ఈద్గాలోకి మహిళ అడుగుపెట్టిన వేళ..

posted on: Jul 8, 2016 4:14PM

ఈ రంజాన్ పండుగ లక్నోలోని ముస్లిం మహిళలకు జీవితంలో గుర్తుండిపోతుంది. అందుకు కారణం లేకపోలేదు..లక్నోకు చెందిన చారిత్రక ఐష్‌బాగ్ ఈద్గాలో నమాజ్ చేసుకునేందుకు మహిళలకు తొలిసారి ప్రవేశం కల్పించారు. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈద్గాలో మహిళల ప్రవేశంపై ఎప్పటి నుంచో నిషేధం ఉంది. దీనిపై మహిళలు ఎన్నో ఏళ్లుగా ఉద్యమిస్తున్నా ప్రయోజనం శూన్యం. మహిళల ఆవేదనను అర్థం చేసుకున్న మౌలానా ఖాలిద్ రషీద్ వారి పక్షాన నిలబడ్డారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడైన ఖాలిద్ పలు దఫాలు ఈద్గా పెద్దలతో చర్చలు జరిపి మహిళల ప్రవేశంపై వారిని ఒప్పించారు.

 

ఆయన కృషి ఫలితంగా చరిత్రలో తొలిసారిగా..ఈ రంజాన్ నాడు మహిళలను ఈద్గాలోకి అనుమతించారు. వారికి కేటాయించిన స్థానంలో మహిళలు ప్రార్థనలు చేసుకుని తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.  ప్రార్థనా స్థలాల్లోకి మహిళల ప్రవేశాన్ని నిరోధించడాన్ని నిరసిస్తూ ఆందోళనలు ఊపందుకుంటున్న నేపథ్యంలో మహిళల కోసం ఈద్గా ద్వారాలు తెరచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని ప్రభావం ముంబయిలోని హజిఆలీ దర్గాపై పడే అవకాశం ఉంది.

 

శనిసింగనాపూర్ ఆలయంలోకి అనుమతించాలని కోరుతూ తృప్తి దేశాయ్ ఆధ్వర్యంలోని భూమాత బ్రిగేడ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అది చూసిన కొందరు ముస్లిం మహిళలు ముంబైలోని ప్రఖ్యాత హజీ షౌకత్ ఆలీ దర్గాలోకి ప్రవేశం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు. తమను దర్గాలోకి ప్రవేశించకుండా ఆపుతోంది పురుషులు కాని మతం కాదని ఆరోపించారు. మతం దృష్టిలో అందరూ సమానులే అయినప్పుడు మాపై ఈ వివిక్ష ఎందుకని ప్రశ్నించారు. ఈ ఉద్యమం కాస్త చల్లారినప్పటికీ లక్నో ఈద్గా ప్రభావంతో మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...