జగన్ ఆరోపణలు పచ్చి అబద్ధాలు.. ఆధారాలతో బయటపెట్టిన అధికారులు

posted on: Jun 12, 2026 10:32AM

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై జగన్ చేస్తున్న ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు  తిప్పికొట్టారు. గురువారం (జూన్ 11) ఉదయం జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై సంచలన విమర్శలు గుప్పించారు.. కానీ అదే రోజు సాయంత్రానికి జనగ్ చేసిన  ఆరోపణలన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని అధికారులు రికార్డుల ఆధారంగా తేల్చేశారు. . క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, శాప్ ఎండీ ఎస్. భరణి సచివాలయంలో  గురువారం (జూన్ 11)  విలేకరుల సమావేశం నిర్వహించి, పక్కా ఆధారాలు,  గణాంకాలతో   వాస్తవాలను వెల్లడించారు. 

మెగా డీఎస్సీలో కేవలం క్రీడల్లో పాల్గొన్న  సర్టిఫికెట్లు ఉన్నవారికే ఉద్యోగాలిచ్చారని, మెడల్స్ సాధించిన అర్హులకు అన్యాయం చేశారంటూ జగన్ చేసిన ఆరోపణలను కొట్టి పారేశారు. జగన్ తన మీడియా మీట్ లో పోలవరానికి చెందిన దుర్గయ్య అనే జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్‌ను తన పక్కన కూర్చోబెట్టుకుని లైవ్ మీడియాలో మాట్లాడించారు. అయితే..  దీనిపై క్రీడల శాఖ ఉన్నతాధికారి అజయ్ జైన్  వివరణ ఇచ్చారు.  దుర్గయ్య జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్ అన్న మాట నిజమే అయినప్పటికీ..  డీఎస్సీ నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ పతకాల సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ దుర్గయ్య ఆ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో విఫలమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో అంగీకరించారు. అభ్యర్థులు తప్పుగా సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేస్తే..  లేదా అప్‌లోడ్ చేయకపోతే ప్రభుత్వం బాధ్యత ఎలా వహిస్తుందని అధికారులు ప్రశ్నించారు. నిబంధనలను అతిక్రమించి ఆయనకు ఉద్యోగం ఇస్తే ఇతర మెరిట్ అభ్యర్థులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక క్రీడల్లో పాల్గొన్న వారికే  ఉద్యోగాలు ఇచ్చారన్న జగన్ విమర్శలపై అధికారులు గట్టి కౌంటర్ ఇచ్చారు.వైసీపీ హయాంలో జీవో 74 ప్రకారం కేవలం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఇంటర్ కాలేజీ, రూరల్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌లలో పాల్గొన్న వారికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో భారీగా పోస్టులు కట్టబెట్టారని అధికారులు చెప్పారు. ఉదాహరణకు ఒక్క అనంతపురం జిల్లాలోనే ఆ కాలంలో జూనియర్ ఇంటర్ జిల్లా పార్టిసిపెంట్లు 24 మందికి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పార్టిసిపెంట్లు 66 మందికి, సీనియర్ ఇంటర్ జిల్లా పార్టిసిపెంట్లు 85 మందికి, రూరల్ ఇంటర్ జిల్లా పార్టిసిపెంట్లు 12 మందికి ఉద్యోగాలు ఇచ్చారని గణాంకాలతో వివరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తెచ్చిన జీవో 4 ప్రకారం కొత్త స్పోర్ట్స్ పాలసీని అమలు చేస్తూ..  ఇంటర్ కాలేజీ స్థాయి పోటీలను పూర్తిగా పక్కనబెట్టి ఒలింపిక్స్ నుంచి,  స్టేట్ ఛాంపియన్‌షిప్ వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని అధికారులు వివరించారు.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసిన మొత్తం 382 ఉద్యోగాలలో ఇటీవల కాలంలో (2025లో) సర్టిఫికెట్లు పొందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని తేల్చిచెప్పారు. యూనివర్సిటీ స్థాయిలో ఇద్దరిని, జూడో గేమ్‌లో ఒకరిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా ఇటీవల సర్టిఫికెట్లు పొందిన కేవలం 9 మంది మాత్రమే మెగా డీఎస్సీ ఉద్యోగాల్లో అర్హత సాధించారని, ఇందులో ఎలాంటి సిఫార్సులు జరగలేదని కుండబద్దలు కొట్టారు.  స్పోర్ట్స్ కోటా కింద కేటాయించిన 421 పోస్టులలో 382 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయని, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోకపోతే ఈ మిగిలిన పోస్టులు కూడా భర్తీ కాకుండా మిగిలిపోయేవని అజయ్ జైన్ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం ప్రకటించిన 6,100 టీచర్ పోస్టుల నోటిఫికేషన్‌ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసి నిరుద్యోగులకు అన్యాయం చేసిందన్న ఆరోపణలపైనా అధికారులు స్పష్టతనిచ్చారు. గత ప్రభుత్వ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందనీ, ఎస్జీటీ పోస్టులకు కేవలం డీఈడీ అభ్యర్థులే అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా..  గత ప్రభుత్వం బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించిందని తెలిపారు. అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని పాటించకపోవడం వల్ల అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారని, అందుకే ఆ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ సాంకేతిక సమస్యలన్నింటినీ పరిష్కరించి, పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి..  రికార్డు స్థాయిలో కొత్తగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి విజయవంతంగా భర్తీ చేసిందని స్పష్టం చేశారు.

ప్రశ్నపత్రాల అప్‌లోడ్ బాధ్యతను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి అప్పగించారన్న ఆరోపణ పూర్తిగా అవాస్తవమని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కొట్టిపారేశారు. డీఎస్సీ పరీక్షల కోసం మొత్తం 42 వేల ప్రశ్నలను సిద్ధం చేసి, అత్యంత సురక్షితమైన  టీసీఎస్ అయాన్' ప్లాట్‌ఫామ్ ద్వారా అప్‌లోడ్ చేశామని తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను దేశవ్యాప్తంగా 20 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నమ్ముతున్నాయని, ఇందులో పేపర్ లీకేజీకి అస్సలు ఆస్కారమే ఉండదని పేర్కొన్నారు. ఈ బాధ్యతను ఇద్దరు అత్యున్నత శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అప్పగించామని, వారే రోజువారీ పాస్‌వర్డ్‌లను మార్చారని వివరించారు. కలెక్టర్ల ప్రమేయం లేకుండానే నియామక ప్రక్రియ కేంద్రీకృతంగా జరిగిందన్న వాదనను తిప్పికొడుతూ, అభ్యర్థులకు కలెక్టర్ల సంతకాలతోనే నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయని అధికారులు ఆధారాలు చూపించారు. అభ్యర్థులు ఎవరూ సోషల్ మీడియా అపోహలను నమ్మవద్దని, జాబ్ క్యాలెండర్ ప్రకారం రాబోయే అక్టోబర్‌లో మరో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని అధికారులు ఈ సందర్భంగా చెప్పారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...