ఏఐ ఉద్యోగాల కోత కాదు.. అవకాశాల సృష్టి!

posted on: Jun 7, 2026 11:56AM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ రాకతో   ఉద్యోగాలు ఊడిపోతాయని, భవిష్యత్తులో  అన్ని పనులూ ఏఐ  చేసేసి మనుషులను రోడ్డున పడేస్తుందన్నదే ఆ చర్చ. అదే  ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలు కంపెనీటు రిట్రెంచ్ మెంట్ ఆరంభించేశాయి. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. మరో వైపు చూస్తే..    ఏఐ అనేది ఉద్యోగాలను మింగేసే భూతం కాదు.. సరికొత్త ఉద్యోగ విప్లవానికి నాంది పలికే ఒక అవకాశాల సృష్టి.  

గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి.  కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు.   కానీ వాస్తవంగా జరిగిందేమిటి?   కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి.   సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది.   కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది. 

అంత కంటే ముందు జేసీబీ విషయంలోనూ ఇలాంటి భయాలే ఉత్పన్నమయ్యాయి.  జేసీబీని చూసి అంతా.. పది మంది చేసే పనిని జేసీబీ చేసేస్తుంది. ఇక పనులు ఉండవు అంటూ అప్పట్లో జనాలలో తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే వాస్తవంగా జరిగిందేంటి? కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొచ్చాయి. ఔను.. జేసీబీని నడపడానికి ఒకడు, మరమ్మతు చేయడానికి ఒకడు, ఆయిల్ తేవడానికొకడు, రోడ్డు డిజైన్ చేయడానికి ఇంజినీ, రోడ్డు వేసిన తరువాత దానిమీద వాహనాలు పెరిగాయి. పెట్రోల్ బంకులు పెరిగాయి, వాటి రిపేర్ కోసం మెకానిక్ లు ఇలా జెసీబీ రాక పది మంది పనులు పోగొడితే.. కొత్తగా 100 మందికి ఉపాధి కల్పించింది. 

అలాగే కంప్యూటర్ల విషయంలో కూడా.. కంప్యూటర్లు వచ్చినప్పుడు టైపిస్టులు ఉద్యోగాలు పోతాయని బెంబేలెత్తిపోయారు. అయితే వాస్తవంగా జరిగిందేంటి?..  కంప్యూటర్ ఆపరేటర్, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ప్రింటర్లు వాటిని ఆపరేట్ చేయడానికి, రిపేర్ చేయడానికి వందల మందికి అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత  ప్రపంచ ఐటీ రంగాన్ని శాసించే స్థాయికి ఇండియా చేరుకుంది.  
ఇప్పుడు అలాగే ఏఐ వచ్చింది. ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలు పోతాయని బెంబేలెత్తుతున్నారు. కానీ చరిత్రను గమనిస్తే టెక్నాలజీ మారిన ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ఆందోళనలే వ్యక్త మయ్యాయి. కానీ కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతిసారీ పని రూపం మారిందే తప్ప పని పోలేదు. ఏఐ కూడా అంతే.. భయ పడాల్సిన అవసరం లేదు. రిక్షా పోయి, ఆటో వచ్చింది. బైక్ టాక్సీ వచ్చింది. కొత్త ఉపాధి అవకాశాలకు తలుపులు తెరిచింది.  

ఇప్పుడు ఏఐ విషయంలోనూ అంతే.. ఏఐ తెలివైనదే.. కానీ మనిషికీ, మనిషి శ్రమకు ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాదు. ఏఐ 99శాతం పనిని సరిగ్గా చేస్తుంది. కానీ ఆ మిగిలిన ఒక శాతం ఎక్కడ మిస్ అయ్యింది అని కనిపెట్టడానికి అసరమైనది మానవ మేధ మాత్రమే. అంటే ఏఐ ఏం చేయాలో మనిషే చెప్పాలి. ఏఐ చేయలేని దానికి చేయాల్సిందీ మనిషే..  అంటే..  సృజనాత్మకత, నిజమైన అనుభవం, మానవ సంబంధాలు, నైతిక నిర్ణయాలు ఇలాంటివి ఏఐ చేయలేదు. ఎందుకంటే.. వీటికి పుస్తకాల నుంచి నేర్చుకున్న విజ్ణానం సరిపోతు.. ఇవి జీవితం నుంచి నేర్చుకోవలసినవి.  

ఇప్పుడు ఇక చెప్పొచ్చేదేంటంటే.. మానవ మెదడు ఏ కొత్త విషయాన్ని తొందరగా అంగీకరించదు. . అది  జేసీబీ అయినా, కంప్యూటర్ అయినా, తాజాగా ఏఐ అయినా. అయితే..  చరిత్ర చూసిన కంటికి భయం తక్కువగా ఉంటుంది. భూమి మీద మనిషి పుట్టిన దగ్గర నుండి పనిచేస్తున్నాడు. పని రూపం మారింది — పని పోలేదు. పనిచేసే వాడికి ఎప్పుడూ పని ఉంటుంది. అది ఏ యుగంలోనైనా సరే. ఏ సాంకేతికత వచ్చాన సరే. ఏఐ మన ఉపాధి పోగొట్టడానికి కాదు.. కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడానికి. ఏఐ అన్నది మనం ఉపయోగించుకోవడానికి ఒక టూల్.  దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఉద్యోగాలలో కోత.. కాదు అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...