‘నోటా’ అకౌంట్లో చేరుతుందని చెప్పింది. మళ్ళీ ఇంకోసారి శోభా నాగిరెడ్డి తర్వాతి స్థానంలో నిలిచిన వ్యక్తి ఆళ్ళగడ్డ ఎన్నికలో గెలిచినట్టు ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పుడు తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఎన్నికలల ఆళ్ళగడ్డలో శోభా నాగిరెడ్డికి అత్యధిక.. అంటే మరో అభ్యర్థికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పక్షంలో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తుందట. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ వైసీపీకి రాసిన లేఖలో తెలిపింది. అసలు మరణించిన వ్యక్తి పేరును ఈవీఎంలో ఉంచడం ఎందుకు? ఆ వ్యక్తికి ఎక్కువ ఓట్లు వస్తే ఉప ఎన్నిక నిర్వహించడం ఎందుకు? ఈ ఎన్నికల కమిషన్ ఎవరికీ అర్థంకాదు.



.jpg)
.jpg)
.webp)

.webp)


