Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉద్యోగాల ఎంపికలో AI వాడకంపై తిరుగుబాటు: షాకింగ్ సర్వే వివరాలు ఇవే!
posted on: Aug 6, 2026 2:13PM

నేటి డిజిటల్ యుగంలో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం వేగంగా పెరుగుతోంది. రీజ్యూమ్లను వడపోసేందుకు, అభ్యర్థుల అర్హతలను అంచనా వేసేందుకు అనేక కంపెనీలు ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నాయి. అయితే, ఈ తీరుపై ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మానవ సంబంధాలు, ప్రత్యక్ష సంభాషణలు లేకుండా కేవలం అల్గారిథమ్ల ఆధారంగా తమ జీవితాలను, భవిష్యత్తును నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. యజమానుల ఈ ఏఐ ఆధారిత రిక్రూట్మెంట్ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసన స్వరాలు బలంగా వినిపిస్తున్నాయి. తమ ప్రతిభను ఒక యంత్రం సరిగ్గా మూల్యాంకనం చేయలేదని, దీనివల్ల ఎంతోమంది అర్హులైన యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు.
ప్రముఖ రీసెర్చ్ సంస్థ యూగోవ్ (YouGov) ఇటీవలే బ్రిటన్లో జరిపిన ఒక విస్తృత సర్వేలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 4,926 మంది వయోజనుల అభిప్రాయాలను సేకరించి ప్రచురించిన ఈ నివేదిక ప్రకారం, ఉద్యోగ దరఖాస్తులను పరిశీలించడానికి ఏఐ సాఫ్ట్వేర్లను ఉపయోగించడాన్ని ఏకంగా 64 శాతం మంది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆన్లైన్ లేదా వీడియా కాల్స్ ద్వారా జరిగే ఇంటర్వ్యూల కంటే నేరుగా ముఖాముఖి (ఫేస్-టు-ఫేస్) ఇంటర్వ్యూలలో పాల్గొనడానికే 70 శాతం మంది అభ్యర్థులు మొగ్గు చూపారు. ఈ గణాంకాలు ఉద్యోగార్థులలో పెరిగిపోతున్న అసంతృప్తికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సామాజిక, ఆర్థిక వర్గాల ఆధారంగా కూడా ఏఐ వినియోగంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులలో 30 శాతం మంది ఏఐ ఫిల్టరింగ్ను సమర్థించగా, శ్రామిక లేదా దిగువ తరగతి కుటుంబాలలో ఈ మద్దతు కేవలం 20 శాతానికి పడిపోయింది. అంటే సాధారణ నేపథ్యం నుంచి వచ్చే అభ్యర్థులు ఏఐ విధానాల పట్ల మరింత ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రాంతాలవారీగా పరిశీలిస్తే, లండన్లో 60 శాతం మంది ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూలను కోరుకోగా, దక్షిణ ప్రాంతం మరియు స్కాట్లాండ్లలో ఈ సంఖ్య ఏకంగా 73 శాతంగా నమోదైంది. మిడ్ల్యాండ్స్, వేల్స్ మరియు ఉత్తర ప్రాంతాలలో 69 శాతం మంది నేరుగా కలిసి మాట్లాడే ఇంటర్వ్యూలకే ప్రాధాన్యతనిచ్చారు.
ఈ అంశంపై బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్హామ్ సహితం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'జిమ్మీస్ జాబ్స్ ఆఫ్ ది ఫ్యూచర్' అనే పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, పాండమిక్ తర్వాతి కాలంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎంతమాత్రం న్యాయబద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. జూమ్ లేదా టీమ్స్ వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించే సంస్కృతి యువతలోని అసలైన వ్యక్తిత్వాన్ని, చాతుర్యాన్ని బయటకు తీయలేకపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం మూస ధోరణిలో, ముందే సిద్ధం చేసుకున్న సమాధానాలు చెప్పే వారికి మాత్రమే ఈ డిజిటల్ విధానాలు కలసి వస్తున్నాయని, సహజమైన ప్రతిభ కలిగిన అభ్యర్థులు నష్టపోతున్నారని ఆయన స్పష్టం చేశారు.
workers reject ai hiring,face to face interview preference.






