ఏపీ మద్యం కుంభకోణం కేసు.. నాగేశ్వరరెడ్డి తరువాత సిట్ విచారణకు జగన్?

posted on: May 29, 2026 11:09AM

ఆంధ్రప్రదేశ్‌  మద్యం కుంభకోణం కేసు   కీలక మలుపు తిరిగింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సాగిన ఈ భారీ కుంభకోణంపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం  విచారణ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులుగా భావిస్తున్న పలువురు వైసిపి నేతలను దర్యాప్తు అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించి, వారి నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను సేకరించారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ  ఈ కుంభకోణంలో కేవలం అవినీతి మాత్రమే కాకుండా భారీగా మనీ లాండరింగ్ వ్యవహారాలు కూడా జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమవుతుండటం గమనార్హం. దాంతో ఈ కేసులో  కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగ ప్రవేశం చేసింది. అదలా ఉంటే..  సిట్ తాజాగా  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్  వ్యక్తిగత సహాయకుడు (పీఏ) నాగేశ్వర్ రెడ్డిని విచారించారు.  

విజయవాడలో గురువారం (మే 28) సిట్ అధికారులు నాగేశ్వర్ రెడ్డిని ఏకంగా తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా, ఏకధాటిగా ప్రశ్నించారు. ఈ 9 గంటల మారథాన్ విచారణలో అధికారులు నాగేశ్వర్ రెడ్డి వ్యక్తిగత మరియు అధికారిక బ్యాంక్ ఖాతాల లావాదేవీల చిట్టాను పూర్తిగా పరిశీలించారు. అంతేకాకుండా.. గత ఐదేళ్ల కాలంలో ఆయన తన కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు,   బినామీల పేర్ల మీద కొనుగోలు చేసిన స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు కూపీలాగారు. నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాగేశ్వర్ రెడ్డి సీఎం పీఏగా చక్రం తిప్పారని, ఆయన మాటకు అప్పట్లో తిరుగులేకుండా పోయిందని రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం ఉంది. ఇదే అండతో ఆయన మద్యం పాలసీ రూపకల్పనలో, మద్యం కంపెనీల నుంచి ముడుపుల వసూళ్లలో కీలక పాత్ర పోషించారనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మద్యం కుంభకోణం ద్వారా అక్రమంగా ఆర్జించిన కోట్లాది రూపాయల సొమ్ముతోనే నాగేశ్వర్ రెడ్డి తన భార్య, పిల్లలు,  బంధువుల పేర్లపై విలువైన భూములు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గత కొంతకాలంగా నాగేశ్వర్ రెడ్డి కదలికలపై నిఘా ఉంచిన సిట్' అధికారులు, పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయన్ను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా నాగేశ్వరరెడ్డిని శుక్రవారం (మే 29) కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం సాగుతున్న ఈ పూర్తి స్థాయి విచారణ ముగిసిన  అనంతరం ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.  ఒకవేళ జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన పీఏ నాగేశ్వర్ రెడ్డి గనుక అరెస్ట్ అయితే, ఈ కేసులో తదుపరి టార్గెట్ నేరుగా  జగన్ అవుతారా? అన్న ఉత్కంఠ రాజకీయవర్గాలలో వ్యక్తమౌతున్నది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...